ఫుల్ గ్లామర్: గీతారెడ్డి, సగముంటేచాలని కెటిఆర్
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ లాబీలో మంగళవారం పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారకరామారావు, మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే గీతారెడ్డి మధ్య ఆసక్తికర సంభాషణలు చోటు చేసుకున్నాయి. ఈ సందర్బంగా వారు ఒకరినొకరు పొగడ్తలతో అభినందించుకున్నారు.
తనను చుట్టుముట్టిన మీడియా ప్రతినిధులతో మంత్రి కెటి రామారావు మాట్లాడుతుండగా.. అటుగా వెళుతున్న గీతారెడ్డి మంత్రిని ఉద్దేశించి ఫుల్ గ్లామర్గా ఉన్నారని అన్నారు. అంతేగాక, ‘మీరు మీడియాతో మాట్లాడుతున్నట్లుగా లేదు. సినిమా యాక్టర్లాగా అందరికీ ఆటోగ్రాఫ్ ఇస్తున్నట్లుగా ఉంది' గీతారెడ్డి అన్నారు.
దీనికి స్పందించిన మంత్రి కెటి రామారావు ఈ వయస్సులోనూ మీరు గ్లామరస్గా ఉన్నారు. మీ వయస్సు వచ్చే నాటికి మీలో సగం గ్లామర్గా ఉన్నా చాలా సంతోషం అని చమత్కరించారు. గీతారెడ్డి, కెటిఆర్ సంభాషణలతో నవ్వులు పూయడంతో అక్కడ అహ్లాదకర వాతావరణం ఏర్పడింది.
అంతకుముందు కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ.. వేసవి కాలంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా, ప్రజల దాహార్తిని తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసిందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామస్థాయిలో తాగునీటి అవసరాల కోసం వేసవి కార్యాచరణ ప్రణాళికను రూపొందించామని, దీని అమలుకు రూ.263 కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు.