మహబూబ్ నగర్ ఎంపీ సీటుపై కాంగ్రెస్ లో ఆసక్తికర చర్చ..! పోటీ పై డీకే అరుణ స్పందన..!!
హైదరాబాద్ : కొన్ని సందర్బాల్లో కాంగ్రెస్ పార్టీ కొన్ని రాజకీయ నిర్ణయాల గురించి లోతుగా ఆలోచిస్తుంటుంది. అంతే కాకుండా ఆచితూచి అడుగులు వేస్తుంటుంది. కొన్ని సందర్బాల్లో ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశాన్ని తేలికగా కొట్టిపారేస్తుంది. తేలిగ్గా తీసుకోవాల్సిన అంశానికి ఎక్కడలేని ప్రాధాన్యత ఇస్తుంది. ఏది చేసినా అది కాంగ్రెస్ పార్టీకే సొంతం. ఇక ఎన్నికల సమయంలో ఆపరా్టీ అనుసరించే విధానాలు పక్క పార్టీలను సైతం ఆకర్శిస్తుంటాయి. అదిష్టానం చర్యలకు ఆశావహుల ప్రతి చర్యలు కూడా ఆసక్తికరంగా సాగిపోతుంటాయి. ఇలాంటి సంఘటనలకు కాంగ్రెస్ పార్టీ వేదిక కావడం మరింత కిక్కిచ్చే అంశంగా మారింది.
ఇక పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపధ్యంలో తెలంగాణ కాంగ్రెస్ కమిటీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ పోటీ విషయంలో నేతల మద్య అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. సీఎల్పీలో జరిగిన తాజా సమావేశంలో టీపిసిసి ముఖ్యనేతలు హాజరయ్యారు. యాద్రుచ్చికంగా జరిగిన సంభాసణలో మహబూబ్ నగర్ లోక్ స్థానం ప్రస్థావనకు వచ్చింది. మహబూబ్ నగర్ లోక్ సభ స్థానం నుండి పోటీ చేయాల్సిందిగా డీకే అరుణ ను భేటీలో పాల్గొన్న ఓ సీనియర్ కాంగ్రెస్ నేత కోరారు.
శాసన సభ ఎన్నికల్లో తలకు మించిన ఖర్చు వచ్చి పడిందని, ఇప్పుడు పోటీ చేసే సత్తా తనకు లేదని డీకే అరుణ తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా మమబూబ్ నగర్ నుండి ఎప్పుడూ పోటీ చేసే జయపాల్ రెడ్డి ఉండగా తననెందుకు ప్రతిపాదిస్తున్నారని అరుణ ఎదురు ప్రశ్నించినట్టు సమాచారం. ఇప్పుడు అక్కడ పరిస్థితి బాగాలేదు కాబట్టి తనను పోటీ చేయమని కోరుతున్నట్టు మరో నేత బదులు ఇచ్చినట్టు సమాచారం. అందుకు డీకే అరుణ గట్టిగేనే సమాధానం చెప్పారట. పార్టీ పరిస్థితి బాగుంటే సీనియర్లు వచ్చి పెత్తనం చెలాయిస్తారు.. లేకపోతే స్థానిక నేతలకు వదిలేస్తారా అని కొంచెం డోస్ పెంచి నిలదీసిందట జేజెమ్మ. దీంతో సమావేశంలో పాల్గొన్న నేతలు అవాక్కైనట్టు తెలుస్తోంది.