దివ్య హత్య కేసులో ట్విస్టులు : టెన్త్ నుంచి ఇప్పటివరకు అసలేం జరుగుతూ వచ్చింది..?
Recommended Video
సిద్దిపేట జిల్లా గజ్వేల్లో బ్యాంకు ఉద్యోగిని దివ్య హత్యోదంతం మలుపులు తిరుగుతోంది. ప్రాథమిక అంచనా ప్రకారం పక్కా ప్లాన్తోనే హత్య జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. రెక్కీ నిర్వహించిన తర్వాతే దివ్య హత్య జరిగిందని అనుమానిస్తున్నారు. వెంకటేశ్ హత్య చేసి ఉండడని అతని తండ్రి పరుశురాం చెబుతున్నప్పటికీ.. పోలీసులకు మాత్రం అతని పైనే అనుమానం కలుగుతోంది. సంచలనం రేకెత్తించిన ఈ హత్య కేసులో పూర్వ పరాలపై పోలీసులు మరింత లోతుగా దృష్టి సారించారు. వేములవాడ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన వెంకటేశ్ నుంచి నిజాలు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు.
ఒకప్పుడు వేములవాడలో దివ్య కుటుంబం..
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన న్యాలపల్లి లక్ష్మీరాజం-మణెమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. వీరిలో దివ్య చిన్న కుమార్తె. గతంలో దివ్య తండ్రి లక్ష్మీరాజం వేములవాడ ఆలయం వద్ద కిరాణ షాపు నిర్వహించేవాడు. ఆ సమయంలో కుటుంబం వేములవాడలోనే ఉండేది. దివ్య ఓ ప్రైవేట్ స్కూల్లో చదివేది. అదే స్కూల్లో వెంకటేశ్ కూడా చదివేవాడు. ఇద్దరూ ఒకే క్లాస్ కావడంతో దివ్యకు దగ్గరవడానికి వెంకటేశ్ ప్రయత్నించేవాడు. ఈ క్రమంలో ఆమెను ప్రేమ పేరుతో వేధించానేది దివ్య తల్లిదండ్రుల ఆరోపణ.
వేములవాడ నుంచి హైదరాబాద్కు మకాం..
స్కూలింగ్ అయిపోయి ఇంటర్మీడియట్లో చేరాక కూడా వెంకటేశ్ వేధింపులు ఆగలేదని దివ్య తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీనిపై అప్పట్లో వేములవాడ, ఎల్లారెడ్డిపేట పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు కూడా చేశామని చెబుతున్నారు. దివ్య తన ప్రేమను నిరాకరిస్తోందన్న కారణంతో వెంకటేశ్ ఓసారి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు కూడా యత్నించాడని చెప్పారు. ఆ సమయంలో అతని కుటుంబ సభ్యులు తమ ఇంటి పైకి దాడికి వచ్చారన్నారు. దీంతో వేములవాడలో ఉండటం ఇష్టం లేక హైదరాబాద్ వెళ్లిపోయామని.. అక్కడే తమ కుమార్తె ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసి గ్రామీణ వికాస్ బ్యాంకులో ఉద్యోగం సాధించిందని చెప్పారు.
వెంకటేశ్ పైనే అనుమానాలు..
ఉద్యోగం వచ్చాక దివ్యకు సంబంధాలు చూడటం మొదలుపెట్టిన తల్లిదండ్రులు వరంగల్కు చెందిన సందీప్తో ఇటీవలే పెళ్లి కుదిర్చారు. నెల 26న పెళ్లి జరగాల్సి ఉంది. అయితే దివ్య మరొకరిని పెళ్లి చేసుకుంటుందన్న కక్షతో వెంకటేశ్ ఆమెను హత్య చేసేందుకు ప్లాన్ చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందుకోసం గజ్వేల్లోని దివ్య ఇంటి వద్ద రెక్కీ కూడా చేశాడని అనుమానిస్తున్నారు. మంగళవారం ఇంట్లో ఎవరూ లేకపోవడంతో.. అదును చూసి ఇంట్లోకి చొరబడి హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అతని సెల్ఫోన్ సిగ్నల్ కూడా గజ్వేల్లోనే చూపించడంతో అనుమానాలు బలపడుతున్నాయి.
కఠినంగా శిక్షించాలన్న డిమాండ్..
వెంకటేశ్ను పట్టుకునేందుకు సిద్దిపేట పోలీసులు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో వేములవాడలోని అతని తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంకటేశ్.. పోలీస్ స్టేషన్కు వచ్చి లొంగిపోయాడు. దీంతో అతన్ని అరెస్ట్ చేసిన వేములవాడ పోలీసులు సిద్దిపేట పోలీసులకు అప్పగించారు. గురువారం అతన్ని కోర్టులో హాజరుపరిచి.. కస్టడీ కోరే అవకాశం ఉంది. మరోవైపు దివ్య తల్లిదండ్రులు వెంకటేశ్ను కూడా అదే రీతిలో హతం చేయాలని డిమాండ్ చేశారు. తమ బిడ్డను పొట్టనపెట్టుకున్నవాడికి కఠిన శిక్ష విధించాలంటున్నారు.
వెంకటేశ్ తండ్రి వాదన..
దివ్య హత్య కేసులో అనుమానాలన్నీ వెంకటేశ్ చుట్టే తిరుగుతుండగా.. అతని తండ్రి పరుశురాం మాత్రం తన కొడుకు అలాంటివాడు కాదని బలంగా చెబుతున్నాడు. అంతేకాదు, వెంకటేశ్, దివ్య ప్రే మించి పెళ్లి చేసుకున్నారని చెప్పాడు. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారని.. దీంతో దివ్యను ఆమె కుటుంబం వేములవాడలోనే వదిలిపెట్టి పోయిందన్నారు. ఆ తర్వాత దివ్యను తానే స్వయంగా డబ్బులు ఖర్చు పెట్టి హైదరాబాద్లోని హాస్టల్లో ఉంచి చదివించానని చెప్పారు. అయితే ఉద్యోగం వచ్చాక దివ్య మారిపోయిందని.. వెంకటేశ్ను దూరం పెట్టడటంతో అతను మానసికంగా కుంగిపోయాడని తెలిపారు. తన కుమారుడు చాలా పిరికివాడని,అతనికి హత్య చేసేంత ధైర్యం లేదని అన్నాడు.