ఆసక్తి రేపుతున్న ఆర్థిక శాఖ..! అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టేది ముఖ్యమంత్రి కేసీఆరేనా...?
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రజా పరిపాలనలో దూసుకెళ్తున్నా కొన్ని అంశాల్లో సందగ్దత నెలకొంది. కొన్ని కీలక శాఖలు ముఖ్యమంత్రి తనదగ్గరే అట్టిపెట్టుకోవడం, ఇంతవరకు క్యాబినెట్ విస్తరించకపోవడం వంటి అంశాలు ప్రభుత్వం వర్గాలను కలవరానికి గురిచేస్తున్నాయి. పూర్తి స్థాయి బడ్జెట్ కోసం కసరత్తు జరుగుతున్న సందర్బంలో అసలు శాసన సభలో ఎవరు బడ్జెట్ ప్రవేశ పెడతారు అనే అంశం పై సస్పెన్స్ కొనసాగుతోంది.
Recommended Video
ఆర్ధిక శాఖను ఇప్పటి వరకూ సీఎం చంద్రశేఖర్ రావు తన వద్దనే ఉంచుకోవడంతో ఈ ప్రశ్న ఉత్పన్నమవుతున్నట్టు తెలుస్తోంది. ఇంతకి చంద్రశేఖర్ రావు బడ్జెట్ సమావేశాలలోపు మంత్రవర్గాన్ని విస్తరించి ఆర్ధిక మంత్రిని నియమిస్తారా..? లేక ముఖ్యమంత్రే స్వయంగా బడ్జెట్ ప్రవేశ పెడతారా అనే అంశం ఆసక్తి రేపుతోంది.
తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ..! ఆర్థిక శాఖ కు మంత్రి నియమిస్తారా..?
పూర్తిస్థాయి రాష్ట్ర బడ్జెట్ను వచ్చే నెలలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో.. ఇప్పుడు అందరి దృష్టి ఆర్థికశాఖ మంత్రిపై పడింది. రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకూ ఆ శాఖకు మంత్రిని నియమించని సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ శాఖను తన వద్దే ఉంచుకున్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు ఆయనే స్వయంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రతిపాదించారు. ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్ రూపకల్పనకు కసరత్తులు ఊపందుకున్న తరుణంలో మళ్లీ ముఖ్యమంత్రే పద్దును ప్రవేశపెడతారా..? లేక క్యాబినెట్ బెర్తులన్నింటినీ నింపటం ద్వారా కొత్త ఆర్థిక మంత్రి చేత బడ్జెట్ను ప్రవేశపెట్టిస్తారా...? అనేది ఇప్పుడు చర్చగా మారింది.
త్వరలో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు..! బడ్జెట్ ప్రవేశపెట్టేది ఎవరు..!!
దీనికి కొనసాగింపుగా ఇప్పటికిప్పుడు మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాల్లేవనే వాదన కూడా ముందుకొస్తున్నది. అందువల్ల ఆర్థిక శాఖకు కొత్త మంత్రి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. గతేడాది డిసెంబరులో రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కేసీఆర్ పాలనలో నిదానంగా ముందుకు సాగుతూ వస్తున్నారు. తొలుత తనతోపాటు డిప్యూటీ సీఎంగా మహమూద్ అలీతో ప్రమాణం చేయించారు. ఆ తర్వాత దాదాపు రెండు నెలల వరకు మంత్రివర్గ విస్తరణ చేపట్టలేదు. ఫిబ్రవరిలో క్యాబినెట్ను విస్తరించినప్పటికీ కొన్ని శాఖలకే మంత్రులను నియమించారు.
గతంలో కేసీఆర్ ఓటాన్ అకౌంట్..! తర్వాత ఏంటి..!!
ఇదే సమయంలో కీలకమైన ఆర్థికశాఖను మాత్రం ఎవ్వరికీ కేటాయించకుండా తన దగ్గరే ఉంచుకున్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టే వీలు లేకపోవడంతో సీఎం ఓటాన్ అకౌంట్తో సరిపెట్టారు. ఇప్పుడు ఎన్నికలు ముగిశాయి. కేంద్రం కూడా పూర్తిస్థాయి బడ్జెట్కు రంగం సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ, కొత్త ఆర్థిక మంత్రి అనే అంశాలు ముందుకొస్తున్నాయి. అయితే సీఎం దృష్టి మాత్రం వీటిపై లేదని అధికార పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. కాళేశ్వరం ప్రారంభోత్సవంతో కొనసాగిన హడావుడి ఇప్పుడు ముగిసింది. దీని వెంటనే ఈనెల 27న నూతన సచివాలయానికి శంకుస్థాపన చేస్తామంటూ ముఖ్యమంత్రి ప్రకటించారు.
జూలై మొదటి వారంలో సమావేశాలు..!ముఖ్యమంత్రి మనసులో ఏముందో..!!
మరోవైపు జిల్లాల్లో టీఆర్ఎస్ కార్యాలయాలకు శంకుస్థాపనలు, వాటి పనులు, ప్రారంభోత్సవాల కార్యక్రమాలు జులై వరకూ కొనసాగనున్నాయి. ఈ మధ్యలో మున్సిపాల్టీ ఎన్నికల ప్రక్రియ ముందుకు రానుంది. ఇవన్నీ పూర్తయ్యే లోపే జులై మొదటి లేదా రెండో వారంలో బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. అందువల్ల మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండబోదని టీఆర్ఎస్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఇదే జరిగితే పూర్తిస్థాయి బడ్జెట్ను కూడా ముఖ్యమంత్రే ప్రవేశపెడతారని ఆర్థికశాఖకు చెందిన ఓ అధికారి వ్యాఖ్యానించడం విశేషం.