తెలంగాణపై తీవ్రమైన చర్యులొద్దు: హైకోర్టు, ఏపీకి విద్యుత్ బకాయిల వ్యవహారం
హైదరాబాద్: తెలంగాణ సర్కారుకు ఊరట లభించింది. ఏపీ విద్యుత్ సంస్థలకు రూ. 7వేల కోట్ల బకాయిలు చెల్లించాలన్న కేంద్ర విద్యుత్ శాఖ ఉత్తర్వులపై తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ పి నవీన్ రావు, జస్టిస్ సాంబశివనాయుడు ధర్మాసనం విచారణ చేపట్టింది. తెలంగాణపై తీవ్రమైన చర్యలకు దిగొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుశ్యంత్ దవే, ఏపీ తరపున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్ రెడ్డి, కేంద్రం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ సూర్యకరణ్ రెడ్డి వాదనలు వినిపించారు. పునర్ విభజన చట్టం ప్రకారం దక్షిణ ప్రాంతీయ మండలి చర్చలు జరిపి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, కేంద్రానికి ఆ అధికారం లేదని తెలంగాణ వాదించింది. పునర్విభజన వివాదాలపై కూడా నిర్ణయాధికారం కేంద్ర హోంశాఖకు ఉండగా, కేంద్ర విద్యుత్ శాఖలో డిప్యూటీ సెక్రటరీ స్థాయి అధికారి ఉత్తర్వులు ఎలా ఇస్తారని వాదించింది.
రాష్ట్రపతి ఎన్నికల్లో ఏపీ అధికార పార్టీకి సహకరించినందుకే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చారని దుశ్యంత్ దవే వాదించారు. మరోవైపు, రాష్ట్ర విభజన తర్వాత సరఫరా చేసిన విద్యుత్ బిల్లుల అంశానికి పునర్విభజన చట్టం సంబంధం లేదని ఏపీ వాదించింది. ఏపీ జెన్ కో సరఫరా చేసిన విద్యుత్ కు బిల్లులు చెల్లించాల్సిన బాధ్యత తెలంగాణ సంస్థలకు ఉందని సీవీ మోన్ రెడ్డి వాదించారు. అప్పులు తీసుకుని విద్యుత్ ఉత్పత్తి చేశామని, బిల్లులు చెల్లించకపోతే తాము నష్టపోతామని తెలిపారు. దక్షిణ ప్రాంతీయ మండలికి చట్టబద్ధత లేదని, అయినప్పటికీ అక్కడ విచారణకు ఎలాంటి ఫలితం రాలేదన్నారు.
మరోవైపు, కేంద్ర విద్యుత్ శాఖ జోక్యంతోనే తెలంగాణకు ఏపీ సరఫరా చేసినందున.. బిల్లుల బకాయిల విషయంలో జోక్యం చేసుకునే అధికారం తమకు ఉంటుందని కేంద్రం వాదించింది. అన్నివైపులా వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. పూర్తి స్థాయి విచారణకు కౌంటర్లు దాఖలు చేయాలని తెలంగాణ, ఏపీ విద్యుత్ సంస్థలను ఆదేశించింది.
అంతేగాక, అప్పటి వరకు తెలంగాణపై కఠిన చర్యలు తీసుకోవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ వివరణ, వాదన వినకుండానే కేంద్రం ఉత్తర్వులు ఇవ్వడం చట్టవిరుద్ధంగా కనిపిస్తోందని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. పిటిషన్ పై తదుపరి విచారణను అక్టోబర్ 18కి వాయిదా వేసింది.
అంతకుముందు ఏం జరిగిందంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రం చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలపై కేంద్ర విద్యుత్ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రం బకాయిపడ్డ రూ.3,441 కోట్లు ప్రిన్సిపల్ అమౌంట్ ను, రూ.3,315 కోట్ల లేట్ పేమెంట్ సర్ చార్జీ చెల్లించాలని పేర్కొంది. ఆ బకాయిలను తెలంగాణ రాష్ట్రం 30రోజుల్లోగా చెల్లించాలని కేంద్ర విద్యుత్ శాఖ స్పష్టం చేసింది. 2014-17 వరకు తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలకు (డిస్కంలకు) సంబంధించిన విద్యుత్ సరఫరా బకాయిలుగా కేంద్రం పేర్కొంది.