తెలంగాణలో ఇంటర్ పరీక్షలు జూన్ 3న: కళాశాలల ప్రారంభంపై బోర్డు క్లారిటీ
హైదరాబాద్: కరోనా లాక్డౌన్ నేపథ్యంలో వాయిదా పడిన ఇంటర్మీడియట్ పరీక్షలను నిర్వహించేందుకు రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు(బీఐఈ) ఏర్పాట్లు చేసింది. జూన్ 3న ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం జాగ్రఫీ, మోడ్రన్ లాంగ్వేజెస్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ తెలిపారు.
ఇంటర్ బోర్డు వెబ్సైట్లు నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో పరీక్షలకు హాజరుకాకపోతే మరోసారి పరీక్ష రాసే అవకాశం ఉంటుందని చెప్పారు. జులై 3వ వారంలో జరిగే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు.
అంతేగాక, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైనా రెగ్యులర్గానే పరిగణిస్తామని బోర్డు కార్యదర్శి జలీల్ స్పష్టం చేశారు. జూనియర్ కళాశాలలను ఇప్పుడే తెరిచే అవకాశాలు లేవని, కరోనా పరిస్థితులను బట్టి త్వరలోనే కళాశాలల ప్రారంభంపై ప్రకటన చేస్తామని తెలిపారు.
కాగా, తెలంగాణలో ఇప్పటి వరకు 2499 కరోనా కేసులు నమోదు కాగా, 77 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 1010 మంది కరోనాతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 1412 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.