ఇంటర్ ఫలితాల్లో తగ్గిన ఉత్తీర్ణత! నిర్లక్ష్యమే కారణమంటున్న విద్యార్థి సంఘాలు!
Recommended Video
హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఈసారి ఉత్తీర్ణత శాతం తగ్గింది. గతేడాదితో పోలిస్తే 2శాతం తక్కువ ఉత్తీర్ణత నమోదైంది. గతేడాది ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్లో 62.73శాతం మంది పాస్ కాగా... ఈసారి అది 60.5శాతానికి పరిమితమైంది. ఇక సెకండ్ ఇయర్లో గతేడాది 67.06శాతం రిజల్ట్ రాగా... ఈసారి 65శాతం మంది విద్యార్థులు మాత్రమే పాసయ్యారు. గత రెండేళ్లతో పోల్చినా ఈసారి ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
విషాదం ..ఇంటర్ లో ఫెయిల్ అయ్యిందని మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య
ఆర్ట్స్, కామర్స్ విద్యార్థుల బోల్తా
తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో ఈసారి కామర్స్, ఆర్ట్స్ గ్రూప్ విద్యార్థులు ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారు. ఫస్ట్, సెకండ్ ఇయర్ విద్యార్థుల్లో ఎక్కువ మంది కామర్స్, సివిక్స్, ఎకనామిక్స్లో ఫెయిల్ అయ్యారు. ఫస్టియర్లో 40.53శాతం మంది కామర్స్, 37.56శాతం మంది సివిక్స్. 36.58శాతం మంది ఎకనామిక్స్లో బోల్తా కొట్టారు. హిస్టరీలో మాత్రం పాస్ పర్సంటేజ్ 85.80శాతం స్టూడెంట్స్ పాస్ కావడం విశేషం.
ప్రణాళిక లోపాలు
2018-19 విద్యా సంవత్సరంలో మొదటి విడత ప్రవేశాలను ఆగస్టు చివరి వరకు కొనసాగించారు. జూన్, జులైలో లెక్చరర్ల ట్రాన్స్ఫర్లు, ప్రభుత్వ కాలేజీల్లో జూన్లో తరగతులు ప్రారంభమైనా గెస్ట్ ఫ్యాకల్టీని ఆలస్యంగా నియమించడంతో సిలబస్ పూర్తి చేయడంలో ఆలస్యమైంది. ఇక గ్రామ పంచాయతి ఎన్నికలు, ముందస్తు అసెంబ్లీ ఎన్నికల వల్ల పాఠ్యాంశాల బోధన సకాలంలో పూర్తికాకపోవడం ఫలితాలపై ప్రభావం చూపింది.
మార్కుల ప్రాసెసింగ్లో లోపాలు
ఇంటర్ పరీక్షల మూల్యాంకనం, మార్కుల కంప్యూటరీకరణ విషయంలో ముందుగా ఊహించినట్లే గందరగోళం నెలకొన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అనుభవంలేని సంస్థకు మార్కుల ప్రాసెసింగ్ ప్రక్రియ అప్పజెప్పడంతో పలు లోపాలు తలెత్తినట్లు తెలుస్తోంది. సాఫ్ట్వేర్ సమస్యల కారణంగా వందలాది మంది విద్యార్థులకు అన్యాయం జరిగిందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. పరీక్షలకు హాజరైన పలువురు విద్యార్థులను ఆబ్సెంట్ అయినట్లు చూపినట్లు తెలుస్తోంది. మరికొన్ని చోట్ల బాగా చదివే విద్యార్థులకు తక్కువ మార్కులు రావడం, మరికొందరు ఫెయిల్ అవడం ఇంటర్ మూల్యాంకనం, మార్కుల కంప్యూటరీకరణపై అనుమానాలు బలపడేలా చేస్తున్నాయి.
ఇన్వ్యాలిడ్ హాల్ టికెట్ నెంబర్
ఇదిలా ఉంటే వందల మంది విద్యార్థులకు ఫలితాలే ఇవ్వలేదని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. చాలా మంది స్టూడెంట్స్ ఫలితాలు చూసుకోగా.. వారి హాల్ టికెట్ నెంబర్ ఇన్వ్యాలిడ్ అని వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. అర్హతలేని సంస్థకు ఫలితాల బాధ్యత అప్పగించడంతోనే తప్పిదాలు జరిగాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఆది నుంచి అనుమానాలు
మరోవైపు ఇంటర్ పరీక్షల మూల్యాంకనం మొదలుకొని ఫలితాల వెల్లడి వరకు అధికారులు విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అర్హత లేని వారికి మూల్యాంకనం విధులు అప్పగించడం, నిబంధనలు లెక్కచేయకుండా లెక్చరర్లతో ఎక్కువ పేపర్ల వాల్యుయేషన్ చేయించడం ఫలితాలపై ప్రభావం చూపిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మార్కుల క్రోడీకరణ ప్రక్రియను అనుభవం లేని సంస్థకు అప్పగించడం విద్యార్థుల పాలిట శాపంగా మారిందని పలువురు అంటున్నారు.