ఇంటర్ మూల్యాంకనం విషయంలో నిర్లక్ష్యం పై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు .. ప్రభుత్వానికి మొట్టికాయలు
ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై ఆగ్రహ జ్వాలలు మిన్నంటుతున్నాయి. పరీక్షా ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల ఆత్మహత్యలు సైతం కొనసాగుతున్నాయి. తప్పుల తడకలా ఉన్న ఫలితాలతో విద్యార్థులు నిరసనలకు దిగుతున్నారు . ఇక కోర్టు సైతం ఇంటర్ ఫలితాల అవకతవకలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆగ్రహం వ్యక్తం చేసి సమాధానం చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది.
ఈ పాపం బోర్డుదే : మరో ఇద్దరు ఇంటర్ విద్యార్థుల మృతి
మూడోరోజు ఆందోళనలకు సిద్ధమైన తల్లిదండ్రులు, విద్యార్థులు
ఇంటర్ ఫలితాల అవకతవకలపై మూడోరోజు ఆందోళనలకు విద్యార్థుల తల్లిదండ్రులు సిద్ధమయ్యారు. బోర్డు కార్యదర్శి అశోక్ ఇచ్చిన వివరణకు సంతృప్తి చెందని విద్యార్థుల తల్లిదండ్రులు నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ఆందోళనలు జరుపుతున్నారు. విద్యార్థుల అరెస్టులు, రాజకీయ నేతల సంఘీభావం, విద్యార్థి సంఘాల నినాదాలతో ఇంటర్ బోర్డు కార్యాలయం హోరెత్తుతోంది .
ఇంటర్ బోర్డు కార్యాలయంలో త్రిసభ్య కమిటీ విచారణ
మరోవైపు ఇంటర్ బోర్డు కార్యాలయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ విచారించింది. బోర్డు కార్యదర్శి అశోక్తో పాటు, గ్లోబరీనా సంస్థ సీఈవో రాజులను ప్రశ్నించింది. గ్లోబరీనా సంస్థ లోపాలు, బోర్డు వ్యవహరించిన తీరుపై కమిటీ ప్రశ్నల వర్షం కురిపించింది. ఈమేరకు కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.మరోవైపు ఇంటర్ బోర్డు ప్రక్షాళనకు సర్కార్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు .. పరిష్కార మార్గాలతో హాజరుకావాలని ఆదేశం
ఇంటర్ ఫలితాల అవకతవకలపై బాలల హక్కుల కమీషన్ వేసిన పిటీషన్ ను విచారించిన హైకోర్టు ఇంటర్ మూల్యంకనం విషయంలో ప్రభుత్వం తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జవాబుపత్రాల మూల్యాంకనంలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. సమస్యను ఎలా పరిష్కరిస్తారో వచ్చే సోమవారం నాటికి స్పష్టం చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పరిష్కార మార్గాలతో తమ ముందు హాజరుకావాలని విద్యాశాఖ కార్యదర్శి , ఇంటర్ బోర్డు కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది.