ఇంటర్ ఫలితాల్లో జాప్యం.. 10 నాడు కష్టమే.. మరో డెడ్ లైన్ ఏదంటే..!
హైదరాబాద్ : ఇంటర్మీడియట్ ఫలితాల తప్పుల తడకతో విద్యార్థుల భవితవ్యం ఆగమ్యగోచరంగా మారింది. దాంతో పెద్దఎత్తున రాద్ధాంతం జరగడంతో రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ చేయిస్తామంటూ బోర్డు అధికారులు సిద్ధమయ్యారు. అయితే ఈ నెల 10వ తేదీ శుక్రవారం నాటికి వాటి ఫలితాలు వెల్లడిస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ ప్రకటించారు. కానీ సీన్ రివర్సయింది.. 10వ తేదీ నాడు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలు వచ్చేలా లేవు. మరి తుది ఫలితాల వెల్లడికి మరో వారం రోజుల సమయం పడుతుందా? లేదంటే ఇంకా ఆలస్యం జరగనుందా అనేది ఇంటర్ బోర్డు అధికారులే సమాధానం చెప్పాలి.
ఫలితాలు మరింత ఆలస్యం?
ఇంటర్ ఫలితాల్లో తప్పిదాలు జరగడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పాసైనవారికి కూడా ఫెయిలైనట్లుగా ఫలితాలు చూపించడంతో కంగుతిన్నారు. దాంతో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులతో పాటు ఆయా పార్టీల నేతలు ఆందోళనలకు దిగారు. అయితే రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ ప్రక్రియను ఎలాంటి రుసుము లేకుండా ఫ్రీగా చేయిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు ఇంటర్ బోర్డు అధికారులు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు.
ఆ మేరకు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తిచేసి ఈ నెల 10వ తేదీ లోపు ఫైనల్ ఫలితాలు ప్రకటిస్తామని బోర్డు అధికారులు ప్రకటించారు. కానీ పరిస్థితి చూస్తే ఫలితాల వెల్లడి మరింత ఆలస్యమయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఇంటర్ ఫలితాల తప్పుల తడక అంశం ఇదివరకే న్యాయస్థానానికి చేరడంతో.. బుధవారం (08.05.2019) నాడు ఫలితాలు వెల్లడిస్తామని అధికారులు స్పష్టం చేశారు. తీరా చూస్తే బుధవారం ఫలితాలు వెల్లడించకపోగా.. మరో వారం రోజుల గడువు కావాలని హైకోర్టును ఆశ్రయించారు. దాంతో ఈ నెల 15వ తేదీ లోపు ఫలితాల వెల్లడికి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది న్యాయస్థానం.
15వ తేదీ.. కోర్టు డెడ్ లైన్
ఇంటర్ లో ఫెయిలైన 3 లక్షల 28 వేల మంది విద్యార్థులకు సంబంధించిన జవాబు పత్రాల రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ ప్రక్రియ బుధవారం నాటితో పూర్తయినట్లు కనిపిస్తోంది. కానీ, పాసైన విద్యార్థులు అప్లై చేసుకున్నవాటికి సంబంధించి రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ తంతు మాత్రం గురువారం (09.05.2019) నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. దీనికోసం ఈజీగా రెండు, మూడు రోజులు పట్టే ఛాన్సుందనే టాక్ నడుస్తోంది. దాని తర్వాత ఫలితాలు ప్రాసెస్ చేయడానికి మరో రెండు, మూడు రోజులు పట్టనుంది. అలా చూసినట్లయితే మొత్తం ఫలితాల వెల్లడికి దాదాపు వారం రోజులు తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది. కోర్టు మాత్రం 15వ తేదీలోపు విడుదల చేయాలని ఆదేశించింది. ఆ లోపైనా రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ ఫలితాలు వస్తాయో, లేదో అని విద్యార్థులు కంగారుపడుతున్నారు.
సవ్యంగా ప్రక్రియ.. కార్యదర్శి పరిశీలన
ఇంటర్ ఫలితాల వెల్లడిలో గందరగోళం నెలకొనడం, ఆ పై రాష్ట్రమంతటా నిరసనలు వెల్లువెత్తడం.. అదంతా కూడా ఇంటర్ బోర్డు ప్రతిష్టకు మాయని మచ్చలా మిగిలింది. అందుకే ఈసారి రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ ప్రక్రియలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు బోర్డు అధికారులు. మళ్లీ తప్పులు దొర్లకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ప్రతి విద్యార్థికి సంబంధించిన ఫలితాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆ మేరకు విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేస్తూ ప్రతి అంశాన్ని దగ్గరుండి పరిశీలిస్తున్నారు. గ్లోబరీనాతో పాటు మరో సంస్థ మెథడిక్స్ కూడా ఫలితాల ప్రాసెసింగ్ లో భాగం పంచుకుంటున్నాయి.
పై చదువుల కోసం ఆందోళన
రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ ఫలితాలు ఆలస్యం అవుతుండటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. పై చదువుల కోసం ఇంటర్ ఫలితాల మార్కుల షీట్లు ప్రధాన భూమిక పోషిస్తాయి. అలాంటిది ఇతర రాష్ట్రాలకు వెళ్లి చదువుకోవాలనుకునే వారికి కాస్తా ఇబ్బందికర పరిణామమే. పై చదువుల కోసం కొన్నిచోట్ల అడ్మిషన్లు ప్రారంభం కావడం, ఇంటర్ ఫలితాలు మెమోలు రాకపోవడం విద్యార్థులను మనోవేదనకు గురిచేస్తున్నాయి.
అదలావుంటే ఫెయిలైన విద్యార్థుల్లో మరో సందిగ్ధం నెలకొంది. ఈ నెల 25వ తేదీ నుంచి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానుండటంతో.. వాటికి ప్రిపేర్ కావాలా?.. లేదంటే ఫలితాలు పాసైనట్లుగా వస్తాయా?.. అనే డైలమాలో పడ్డారు. మొత్తానికి మరో వారం రోజుల్లో ఫలితాలు రాకుంటే మాత్రం.. విద్యార్థులకు తీరని అన్యాయం చేసినట్లే అవుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.