ఎవరీ సుధీర్?, ఆ వీడియోనే హత్యకు దారి తీసిందా?: కూకట్పల్లి హత్య వెనుక!
Recommended Video
హైదరాబాద్: కూకట్పల్లిలో ఇంటర్ విద్యార్థి దారుణ హత్యకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు, ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పిన వివరాల ప్రకారం హత్యకు దారి తీసిన పరిస్థితులు చూచాయగా అర్థమవుతున్నాయి. హత్య జరిగిన తీరు కూడా సినీ ఫక్కీలోనే జరగడం గమనార్హం.
షాకింగ్: పట్టపగలు.. నడిరోడ్డుపై.. అందరూ చూస్తుండగా.. విద్యార్థిని నరికి చంపేశారు!
ఎవరీ సుధీర్?..:
ప్రత్యర్థుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన సుధీర్(19)ను ఎలగల రాజు, రాణి దంపతుల కుమారుడిగా గుర్తించారు. వీరికి ముగ్గురు కుమారులు కాగా, అందులో సుధీర్ చిన్నవాడు. గతంలో ఇంటర్ ఫెయిల్ అయిన సుధీర్.. ప్రస్తుతం పరీక్షలు రాస్తున్నాడు.
మహేష్&గ్యాంగ్..:
సోమవారం ఉదయం 8గం.కు సుధీర్ కూకట్పల్లిలోని పరీక్షా కేంద్రానికి బయలుదేరాడు. స్నేహితులు సాయికృష్ణ, మేఘనాథ్లు కూడా సుదీర్ వెంట బైక్పై వెళ్లారు.
కూకట్పల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఓ హోటల్ వద్దకు వీరు రాగానే.. మూసాపేట జిల్లెల బస్తీకి చెందిన జిల్లా మహేష్ అతని స్నేహితులు అడ్డుకున్నారు.
సినీ ఫక్కీలో హత్య..:
సుధీర్ బైక్ ను అడ్డుకున్న మహేష్ అతని స్నేహితులు బైపేట నవీన్, కొర్రె తేజ, కృష్ణలు వేటకొడవళ్లతో దాడికి యత్నించారు.
దీంతో వారి నుంచి తప్పించుకున్న సుధీర్.. జాతీయ రహదారిపై అటుగా వెళ్తున్న స్కూల్ బస్సు ఎక్కాడు. ఆ వెంటనే బస్సులోకి ఎక్కిన మహేష్&గ్యాంగ్ అతన్ని బయటకు లాక్కొచ్చి.. విచక్షణారహితంగా దాడి చేశారు. వేటకొడవళ్లతో నరికి చంపేశారు.
ఒక్కడు చిక్కాడు..:
కూకట్ పల్లి ట్రాఫిక్ పోలీసులు రాజు, ప్రభాకర్, అంజి, మల్లేష్ రికవరీ వాహనంలో వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. సుధీర్పై దాడిని చూసి.. అడ్డుకోవడానికి వెళ్లగా.. అప్పటికే అతను రోడ్డుపై కుప్పకూలాడు.
నిందితులు మహేష్, కృష్ణ, తేజలు వై-జంక్షన్ వైపు పారిపోగా.. నవీన్ అనే యువకుడిని మాత్రం అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో నవీన్ పోలీసులపై దాడికి యత్నించినట్టు తెలుస్తోంది. ఎట్టకేలకు నవీన్ ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
బస్తీ గొడవలు.. పాత కక్షలే..
సుధీర్ హత్యకు బస్తీ గొడవలు, పాత కక్షలే కారణమని పోలీసుల విచారణలో తేలింది. బస్తీలో రెండు వర్గాల మధ్య గొడవలే దీనికి ప్రధాన కారణమని అనుమానిస్తున్నారు.
కాగా, హత్యలో మూసాపేటకు చెందిన వంశీయాదవ్ ప్రమేయం ఉన్నట్లు సుధీర్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమారుడిని హత్య చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఆ వీడియో వల్లే..:
సుధీర్ హత్యలో ఓ వీడియో వ్యవహారం కూడా కీలకంగా ఉన్నట్టు తెలుస్తోంది. సుధీర్ తండ్రి రాజు నిర్వహిస్తున్న దుకాణం నుంచి పాల ప్యాకెట్లు మాయమవుతుండటంతో అనుమానం వచ్చి నిఘా పెట్టగా.. కృష్ణ అనే వ్యక్తి దొరికిపోయినట్టు చెబుతున్నారు.
ఆ కక్షతోనే..:
సుధీర్పై దాడికి పాల్పడినవాళ్లలో కృష్ణ కూడా ఉన్నాడు. సుధీర్ తండ్రి రాజు.. కృష్ణ పాల ప్యాకెట్లు దొంగిలిస్తున్న సమయంలో అతనికి తెలియకుండా వీడియో తీశాడు. తర్వాత విషయం తెలుసుకున్న కృష్ణ.. రాజుతో గొడవపడ్డాడు.
తండ్రిని బెదిరించిన విషయం సుధీర్కు తెలియడంతో.. కృష్ణ దగ్గరకు వెళ్లి చంపేస్తానని హెచ్చరించి వచ్చాడు. దీంతో సుధీర్ పై కక్ష పెంచుకున్న కృష్ణ.. పథకం ప్రకారమే అతన్ని హత్య చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు..