హస్తం నేతల పంచాయితీ .. హుజూర్ నగర్ ఎన్నికల్లో చేటు చేస్తుందా !!
కాంగ్రెస్ పార్టీ నేతలకు చింత చచ్చినా పులుపు చావడం లేదు. గత ఏడాది తెలంగాణాలో జరిగిన ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ చేతిలో ఘోరంగా ఓటమి పాలైన నేతల తీరు ఏ మాత్రం మారలేదు. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ను ఎదుర్కొనే ప్రత్యామ్నాయ పార్టీ లేదని గులాబీ బాస్ కెసిఆర్ గత ఎన్నికల్లో మరోమారు ఢంకా బజాయించి మరీ చెప్పినా కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి మైనస్ గా చెప్పే అంతర్గత కుమ్ములాటలు ఆగడం లేదు.
అధిష్టానం ఆదేశాలు లేకుండా హుజూర్ నగర్ అభ్యర్థి ప్రకటన
ఇక తాజాగా హుజూర్ నగర్ ఉపఎన్నిక విషయంలోనూ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య తలెత్తిన విభేదాలు హుజూర్ నగర్ ఉప ఎన్నిక మీద ప్రభావం చూపిస్తాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ. ఇది అందరికీ తెలిసిన విషయమే. నేతలు ఎవరైనా అధిష్టానం ఆదేశాలు లేకుండా ఎవరిష్టం వచ్చినట్టు వారు ప్రకటనలు చేస్తూ ఉంటారు. ఇక హుజూర్ నగర్ ఉప ఎన్నికల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీలో అదే జరుగుతుంది.
పార్టీలో హుజూర్ నగర్ అభ్యర్థి పై అభిప్రాయబేధాలు
గత ఎన్నికల్లో హుజూర్ నగర్ నుండి ఎమ్మెల్యేగా ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. అయితే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఉత్తమ్ ఎంపీగానూ విజయం సాధించారు. దీంతో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజూర్ నగర్ కు ఉప ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం కాబట్టి ఈ స్థానాన్ని తిరిగి దక్కించుకోవడం కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకం. కానీ కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికల బరిలోకి దిగే అభ్యర్థి ఎవరు అన్నదానిపై పార్టీలో అభిప్రాయ బేధాలు నెలకొన్నాయి. అవి ఎన్నికల్లో ప్రభావం చూపిస్తాయనే భావన వ్యక్తం అవుతుంది.
రేవంత్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ సీనియర్లు
మల్కాజ్ గిరి నుండి ఎంపీ గా ఎన్నికైన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కావటంతో ఉత్తమ్ వ్యవహార శైలి మీద మండిపడుతూ కుంతియాకు ఫిర్యాదు చేశారు.అధిష్టానం నిర్ణయం లేకుండా అభ్యర్థిని ఎలా ప్రకటిస్తారని మండిపడ్డారు. హుజూర్ నగర్ ఉప ఎన్నిక విషయంలో రేవంత్ రెడ్డి వాఖ్యలపై మరొక కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి కూడా సీరియస్ అవుతున్నారు. ఉపఎన్నికకు ఎవరిని ఖరారు చేయాలో తమకు తెలుసనీ, రేవంత్ రెడ్డి సలహాలు తమకు అవసరంలేదని మండిపడుతున్నారు. దీంతో వీరి మధ్య హుజూర్ నగర్ ఎన్నిక వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది.
కవితను హుజూర్ నగర్ లో పోటీ చేయించే ఆలోచనలో కేసీఆర్
ఈ ఉపఎన్నికలో హుజూర్ నగర్ స్థానాన్ని కైవసం చేసుకోవడం కోసం గత ఎన్నికల్లో నిజామాబాద్ నుండి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైన కుమార్తె కవిత ను రంగంలోకి దించాలని భావిస్తున్నారు. ఇక అందుకోసం వ్యూహాలను సైతం రచిస్తున్నారు కెసిఆర్. ఈ ఉప ఎన్నిక విషయంలో కాంగ్రెస్ నేతలందరూ గొడవ పడుతుండటం పిట్ట పోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్టు అన్న చందంగా తయారవుతుందని, కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య అంతర్గత విభేదాలు టిఆర్ఎస్ పార్టీకి లభిస్తాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కాంగ్రెస్ నేతలు మారకుంటే గులాబీపార్టీకి లాభం
పార్టీలో ఉన్న నేతల మధ్య సఖ్యత లోపిస్తే, ప్రజలు ఆ పార్టీని నమ్మే పరిస్థితి ఉండదని భావిస్తున్నారు. ఏదేమైనా గత ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్ట పోయినట్లు బయటపడిన కాంగ్రెస్ ఇప్పటికైనా అంతర్గత విభేదాలకు చెక్ పెట్టి కలిసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అలా సాధ్యం కాకపోతే హుజూర్ నగర్ ఎన్నికలలో కెసిఆర్ చక్రం తిప్పడం ఖాయం. హస్తం పార్టీ తమ నెత్తిన తాము భస్మాసుర హస్తం పెట్టుకోవడం ఖాయమని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.