సిద్దిపేటకు విమానాశ్రయమా.. సాధ్యమయ్యే పని కాదు.. 2004లోనే జీఎంఆర్ కండిషన్ : రఘునందన్ రావు
కేసీఆర్ సిద్దిపేట జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి గానీ,జిల్లా అధికార యంత్రాంగం గానీ కనీసం ప్రోటోకాల్ పాటించకపోవడం బాధాకరమని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ముఖ్యమంత్రి సిద్దిపేట జిల్లా పర్యటనను సిద్దిపేట నియోజకవర్గ కార్యక్రమంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారన్నారు. బీజేపీ నుంచి గెలిచిన తనను వేదిక పైకి పిలవడం ఇష్టం లేకనే సమాచారం ఇవ్వలేదన్నారు. సిద్దిపేటను వెనుకబడిన జిల్లాగా గుర్తించి కేంద్రం మెడికల్ కాలేజీ మంజూరు చేసిందని... అది దుబ్బాక పరిధిలో పెట్టి ఉండే బాగుండేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికీ దుబ్బాకపై వివక్ష చూపిస్తోందని... సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలను సమాన దృష్టితో చూడాల్సిన అవసరం ఉందని అన్నారు.
కల్వకుంట్ల వారి కార్యక్రమా..? : రఘునందన్ రావు
'ఇప్పటికే గజ్వేల్లో 100 పడకల ఆస్పత్రి ఉంది.సిద్దిపేటలో 100 పడకల ఆస్పత్రి ఉంది. లేనిది దుబ్బాకకు మాత్రమే. ఇప్పటికీ అక్కడ 100 పడకల ఆస్పత్రి నిర్మాణం పూర్తి చేయట్లేదు. సుమారు రూ.700కోట్లుతో కేంద్రం మెడికల్ కాలేజీ మంజూరు చేస్తే... దాన్ని కూడా సిద్దిపేటకు తీసుకెళ్లారు. మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవానికి నన్ను పిలవడానికి అహం అడ్డు వచ్చిందా... అది మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవమా లేక కల్వకుంట్ల వారి కార్యక్రమా... ప్రభుత్వం ఏది ఇచ్చినా గజ్వేల్,సిద్దిపేట,సిరిసిల్లకే ఇస్తుందని దుబ్బాక ఉపఎన్నిక సందర్భంగా చెప్పాను. సిద్దిపేట పర్యటనలో కేసీఆర్ హామీలతో ఈ విషయం మరోసారి రుజువైంది.' అని రఘునందన్ రావు పేర్కొన్నారు.
దుబ్బాక పట్ల అదే వివక్ష...
సిద్దిపేట,సిరిసిల్ల,గజ్వేల్ పట్టణాలకు ఇప్పటికే రింగు రోడ్లు ఉన్నాయని రఘునందన్ రావు పేర్కొన్నారు. సిద్దిపేటకు రెండో రింగ్ రోడ్డు కోసం నిధులు కేటాయిస్తామని కేసీఆర్ సిద్దిపేట సభలో చెప్పారని గుర్తుచేశారు. అసలు ఇప్పటివరకు రింగు రోడ్డే లేని దుబ్బాకకు రింగు రోడ్డు ఇవ్వకుండా సిద్దిపేటకు రెండో రింగ్ రోడ్డు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. దుబ్బాక పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారనే మొన్నటి ఉపఎన్నికలో టీఆర్ఎస్ను అక్కడి ప్రజలు తిరస్కరించారని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా అన్యాయం చేస్తామంటే ఊరుకునేది లేదన్నారు.
దుబ్బాకలో కొత్త బస్టాండ్కు నిధులు ఇవ్వండి : రఘునందన్ రావు
సిద్దిపేటకు అంతర్జాతీయ విమానాశ్రయం ఇస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి... దుబ్బాకలో కొత్త బస్టాండ్ నిర్మాణం కోసం నిధులు ఎందుకు కేటాయించరని ప్రశ్నించారు. సిద్దిపేటను అభివృద్ది చేస్తే తమకేమీ అభ్యంతరం లేదని... కానీ సిద్దిపేటకు ఏమిస్తే తమకు కూడా న్యాయంగా వాటిని ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిద్దిపేటలో విమానాశ్రయం కోసం వేల కోట్ల రూపాయలు ఇస్తామనేవాళ్లు... దుబ్బాక బస్టాండ్ కోసం వందల కోట్లు రూపాయలు ఇవ్వలేరా అని నిలదీశారు. కొడుకు కోసం కొత్త సెక్రటేరియట్,అల్లుడి కోసం సిద్దిపేట మెడికల్ కాలేజీ,మనువడి కోసం గజ్వేల్ను అభివృద్ది చేశారని ఎద్దేవా చేశారు.
జీఎంఆర్ కండిషన్...
ముఖ్యమంత్రి కేసీఆర్ యూపీఏ హయాంలో 2004లో కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు జీఎంఆర్ గ్రూపు కేంద్ర విమానాయాన శాఖతో ఒక ఒప్పందం చేసుకుందని రఘునందన్ రావు గుర్తుచేశారు. దాని ప్రకారం... 2033 సంవత్సరం వరకు హైదరాబాద్ నుంచి 150కి.మీ పరిధిలో ఎక్కడా మరో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించకూడదన్న నిబంధన ఉందన్నారు. ఈ విషయం తెలిసి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో వరంగల్ ప్రజలకు మూడేళ్లలో విమానాశ్రయం వస్తుందని హామీ ఇచ్చారన్నారు. ఇప్పుడు సిద్దిపేట ప్రజలకు హామీ ఇచ్చారన్నారు. బీదర్లో విమానాశ్రయం కట్టాలని కర్ణాటక ప్రభుత్వం ప్రయత్నిస్తేనే జీఎంఆర్ ఒప్పుకోలేదన్నారు.రాబోయే కార్పోరేషన్ ఎన్నికల కోసమే ఖమ్మంలో మంత్రి కేటీఆర్ ఐటీ పార్క్ను ప్రారంభించారని విమర్శించారు. ముఖ్యమంత్రి సిద్దిపేట జిల్లా పర్యటనలో ప్రోటోకాల్ పాటించని అధికారులపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామన్నారు.