షాక్: 'ఆన్ లైన్ లోనే లైంగిక వేధింపులు, 51% బాలికలు,43% బాలురు బాధితులు'
దేశ వ్యాప్తంగా 51 శాతం బాలికలు, 43 శాతం మంది బాలురు ఆన్ లైన్ లో లైంగిక వేధింపులకు గురౌతున్నారని డిజిపి అనురాగ్ శర్మ ఆందోళన వ్యక్తం చేశారు.
హైదరాబాద్:దేశ వ్యాప్తంగా 51 శాతం బాలికలు, 43 శాతం మంది బాలురు ఆన్ లైన్ లో లైంగిక వేధింపులకు గురౌతున్నారని డిజిపి అనురాగ్ శర్మ ఆందోళన వ్యక్తం చేశారు.
ఇంటర్నెట్ మంచి కంటే చెడుకు ఎక్కువగా ఉపయోగించడం పట్ల ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రతి చేతికి స్మార్ట్ ఫోన్, నెట్ రావడంతో వేధింపులు ఎక్కువయ్యాయని చెప్పారు.96 శాతం క్రైం కార్నర్ కు వేదికగా మారిందన్నారు.
తెలిసిన వ్యక్తులను బాలబాలికలను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని ఓ అధ్యయనంలో తేలిందని డిజిపి చెప్పారు.శుక్రవారం నాడు జూబ్లిహిల్స్ లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సిఐడి నేతృత్వంలో జరిగిన చిన్నారులకు లైంగిక వేధింపులు నియంత్రణ చర్యల సదస్సులో డిజిపి అనురాగ్ శర్మ పాల్గొన్నారు.పాఠశాలల యాజమాన్యాలు, స్వచ్చందసంస్థల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు.
లైంగిక వేధింపుల ఘటనలను కొన్ని సందర్భాల్లో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు భయపడుతున్నారని చెప్పారు.మరికొన్ని సందర్భాల్లో నిందితుల పలుకుబడితో కేసులు తప్పించుకొంటున్నారి డిజిపి చెప్పారు.
పాఠశాలల్లో బాలికలపై లైంగిక వేధింపులు సాగితే ఆ స్కూల్ పరువు పోతోందని, దీంతో ఈ ఘటనలు జరిగినా స్కూల్ యాజమాన్యాలు కూడ ఈ విషయాలను గోప్యంగా ఉంచుతున్నారని ఆయన చెప్పారు.
స్టేటస్ సింబల్ పేరుతో తల్లిదండ్రులు పిల్లలకు విచ్చలవిడి స్వేచ్చ ఇస్తున్నారని స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్ లు ఇవ్వడం వల్ల లైంగిక వేధింపులు ఎక్కువ కావడానికి కారణమయ్యాయన్నారు.