ఇంద్రసేన్ చాలెంజ్ అంటే లేదన్న జగదీష్ రెడ్డి
హైదరాబాద్: రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై సోమవారం తెలంగాణ శానససభ లాబీల్లో తెలంగాణ రాష్ట్ర సమితి నేత, మంత్రి జగదీష్ రెడ్డ్ికి, బిజెపి నేత ఇంద్రసేనా రెడ్డి మధ్య వాదన చోటు చేసుకుంది. తమ పార్టీయే గెలుస్తుందంటే, తమ పార్టీ గెలుస్తుందని ఇరువురు వాదించుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలను గెలుచుకుంటుందని ఇంద్రసేనా రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
అయితే, తమకు అసలు పోటీనే లేదని, టిఆర్ఎస్పై గెలువలేని ప్రతిపక్షాలన్నీ ఈ ఎన్నికల్లో ఒక్కటయ్యాయని జగదీష్ రెడ్డి అన్నారు, ఒటమి తప్పదని గ్రహించిన కాంగ్రెసు పార్టీ బహిరంగంగా బిజెపికి మద్దతు ఇచ్చిందని ఆయన అన్నారు. అయినా విజయం తమదేనని ఆయన అన్నారు. ఫలితాలు చూసి బిజెపిలో కాంగ్రెసు విలీనం కావాల్సి వస్తుందని ఆయన ఎద్దేవా చేశారు.
ఇంద్రసేనా రెడ్డి జోక్యం చేసుకుని - ఈసారి టిఆర్ఎస్కు షాక్ ఇచ్చేందుకు అందరూ సిద్దమయ్యారని అన్నారు. అందువల్ల తామే గెలుస్తామని ఆయన అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తరువాత కాంగ్రెస్ పార్టీని బీజేపీలో కలుపుకోండని కూడా మంత్రి జగదీష్ రెడ్డి, ఇంద్రసేనా రెడ్డితో వ్యాఖ్యానించారు. బీజేపీకి ఓటు వేయమని కాంగ్రెస్ ప్రచారం చేసిందని, అయినప్పటికీ మొదటి ప్రాధాన్యత ఓటుతోనే తాము గెలవబోతున్నామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
దీనిపై స్పందించిన ఇంద్రసేనారెడ్డి మొదటి ప్రాధాన్యత ఓటు వేయమని కాంగ్రెస్ చెప్పలేదని, రెండో ప్రాధాన్య ఓటు మాత్రమే బీజేపీకి వేయాలన్నారని గుర్తుచేశారు. టీఆర్ఎస్ మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిస్తే.. ఛాలెంజ్కు సిద్ధమని ఇంద్రసేనారెడ్డి అన్నారు. అయితే ఛాలెంజ్ అవసరం లేదని మంత్రి జగదీష్ రెడ్డి ప్రతిస్పందించారు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఆదివారంనాడు జరిగింది.