అభద్రతా భావం ఆక్రమించినప్పుడే అసహనం కట్టలు తెంచుకుంటుంది..!!
హైదరాబాద్ : రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, సవాళ్లు ఒక స్థాయి వరకు మజా పంచుతాయి. ప్రజలు కూడా రాజకీయ నాయకుల తూటాల్లాంటి మాటలను, ఒకరిపై ఒకరు చేసుకునే విమర్శలను, ఆరోపణలను కొంతమేరకు ఎంజాయ్ చేస్తారు. ఒక నాయకుడి ఒదిలిన సవాల్ కు ప్రతినాయకుడి సమాధానం ఎలా ఉంటుందా అని ఆత్రుతగా ఎందురు చూస్తుంటారు. ఇదే ప్రజా స్వామ్యం గొప్పదనం..! ప్రజాస్వామ్యం ఇచ్చిన స్వేచ్చ లోని మజా..! అదే స్వేచ్చను అడ్డుపెట్టుకుని అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారు నేటి రాజకీయనాయకులు. నిన్నటితరం నాయకులు అడ్డదిడ్డంగా అప్రజాస్వామికంగా మాట్లాడితే పట్టించుకోకపోవచ్చుగాని మొన్నటితరం నేతలు, ఉద్యమంలో శిఖరం అంత ఖ్యాతి గడించి, అసాద్యాన్ని సుసాద్యం చేసిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రతిపక్షాలనుద్దేశించి జుగుప్సాకర వ్యాఖ్యలు చేయడం సభ్యసమాజాన్ని ఆశ్యర్యానికి గురిచేసింది.
ప్రజాబలం ఉన్నప్పుడు ఎన్నికల్లో ఎదుర్కోవాలి..! దిగజారుడు విమర్శలు ఎందుకు..?
ప్రతిపక్షాల పొత్తుల పట్ల అంత దిగజారి వ్యాఖ్యానించాల్సిన అవసరం ఏంటి..? అదికారం చేతులో ఉన్నప్పుడు, ప్రజాబలం మెండుగా ఉన్నదనుకున్నప్పుడు, ఆత్మస్తైర్యంతో ముందుకు వెళ్లాలే గాని స్థాయితగ్గించుకుని మాట్లాడటం ఎంతవరకు సమంజసమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఉద్యమ సమయంలో అలాంటి వ్యాఖ్యలను ప్రజలు విని ఉండి ఉండవచ్చు.. కాని ఇప్పుడు ముఖ్యమంత్రిగా అలాంటి వ్యాఖ్యల వల్ల ఎవరికి నష్టమో, ఎవరికి లాభమో చంద్రశేఖర్ రావే బేరీజు వేసుకోవాలి. కేసీఆర్ వ్యాఖ్యలు గులాబీ పార్టీకి ఎంత మేలు చేసాయో తెలియదు గాని ప్రతిపక్షాలకు మాత్రం మంచి అస్త్రాలను అందించాయి. కేసీఆర్ ఆత్మస్తైర్యం దెబ్బతిన్నదని, అభద్రతాభావంలో కూరుకుపోయిన కేసీఆర్ ఓటమి పట్ల భయంతోని నియంత్రణ కోల్పోయి మాట్లడుతున్నాడంటూ విమర్శలు అందుకుటున్నారు. ముఖ్యమంత్రిగా పరిణతి చూపించాల్సిన చంద్రశేఖర్ రావు దిగజారుడు మాటలు తన అసహనానికి నిదర్శనంగా చెప్పుకొస్తున్నారు.
ఉద్యమం లో ఉన్నప్పుడు ఒక లెక్క..! ఇప్పుడు ఒక లెక్క..! రెండిటికి తేడా ఉంది పక్కా..!!
సభ్యత పరదాలు తొలిగిపోయినట్లే దూకుడు రాజకీయాల్లో ప్రత్యర్థుల్ని ఉద్దేశించి పరుష వ్యాఖ్యలు చేయటం ఇప్పుడేం కొత్తగా మొదలైంది లేదు. గడిచిన పదేళ్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం అంతకంతకూ తీసికట్టుగా తయారైందని చెప్పాలి. రాజకీయాల్లో ఇష్టం వచ్చినట్లుగా తిట్టటం, ప్రత్యర్థులను ఉద్దేశించి పరుష వ్యాఖ్యలు చేయటానికి ఆద్యుడు కేసీఆర్గా చెప్పాలి. ఉద్యమ నేతగా తనకుంటే అడ్వాంటేజ్ ను పూర్తిగా వాడేయటమే కాదు, తన మాటలతో ప్రజల్లో పూనకం తెప్పించే సత్తా ఉన్న కేసీఆర్, తన నిందా రాజకీయాల్ని అంతకంతకూ పెంచుకుంటూ పోతున్నారని చెప్పక తప్పదు. ముందస్తుకు వెళ్లేందుకు వీలుగా అసెంబ్లీని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకొని, గవర్నర్ కు రాజీనామా లేఖను అందించిన కాసేపటికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోనే సీరియస్ గా మీడియా మీద అక్కసు వెళ్ల బోసుకున్నారు కేసీఆర్.
సహనం కోల్పోయిన వ్యాఖ్యలు..! సోయి తప్పిన మాటలు..!!
తాజాగా జరిగిన నిజామాబాద్ సభతో ప్రత్యర్థులపై ఏ స్థాయిలో పరుష వ్యాఖ్యలు చేయొచ్చన్న విషయాన్ని చెప్పేశారని చెప్పాలి. కోపంతో ఒకరిపై ఒకరు తిట్టేసుకునే సందర్భంలో ఎంత దిగజారి మాట్లాడతారో, ఇంచుమించు అదే స్థాయిలో చంద్రశేఖర్ రావు తాజా వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పాలి. థూ.. మీ బతుకులు చెడ అన్న రీతిలో కేసీఆర్ విరుచుకుపడిన వైనం చూస్తే, కేసీఆర్ తిట్లు రానున్న రోజుల్లో అంతకంతకూ ఎక్కువ కావటం ఖాయమన్న మాట బలంగా వినిపిస్తోంది. నువ్వు రెండు అంటే నేను నాలుగు అంట అన్న రీతిలో నడుస్తున్న రాజకీయాల నేపథ్యంలో, మొదట అడుగు కేసీఆర్ వేస్తే, దానికి రెట్టింపు దూకుడుతో దూసుకెళ్లేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్న వైనాన్ని విపక్ష నేతలు స్పష్టం చేస్తున్నారు.
మా పొత్తు తప్పైతే.. 2009లో కేసీఆర్ పొత్తు కూడా తప్పే అంటున్న కాంగ్రెస్..!!
థూ.. అంటూ ఇష్టారాజ్యంగా మాట్లాడతావా కేసీఆర్, బిడ్దా.. నీ సంగతి.. నీ తిట్ల సంగతి మేం చూస్తామంటూ విపక్షాలు మండిపడుతున్న వైనం చూస్తుంటే, రానున్న రోజుల్లో తిట్ల స్థానంలో బూతులు సైతం రాజకీయ సభల్లో వినిపించటం ఖాయమంటున్నారు. కాంగ్రెస్, టీడిపి పొత్తుపై ఇంతగా విమర్శిస్తున్న కేసీఆర్ 2009లో అదే టీడిపితో ఎలా జట్టు కట్టాడని కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు. అప్పుడు తప్పికాని పొత్తు దర్మం ఇప్పుడు తప్పెలా అవుతుందని వారి ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఈ ముందస్తు ఎన్నికల పుణ్యమా అని బూతులు కూడా కామన్ గా మారిపోతాయన్న మాట. ఎందుకైనా మంచిది. న్యూస్ ఛానళ్లలో వార్తలను చూసే క్రమంలో మ్యూట్ బటన్ మీద వేలు పెట్టుకుని ఉంటే మంచిదన్న విషయం మరవకండి.