నీతో మాట్లాడాలి ఇంటికి రా బ్రదర్: ఎన్టీఆర్, ఎఎన్నార్ మధ్య ఆసక్తికరం
హైదరాబాద్: చనిపోవడానికి కొన్ని రోజుల ముందు ఎన్టీఆర్ ఎఎన్ఆర్కు ఫోన్ చేసేవారని రచయిత కృష్ణక్క చెప్పారు. ఎన్టీఆర్, ఎఎన్ఆర్ మధ్య స్నేహంలో కొన్ని సమయాల్లో చిన్న పొరపొచ్చాలు వచ్చినా అవి తాత్కాలికమేనని ఆమె అభిప్రాయపడ్డారు.
ఎన్టీఆర్ అక్కినేని నాగేశ్వర్రావు, ఎన్టీఆర్ మధ్య చోటుచేసుకొన్న ఆసక్తికర సంభాషణను రచయిత కృష్ణక్క వెల్లడించారు. ఎన్టీఆర్, ఎఎన్ఆర్ మధ్య ఎంతో ప్రేమ ఉండేదన్నారామె. మధ్యవర్తుల కారణంగా కొన్ని మనస్పర్థలు వచ్చినా అవి తాత్కాలికమేనని ఆమె గుర్తుచేశారు.
ఎన్టీఆర్ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారన్న విషయాలు తెలుసుకోవడానికి ఏఎన్ఆర్ ఆసక్తిని చూపేవారని ఆమె గుర్తుచేసుకొన్నారు. తాను ఏఎన్ఆర్ ఇంట్లో ఉన్నప్పుడు ఎన్టీఆర్ నుంచి ఫోన్ వచ్చిందని చెప్పారు.
ఆ సమయంలో ఆయన గొంత ఓ రకంగా ఉందని గుర్తు చేసుకున్నారు. ఏంటి బ్రదర్? అని నాగేశ్వరరావు అడిగితే, "ఏం లేదు బ్రదర్ మిమ్మల్ని చూడాలని ఉంది. ఒకసారి మనసు విప్పి చాలా చెప్పుకోవాలని ఉంది. ఒకసారి వస్తారా ఇంటికి?" అని ఎన్టీఆర్ అడిగారన్నారని ఆమె చెప్పారు. ఏఎన్ఆర్ ఎందుకో ఆ గొంతు విని చాలా చలించిపోయారని కృష్ణక్క చెప్పారు.
"ఎందుకు బ్రదర్ అలా అంటున్నారు. ఈ మధ్యనే ఇంటికి భోజనానికి వచ్చారు" అని గుర్తుచేస్తే, "కాదు బ్రదర్... మీతో చాలా చెప్పుకోవాలని ఉంది. మనసులో మాట చెప్పాలి" అని ఎన్టీఆర్ అన్నారని కృష్ణక్క చెప్పారుఅయితే ఎన్టీఆర్ ఆహ్వనం మేరకు తప్పకుండా వస్తానని ఏఎన్ఆర్ చెప్పారని ఆమె గుర్తు చేసుకొన్నారు.
ఆ విషయాన్ని తన భార్యకు కూడా చెప్పారని ఆమె ప్రస్తావించారు.ఆ ఘటన జరిగిన మరునాడే ఎన్టీఆర్ చనిపోయారని కృష్ణక్క చెప్పారు. ఈ విషయం తెలిసి ఎఎన్ఆర్ తట్టుకోలేక చాలాసేపు అలాగే ఉండిపోయారన్నారు.