రేవంత్ వాడిన రెండు ఫోన్లు వారివే! టిడిపికి మత్తయ్య 'మెసేజ్' షాక్
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఏ1 నిందితుడు, తెలంగాణ తెలుగుదేశం పార్టీ కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రెండు ఫోన్లు ఉపయోగించారని, అయితే ఆ రెండు ఫోన్లు కూడా అతనివి కాదని ఎసిబి అధికారులు గుర్తించారు. ఇదే విషయాన్ని ఛార్జీషీటులో పొందుపర్చారు.
రేవంత్ రెడ్డి ఉపయోగించిన రెండు ఫోన్లు కూడా అతని పేరుతో లేవని, ఒకటి ఆయన సోదరుడు కృష్ణా రెడ్డి పేరుతో, మరొకటి సైదులు పేరుతో ఉందని పోలీసులు పేర్కొన్నారు.
తెలంగాణ ఎసిబి దాఖలు చేసిన ఛార్జీషీటులో మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చిందని తెలుస్తోంది. తమ ఎదుట హాజరు కావాలని ఎసిబి అధికారులు ఇచ్చిన నోటీసుకు ప్రతిస్పందనగా పరారీలో ఉన్న నిందితుడు జెరూసలేం మత్తయ్య జూన్ 2న దర్యాఫ్తు అధికారికి మెసేజ్ చేశాడని ఛార్జీషీటులో పేర్కొన్నారు.
ఆ సందేశంలో... సారీ సర్, నా ఫోన్ను స్విచాఫ్ చేయమని టిడిపి నాయకులు చెప్పారని, రేపు ఉదయం ఫోన్ చేస్తానని, బెయిల్కు అయ్యే ఖర్చుల గురించి కూడా చూసుకోవాలని అందులో పేర్కొన్నట్లు ఎసిబి అధికారులు వివరించారని తెలుస్తోంది. ఈ సందేశాన్ని తనకు నోటీసులు ఇచ్చిన అధికారికి మత్తయ్య పంపించినట్లుగా తెలుస్తోంది.
కాగా, ఓటుకు నోటు ఛార్జీషీటులో చంద్రబాబుదు పేరును పలుమార్లు ప్రస్తావించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆయనకు తెలిసే కుట్ర జరిగిందని ఏసీబీ తన చార్జిషీట్లో స్పష్టంగా పేర్కొందని సమాచారం. అయితే, దాఖలైన చార్జిషీట్ ఇంకా ఏసీబీ కోర్టు పరిశీలనలోనే ఉంది.
కేసుకు సంబంధించి ఏసీబీ త్వరలోనే అనుబంధ చార్జిషీట్ దాఖలు చేయనుంది. మొదటి చార్జిషీట్లో కేసులో ఐదో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పేరును ఏసీబీ ప్రస్తావించలేదు.
అదనపు చార్జిషీట్లో సండ్రతోపాటు మరికొందరి పేర్లు ప్రస్తావించనుంది. ప్రధానంగా మొదటి చార్జిషీట్లో కుట్ర సందర్భంగా బయటపడిన విషయాలను వివరించిన ఏసీబీ, అనుబంధ చార్జిషీట్లో కుట్రకు ముందు జరిగిన వివరాలు పేర్కొననుందని తెలుస్తోంది.
ఎసిబి ఎదుట హాజరైన శ్రీనివాస్
ఓటుకు నోటు కేసులో ఎసిబి ఎదుట డికె శ్రీనివాస్ మంగళవారం నాడు ఎసిబి ఎదుట హాజరయ్యారు. డికె శ్రీనివాస్ ఆదికేశవులు నాయుడు తనయుడు. ఆయనతో పాటు ఆయన కార్యాలయ కార్యదర్శి విష్ణు చైతన్యకు కూడా ఎసిబి నోటీసులు ఇచ్చింది. కొండల్ రెడ్డి, జిమ్మిబాబు విచారణకు గైర్హాజరయ్యారు.