కిరణ్ రెడ్డి, డిఎస్లకు టిడిపి పిలుపు, బాబు-కెసిఆర్ల ఒప్పందమేంటి: గుత్తా
హైదరాబాద్: ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు హాజరు కావాలని పలువురు ప్రముఖులకు టిడిపి నేతలు ఆహ్వాన పత్రాలు అందిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, టిఆర్ఎస్ నేత డి శ్రీనివాస్, మాజ సీఎం నాదెండ్ల భాస్కర రావు, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్లకు ఆహ్వానాలు అందించారు.
ప్రముఖ కవి సి నారాయణ రెడ్డికి ఆహ్వాన పత్రం ఇచ్చారు. మరోవైపు, ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు తెలంగాణ టిడిపి నేతలు వెళ్తున్నారు.
ఎల్ రమణ, రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర రావు, వేం నరేందర్ రెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, రావుల చంద్రశేఖర రెడ్డి తదితరులు వెళ్తున్నారు. ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, కొత్తకోట దయాకర్ రెడ్డి ఇప్పటికే అమరావతిలో ఉన్నారు.
కెసిఆర్ పైన గుత్తా ఆగ్రహం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. నిన్నటి వరకు తిట్టుకున్న ఇరువురు ముఖ్యమంత్రులు.. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కెసిఆర్ల మధ్య ఏం ఒప్పందం జరిగిందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇరువురు ముఖ్యమంత్రులు తెలుగు రాష్ట్రాలకు భారంగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. కెసిఆర్ బతుకమ్మ పేరుతో రూ.100 కోట్లు ఖర్చు చేశారన్నారు. రైతు ఆత్మహత్యలు పట్టించుకోకుండా పండగల పేరుతో కెసిఆర్ పబ్బం గడుపుతున్నారన్నారు.
మగవారు కూడా బతుకమ్మ ఆడుతున్నారని, ఇది విడ్డూరమన్నారు. ఇది సరికాదని చెప్పారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గజ్వెల్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని, తెలంగాణకు అన్నట్లుగా వ్యవహరించడం లేదన్నారు.
ఇదీ తెలంగాణ సీఎం అమరావతి పర్యటన...
తెలంగాణ సీఎం కేసీఆర్ అమరావతి పర్యటన ఖరారైన విషయం తెలిసిందే. గురువారం అమరావతి సహా నల్గొండ, మెదక్ జిల్లాల్లో సీఎం పర్యటిస్తారు. గురువారం ఉదయం 10.15గంటలకు నల్గొండ జిల్లా సూర్యాపేట నుంచి కేసీఆర్ హెలికాప్టర్లో అమరావతి బయలుదేరుతారు.
10.45 గంటలకు అమరావతి చేరుకుంటారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30గంటలకు అమరావతి నుంచి సూర్యాపేట చేరుకుంటారు. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4గంటల వరకు సూర్యాపేటలో పర్యటిస్తారు.
సూర్యాపేట గొల్లబజార్లో రెండు పడకగదుల ఇళ్లకు శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 4.30 గంటలకు హెలికాప్టర్లో దత్తతగ్రామం ఎర్రవల్లి చేరుకుని దసరా వేడుకల్లో పాల్గొంటారు. ఎర్రవల్లిలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.
సాయంత్రం 6.10 గంటలకు మరో దత్తత గ్రామం నరసన్నపేటలో పర్యటిస్తారు. నరసన్నపేటలో 2 పడకగదుల ఇళ్ల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేస్తారు. రేపు రాత్రి ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో సీఎం కేసీఆర్ బస చేస్తారు.
రాజధానికి తెలంగాణ సిపిఎం, సిపిఐ నో
అమరావతి శంకుస్థాపనకు వెళ్లాలని ఏపీ సిపిఐ, సిపిఎం నిర్ణయించాయి. మరోవైపు తెలంగాణ సిపిఎం, సిపిఐ వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. తాము వెళ్లడం లేదని తెలంగాణ సిపిఎం చెబితే, తమకు ఆహ్వానం అందలేదని సిపిఐ చెప్పింది.