చరిత్ర: శుక్రవారం మక్కా మసీదులో ఇరాన్ అధ్యక్షుడి ప్రసంగం
హైదరాబాద్: ఈ శుక్రవారం హైదరాబాదులో చారిత్రాత్మక సంఘటన చోటు చేసుకుంటోంది. మక్కా మసీదును ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ హసన్ రౌహానీ సందర్శస్తున్నారు. గత 325 ఏళ్లలో తొలిసారి ఇలాంటి సంఘటన జరుగుతోంది.
శుక్రవారంనాటి ప్రార్థనల సందర్భంగా ఆయన ప్రసంగం చేస్తారు. కుతుబ్ షాహీ రాజు సుల్తాన్ మొహమ్మద్ 1616లో దానికి శంకుస్థాపన చేయగా 70 ఏళ్లకు 1694లో మక్కా మసీదు నిర్మాణం పూర్తయింది.
దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లకుండా నేరుగా ఓ ఇరాన్ అధ్యక్షుడు హైదరాబాదు రావడం కూడా ఇదే మొదటిసారి. టెహ్రాన్ నుంచి ఆయన ఈ నెల 15వ తేదీన హైదరాబాద్ వస్తారు. శనివారంనాడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లిపోతారు.
ఆయనతో పాటు ఢిల్లీకి భారీగా ప్రతినిధుల బృందం చేరుకుంటుంది. భారత ప్రభుత్వంతో ఆయన అవగాహన ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది. ఆయన ప్రధాని నరేంద్ర మోడీని, రాష్ట్రపతి కోవింద్ను కలుసుకుంటారు
ఇరాన్ రాజు రెండు సార్లు 1950, 1970 ప్రాంతాల్లో రెండు సార్లు హైదరాబాదు వచ్చినప్పటికీ ఆయనకు మక్కా మసీదు ప్రార్థనల సందర్భంగా ప్రసంగం చేసే అవకాశం దక్కలేదు. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత అధ్యక్షుడైన మొహ్మద్ ఖతామి 2004 జనవరి 28వ తేదీన హైదరాబాద్ వచ్చారు. అయితే మక్కా మసీదు జుమ్మాలో పాల్గొనలేదు.
రౌహాని హైదరాబాదును సందర్శిస్తున్న రెండో ఇరాన్ అధ్యక్షుడు. మక్కా మసీదు ప్రార్థనల సందర్భంగా ప్రసంగించే అవకాశం దక్కిన తొలి ఇరాన్ అధ్యక్షుడు ఈయనే.