ఈ మార్గాల్లోనే: బస్సు ఛార్జీలతో సికింద్రాబాద్ నుంచి 3స్టార్ లగ్జరీ ట్రైన్స్
హైదరాబాద్: ప్రయాణాన్ని సౌకర్యవంతంగా చేయాలనుకునే ప్రయాణికులకు ఓ శుభవార్త. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్ సీటీసీ).. సికింద్రాబాద్ నుంచి త్రీ స్టార్ లగ్జరీ ట్రైన్లో తిరుపతికి, షిర్డీకి, గోవాకు వెళ్లేందుకు ఓ వినూత్నమైన ఆఫర్ను తీసుకొచ్చేసింది. సాధారణ బస్సు రేట్లతో సమానంగా సికింద్రాబాద్ నుంచి షిరిడీకి, తిరుపతికి, గోవాకు త్రీ స్టార్ లగ్జరీ ట్రైన్లను త్వరలోనే ఐఆర్సీటీసీ ఆపరేట్ చేయనుంది.
తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పేర్వారం రాములు విజ్ఞప్తి మేరకు ఐఆర్సీటీసీ ఈ త్రీ స్టార్ లగ్జరీ ట్రైన్లు నడపడానికి అంగీకరించింది. ఐఆర్ సీటీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఏకే మనోచా, గ్రూప్ జనరల్ మేనేజర్ స్మితా రావత్తో పేర్వారం రాములు భేటీ అనంతరం ఈ నిర్ణయం ప్రకటించారు.
అదేవిధంగా తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు బాసర, వరంగల్, భద్రాచలం ప్రాంతాల్లో కూడా త్రీ స్టార్ లగ్జరీ రైళ్లను ఐఆర్సీటీసీ నడిపేందుకు అంగీకరించింది.
అంతేగాక, విలాసవంతమైన రైలుగా ప్రసిద్ధి చెందిన సెవన్ స్టార్ సూపర్ లగ్జరీ మహారాజా ఎక్స్ప్రెస్ రైలును కొంకణ్ నుంచి కర్ణాటక, కేరళ, తమిళనాడుకు.. తెలంగాణలోని సికింద్రాబాద్, ఖాజీపేట స్టేషన్ల మార్గాన ప్రయాణించేలా చర్చలు జరుగుతునున్నాయి. ఈ ప్రతిపాదనపై చర్చించేందుకే ఐఆర్సీటీసీ సీఎండీ ఎకె మనోచా టీఎస్టీడీసీ సందర్శించినట్టు తెలుస్తోంది.
మహారాజ ఎక్స్ప్రెస్ విలాసవంతమైన ట్రావెల్ ప్యాకెజ్ను ప్రయాణికులకు ఆఫర్ చేస్తోంది. ఫుడ్, వైన్, టూరిస్ట్ ప్రాంతాల సందర్శన ఈ ట్రావెల్ ప్యాకెజ్లో ఉన్నాయి. నోరూరించే చైనీస్, థాయ్, మొగలాయి, ఇండియన్ వంటకాలను ఈ ట్రైన్ మెనూలో ఆఫర్ చేస్తోంది. విలాసవంతమైన గదులను ఆఫర్ చేసినందుకు గాను ఒక జంటకు(కొంచెం ఎక్కువగానూ) ఒక రాత్రికి రూ.66,760 లను ఛార్జ్ చేస్తున్నారు. అయితే, ఇందులో ప్రయాణిస్తే ఓ ప్యాలెస్, ఒక రాజప్రసాదంలో ఉన్న అనుభవం కలుగకమానదు.