సొంతపార్టీనేతలే బండి సంజయ్ కు షాక్ ఇస్తున్నారా? చేరికల అడ్డగింతపై అగ్రనేతలకు బండి కంప్లైంట్!!
తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కు సొంత పార్టీలో నేతల తీరు తలనొప్పిగా మారుతుందా? పార్టీకి సంబంధించిన కొందరు సీనియర్ నేతల వ్యవహారశైలిపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారా? బీజేపీ లో చేరికలకు బండి సంజయ్ ప్రయత్నం చేస్తుంటే, చేరికలను అడ్డుకోవడానికి బండి సంజయ్ వ్యతిరేక వర్గం పని చేస్తోందా? పార్టీకి సంబంధించిన కీలక నిర్ణయాలను కొందరు నేతలు బయటకు లీక్ ఇస్తున్నారా? సోషల్ మీడియాలో బండి సంజయ్ పై దుష్ప్రచారానికి పార్టీ నేతలు సహకరిస్తున్నారా? అంటే అవును అని చెబుతున్నారు బండి సంజయ్ వర్గం.
బండి సంజయ్ కు సొంత పార్టీలోనే కుంపటి..
తెలంగాణ రాష్ట్రంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి బండి సంజయ్ దూకుడుగా పార్టీని ముందుకు తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే బండి సంజయ్ నాయకత్వాన్ని అంగీకరించలేని కొందరు సీనియర్ నాయకులు పార్టీ కోసం ఆయన చేసే పనులను అడ్డుకునే పనిలో పడ్డారు. ప్రతిపక్ష పాత్రను సొంత పార్టీ నాయకులు పోషిస్తున్న పరిస్థితి ఉంది. సోషల్ మీడియాలో బండి సంజయ్ పై తప్పుడు ప్రచారాలు చేయించడంలో కూడా సొంత పార్టీ నేతల పాత్ర ఉన్నట్టు బండి సంజయ్ గుర్తించినట్టు సమాచారం. అంతేకాదు పార్టీ కోసం పని చేస్తున్న తనపై వ్యక్తిగత దాడికి పార్టీ నేతలు సహకరిస్తున్నారని బండి సంజయ్ తీవ్ర ఆవేదన లో ఉన్నారు.
పార్టీలో కొందరు సీనియర్ నాయకులపై బండి సంజయ్ హైకమాండ్ కు ఫిర్యాదు
ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా బిజెపిని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకు రావాలని తాను ప్రయత్నిస్తుంటే, ఆ ప్రయత్నాలకు సొంత పార్టీ నేతలే గండి కొడుతున్నారని తీవ్ర మనస్థాపంలో ఉన్నారు బండి సంజయ్. ఈ క్రమంలోనే ఆయన పార్టీలో జరుగుతున్న కీలక పరిణామాలపై ఢిల్లీ నాయకుల వద్ద ప్రస్తావించి కొందరు నేతల తీరును ఏకరువు పెట్టారట. పార్టీకి సంబంధించిన కీలక నిర్ణయాలు బయటకు వెళ్లడం, సోషల్ మీడియాలో ప్రచారం జరగడం తదితర అంశాలపై బండి సంజయ్ అగ్రనాయకత్వం వద్ద వాపోతున్నారు అని సమాచారం.
పార్టీలో చేరికలను అడ్డుకుంటున్నారని అధిష్టానం వద్ద అసహనం
అంతేకాదు పార్టీలో చేరికలపై జరుగుతున్న ప్రచారాన్ని, కొందరు నేతలు పార్టీలో చేరికలను అడ్డగిస్తున్న వైనాన్ని బండి సంజయ్ అగ్రనాయకత్వం వద్ద చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేశారని సమాచారం. పార్టీ కోసం అందరూ కలిసికట్టుగా పని చేయాల్సిన చోట, సొంత పార్టీ నేతలే తనను అడ్డుకోవడం ఇబ్బందిగా మారిందని బండి సంజయ్ లబోదిబోమంటున్నారు అని తెలుస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించాలని బిజెపి అగ్రనాయకత్వం నిర్ణయించిన సమయంలో, బండి సంజయ్ సొంత పార్టీలోని కొందరు సీనియర్ నేతలపై అగ్ర నాయకత్వానికి ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారింది.
జాతీయ కార్యవర్గ సమావేశాలకు ముందు బండి సంజయ్ ఫిర్యాదు.. పార్టీ వర్గాలలో ఆసక్తి
ఇదిలా ఉంటే బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్లోని నోవాటెల్ నిర్వహించడానికి నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రం పై బిజెపి ఫోకస్ చేస్తుందని చెప్పడం లో భాగంగా జాతీయ కార్యవర్గ సమావేశంలో హైదరాబాద్ కేంద్రంగా నిర్వహిస్తోంది. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా బీజేపీ అగ్ర నాయకులందరూ హైదరాబాద్ కు రానున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్ వంటి ప్రముఖులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశాలకు రానున్న నేపథ్యంలో భారీగా ఏర్పాట్లు చేశారు తెలంగాణ రాష్ట్ర బిజెపి నాయకులు. ఈ సమావేశాలను సక్సెస్ చేయాలని బండి సంజయ్ శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఇక ఇలాంటి సమయంలోనే బండి సంజయ్ తెలంగాణ బిజెపి శాఖలోని కొందరు నేతల తీరుపై అగ్ర నాయకత్వం వద్ద అసహనం వెళ్లగక్కడంతో, జాతీయ కార్యవర్గ సమావేశాల్లో దీనిపై కీలక నిర్ణయం తీసుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది.