Analysis:కేసీఆర్ పట్టుకోల్పోతున్నారా... పట్టు బిగిస్తున్నారా..?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై పట్టుకోల్పోయారా..? స్వయంగా ముఖ్యమంత్రి హెచ్చరించినా కార్మిక సంఘాలు ఎందుకు బేఖాతరంటున్నాయి..? చర్యలు తీసుకోలేరనే కాన్ఫిడెన్సా లేక ప్రతిపక్షాల మద్దతు ఉందనా..? పండగవేళ తెలంగాణ ఆర్టీసి కార్మికులు సమ్మెకు దిగడంతో ఇటు ప్రజలు అటు ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సొంత ఊళ్లకు బస్సులు లేక పోవడంతో సామాన్యులు నరకం చూస్తున్నారు. ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఎస్మా
ప్రయోగంతో
ఆందోళన
అణిచే
యత్నం
...
నాడు
జయలలిత..
నేడు
కేసీఆర్
?
కేసీఆర్ మదిలో ఏముంది..?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు భోళా శంకరుడు అనే పేరుంది. ఎవరు ఏమి అడిగినా అక్కడికక్కడే పరిష్కారం చూపుతారు. లేదా వారు అడిగినది దాదాపు వరంగా ఇచ్చేస్తారనే మంచి పేరుంది. అయితే తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె నోటీసు ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వంలో సీరియస్నెస్ కనిపించలేదు. కేవలం అధికారులు మాత్రమే కార్మిక సంఘాలతో చర్చలకు దిగారు కానీ ... ఒక్క మంత్రి కూడా వారితో అధికారిక చర్చలు జరిపిన దాఖలాలు కనిపించలేదు. ముఖ్యమంత్రిగా కొన్ని నిర్ణయాలు కఠినంగా అమలు చేయాల్సి వచ్చినప్పటికీ సీఎం కేసీఆర్ వాటిని వివాదాస్పదంగా మార్చుకుంటున్నట్లు కనిపిస్తోంది.
సున్నితమైన అంశాన్ని ప్రభుత్వం జటిలం చేస్తోందా..?
పాలనలో అధికారులకు స్వేచ్ఛనిచ్చే కేసీఆర్ ఉద్యోగుల విషయాల్లో మాత్రం పట్టుదలతో పోతున్నారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం డిమాండ్ సాధ్యంకాకపోయినా... ఇతర డిమాండ్లలో కొన్నిటిని స్పష్టమైన హామీ ఇచ్చి వారిని దారిలోకి తీసుకొచ్చుకునే అవకాశం ఉంది. అయితే ఆ ప్రయత్నాలు జరగుతున్నట్లు కనిపించడంలేదు. అసలు కార్మిక సంఘాల వ్యవహారం చాలా సున్నితమైన అంశం. అందునా ఆర్టీసీ వంటి వ్యవహారాలకు సంబంధించి చర్చల బాధ్యతలు మంత్రులకు అప్పగించాల్సిందిపోయి అధికారులకు కేసీఆర్ అప్పగించారు.ఇక్కడే ఏదో రాంగ్ స్టెప్ వేసినట్లు విమర్శలు వస్తున్నాయి. చివరి క్షణంలో ఆ అధికారుల కమిటీని కేసీఆర్ ఎందుకు రద్దు చేశారనే ప్రశ్న తలెత్తుతోంది. కార్మిక సంఘాలతో చర్చల బాధ్యతలను ఏ మంత్రికి ఎందుకు అప్పగించలేదు అనే అభిప్రాయంను కొందరు అనలిస్టులు వ్యక్తం చేస్తున్నారు.
ట్రబుల్ షూటర్ హరీష్ రావును ఎందుకు రంగంలోకి దింపడం లేదు..?
ఇక ప్రభుత్వంలో ఎలాంటి జటిలమైన సమస్యలు వచ్చినా.. ట్రబుల్ షూటర్ మంత్రి హరీష్ రావు పరిష్కరించేవారు. కానీ ఆర్టీసీ వ్యవహారంలో మాత్రం సమస్యను పరిష్కరించే దిశగా హరీష్ రావుకు కేసీఆర్ ఆదేశాలు ఎందుకివ్వలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రస్తుతం ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నాయకుడు అశ్వర్థామ రెడ్డితో హరీష్రావుకు మంచి సంబంధాలున్నాయి. హరీష్ రావు పిలిపించి అశ్వద్ధామ రెడ్డితో మాట్లాడితే సమస్యకు ఏమైనా పరిష్కారం దొరుకుతుందేమో అనే మాట వినిపిస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో వీరంతా టీఆర్ఎస్ చెట్టుకింద ఎదిగిన నాయకులే కావడం విశేషం. ఇప్పుడు పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే ఏకంగా ప్రభుత్వం దమ్మును ప్రశ్నిస్తూ తనను డిస్మిస్ చేయాలంటూ సవాల్ విసురుతున్నారు అశ్వద్ధామ రెడ్డి. ఎవరికి వారు పంతాలకు పోతుండటంతో సమస్యకు పరిష్కారం దొరకడం లేదు.
కేసీఆర్ సెల్ఫ్గోల్ వేసుకుంటున్నారా..?
ఉద్యోగులకు ఇప్పుటి వరకు పీఆర్సీ సంగతి ఎలా ఉన్నా కనీసం ఐఆర్ కూడా ప్రకటించలేదు. ఆర్థిక మాంద్యం ఉన్నది వాస్తవమే అయినా ప్రభుత్వమే కాదు ఉద్యోగులు సైతం ఈ ఆర్థికమాంద్యంలో ఇబ్బందులు పడుతున్నారన్న విషయాన్ని విస్మరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా వచ్చిన జగన్ ప్రభుత్వం వరుస హామీల అమలుతో , వరాలతో దూసుకెళుతుంటే కేసీఆర్ మీద మరింత ఒత్తిడి పెరుగుతోంది. కేసీఆర్ గతంకంటే భిన్నంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శ మొదలైంది. ఈ మొండితనమే అధికారంలో ఉన్నా... నిజామాబాద్లో టీఆర్ఎస్ ఓటమి పాలవడం, ఇప్పుడు హుజూర్నగర్లో సీపీఐ వద్దకు వెళ్లి మరీ మద్దతు కోరాల్సిన పరిస్థితికి కారణమవుతోంది.
తెరపైకి ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల విషయం
ఆర్టీసీ విషయంలో ఇంత కఠినంగా ఉన్న ముఖ్యమంత్రి... ఇంటర్ పరీక్షపత్రాల వాల్యుయేషన్ గందరగోళం, విద్యార్థుల ఆత్మహత్యల విషయంలో మాత్రం ఎందుకు కఠినంగా వ్యవహరించలేకపోయారనే ప్రశ్నలు కూడా తెరపైకొస్తున్నాయి. ఎక్కడో బ్యాలెన్స్ తప్పుతోంది. మంత్రులు సైతం కేసీఆర్ మూడ్కు తగ్గట్టుగా నడుచుకుంటూ అతి జాగ్రత్త పడుతున్నారు. సరిగ్గా దీనినే ఇప్పుడు ప్రతిపక్షాలు అందిపుచ్చుకుంటున్నాయి.
రవాణా దోపిడీకి గురవుతున్న తెలంగాణ ప్రజలు
కార్మిక సంఘాల డిమాండ్లు ఎందుకు తీర్చడం లేదో.. ప్రజలు పడుతున్న ఇబ్బందులకు పరిష్కారాలేమిటో.. ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. అటు కార్మిక సంఘాలు ఇటు ప్రభుత్వం పట్టుదలల మధ్య తెలంగాణ ప్రజలు రవాణా దోపిడీకి గురవుతున్నారు. మొత్తంగా చూస్తే కేసీఆర్ పట్టు బిగిస్తున్నారా లేక పట్టు కోల్పోతున్నారా అనే అనుమానం కలుగుతోంది.