అవును ఇది రివర్స్: కారెక్కనున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్?
మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రత్యామ్నాయ మార్గాల వైపు.. టీఆర్ఎస్లో చేరేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారని సమాచారం.
హైదరాబాద్/మహబూబ్నగర్: తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా విపక్ష నేతలంతా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇటీవలే టీడీపీ నుంచి రేవంత్ రెడ్డి భారీగా సహచర నేతలతో కాంగ్రెస్ పార్టీతో చేరితే.. అందుకు భిన్నంగా.. మాజీ మంత్రి డీకే అరుణతో విభేదాల వల్ల ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ 'గులాబీ' కారెక్కనున్నారని తెలుస్తున్నది. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో సీఎల్పీ పనితీరు పట్ల, బయట పార్టీ వ్యవహారశైలితో తాను తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్కుమార్ అన్నారు. కార్యకర్త స్థాయి నుంచి ఎదిగొచ్చిన తాను ఈ దుస్థితిపై తీవ్రంగా కలత చెందుతున్నానన్నారు.
తన ఆవేదనలో మరో ఉద్దేశం ఏదీ లేదని సెలవిచ్చారు. గురువారం అసెంబ్లీ లాబీల్లో తనను కలిసిన మీడియాతో ఆయన పై విధంగా వ్యాఖ్యాంచారు. పార్టీ బాగుండాలనే తన తపన అని అన్నారు. కానీ, సంపత్ వ్యాఖ్యలను బట్టి చూస్తే ఆయన కాంగ్రెస్ పార్టీని వీడనున్నారని, అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారనే సందేహాలు కలుగుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ వాణి బలంగా వినిపిస్తున్న సంపత్ కుమార్
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పుడంతా ఇదే అంశంపై చర్చ జరుగుతోంది. మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణతో తలెత్తిన విభేదాలు, నియోజకవర్గంలో సొంత పార్టీలో ఎదురవుతున్న ఇబ్బందులు, అధికార పార్టీ నుంచి పదే పదే వస్తున్న ఆహ్వానాల నేపథ్యంలో తన రాజకీయ భవిష్యత్పై సంపత్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి అసెంబ్లీ సహా ఏ వేదికనుంచైనా సంపత్కుమార్ కాంగ్రెస్ పార్టీ వాదనను బలంగా వినిపిస్తున్నారు. అయినా ఆయన పార్టీ మారుతారనే చర్చ పదే పదే రావడం వెనుక బలమైన కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. సంపత్ ఎమ్మెల్యే అయ్యాక పార్టీ సీనియర్ నేత డీకే అరుణతో విభేదాలు వచ్చాయని సమాచారం.
మాజీ ఎమ్మెల్యేతో చల్లాతో దెబ్బతిన్న సంబంధాలు
మాజీ మంత్రి డీకే అరుణతో విభేదాల నేపథ్యంలోనే సంపత్ కుమార్ను టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్కుమార్రెడ్డి ప్రోత్సహిస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. తాజాగా రేవంత్రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడూ డీకే అరుణ వైఖరికి భిన్నంగా రేవంత్ను పార్టీలోకి సంపత్ కుమార్ ఆహ్వానించడంతో వారి మధ్య విభేదాలు మరింత తీవ్రం అయ్యాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామిరెడ్డితో సంపత్ సంబంధాలు దెబ్బతిన్నాయనే ప్రచారం సాగుతోంది.
బుజ్జగిస్తున్న ఎమ్మెల్యేలు చిన్నారెడ్డి, రేవంత్
2004లో స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలుపొంది, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంకట్రామిరెడ్డికి నియోజకవర్గంలో ఇప్పటికీ బలమైన ఓటు బ్యాంకు ఉండడం, ఆయన నుంచి వచ్చే ఎన్నికల్లో సహాయనిరాకరణ ఎదురైతే దానిని అధిగమించేందుకు పార్టీ మారడమే శ్రేయస్కరమనే యోచనలో సంపత్ కుమార్ ఉన్నట్లు తెలిసింది. ఇదే సమయంలో ఎమ్మెల్యే సంపత్కుమార్ను టీఆర్ఎస్ పార్టీలోకి తీసుకెళ్లేందుకు రాష్ట్ర మంత్రులు తన్నీర్ హరీశ్రావు, జూపల్లి క్రుష్ణారావు చర్చిస్తున్నట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తామనే హామీ టీఆర్ఎస్ అధిష్ఠానం నుంచి వస్తున్నట్లు తెలుస్తోంది. సంపత్ను పార్టీ వీడకుండా చూసేందుకు ఉత్తమ్, ఏఐసీసీ కార్యదర్శి కొప్పుల రాజుతోపాటు, ఎమ్మెల్యేలు చిన్నారెడ్డి, రేవంత్రెడ్డి బుజ్జగిస్తున్నట్లు సమాచారం.