ధర్నాచౌక్ పునరుద్ధరణే శరణ్యమా?: ప్రగతి భవన్కు నిరసనల సెగ
ఇందిరాపార్క్ వద్దే ధర్నా చౌక్ పునరుద్ధరణకు అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటులోనూ కీలక పాత్ర పోషించిన ధర్నా చౌక్ గొంతు నులిమేందుకు తర్వాత కొలువు దీరిన తెలంగాణ సర్కార్ ఒడిగట్టిందని తెలుస్తోంది.
హైదరాబాద్: ప్రజలకు ఏ ఇబ్బంది, సమస్య వచ్చినా వాటిని తీర్చాల్సిన బాధ్యత సర్కార్దే.. ప్రభుత్వానికి తమ సమస్యలు తెలియజేయడానికి, నిరసన ప్రకటించడానికి వేదిక అవసరం. ఇందులో భాగంగా ఏర్పడిందే ఇందిరాపార్క్ దగ్గర ధర్నాచౌక్. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలోనూ కీలకపాత్ర ఇది పోషించింది.
ఆ సమయంలో జరిగిన సభలు, సమావేశాలు, ధర్నాలకు ధర్నాచౌక్ వేదికగా మారింది. ఇలాంటి ఉద్యమాల కేంద్రం ఇందిరాపార్క్ ధర్నాచౌక్ను రద్దు చేసిందీ తెలంగాణ ప్రభుత్వం. తద్వారా ప్రజా ఉద్యమాల గొంతు నులిమేందుకు ప్రయత్నించిందన్న ఆరోపణలు ఉన్నాయి.
దాంతో నేడు ప్రజాసంఘాలతోపాటు రైతులు, నిరుద్యోగులు వివిధ వర్గాల వారు సీఎం కేసీఆర్ అధికార నివాసం ప్రగతిభవన్నే లక్ష్యంగా పెట్టుకున్నారు. సమస్యలు ప్రభుత్వం దృష్టికి వెళ్లాలన్నా, పరిష్కారం కావాలన్నా ఇపుడు ప్రగతిభవన్ వైపు దౌడు తీస్తూ అక్కడే ఆందోళనలకు దిగుతుండటం పోలీసులకు తలనొప్పిగా మారుతున్నది.
ప్రగతిభవన్ వద్ద ఆందోళనలతో సర్కార్కు ఇబ్బందికరం
ప్రజాసంఘాలు, రైతులు, నిరుద్యోగులు, యువకులు, ఉద్యోగులు, కవులు, కళాకారులు, మేధావులతోపాటు పలువర్గాల ప్రజలు ప్రభుత్వంపై నిరసన తెలిపేందుకు ధర్నాచౌక్ను వేదికగా చేసుకునే వారు. సభలు, సమావేశాలతో ధర్నాచౌక్లో తమ సమస్యలను గళమెత్తేవారు. నేడు ధర్నాచౌక్ను ప్రభుత్వం బలవంతంగా ఎత్తేయడంతో అసలు సమస్య మొదలైంది. ఏకంగా ఆందోళనకారులు నేరుగా సీఎం కేసీఆర్ నివాస ప్రాంతమైన ప్రగతిభవన్ను లక్ష్యంగా చేసుకోవడం సర్కార్కు మింగుడు పడటంలేదు. మరోవైపు పోలీసులకూ తలనొప్పిగా మారింది.
పోలీసు అధికారుల ఆందోళన కారణమిది
సీఎం నివాసం కావడంతో నిత్యం వీవీఐపీలు, ఎంపీలు, మంత్రులు, ఇతర ప్రముఖులతో ఈ ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటుంది. ఈ క్రమంలో ఆందోళనకారులు గుంపులుగా చేరి నినాదాలతో ప్రదర్శనలు చేస్తుండటం, ఎటు వైపు ఆందోళనకారులు వస్తారో తెలియని పరిస్థితి. ఇదే శాంతి భద్రతల పరంగా పోలీసు అధికారులకు ఇబ్బందిగా మారింది. ఈ నిరసనల్లో అసాంఘిక శక్తులు చొరబడే ప్రమాదముందని పోలీస్ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఎలాంటి సమాచారం లేకుండా నేరుగా ప్రగతిభవన్ వద్ద ఆందోళనలు చేస్తుండటంతో పోలీసులకు ముచ్చెమటలు పడుతున్నాయి. దీంతో ఇందిరాపార్కులోనే ధర్నాచౌక్ పునరాలోచన గురించి సర్కార్ తర్జనభర్జన పడుతున్నది. ధర్నా చౌక్ కొనసాగిస్తే ఎలాంటి సమస్యలుండవని, ఉద్యమకారులను అక్కడే నిలువరించేందుకు అనువుగా ఉంటుందని పోలీసు ఉన్నతాధికారులు చర్చించుకుంటున్నారు.
2000 నుంచి ఇందిరా పార్క్ వద్దకు తరలింపు
గతంలో సచివాలయం, అసెంబ్లీ గేట్ల ముందు ప్రజాసంఘాలు, ఉద్యమకారులు తమ నిరసనలు తెలిపేవారు. అసెంబ్లీ సమయంలో తీవ్ర ఇబ్బందులు ఏర్పడడాన్ని గుర్తించిన అప్పటి ప్రభుత్వం 1990లో తెలుగుతల్లి విగ్రహం దగ్గరికి ధర్నాస్థలిని మార్చారు. ఆ తర్వాత 2000లో రెండు కిలోమీటర్ల దూరంలో ఉండాలని నిర్ణయానికొచ్చిన అప్పటి ప్రభుత్వం ధర్నాలు, నిరసన కార్యక్రమాలు ఇందిపార్కు గేటు వద్ద అనుమతించింది. రాష్ట్రం సాధించుకున్నాక సీఎం కేసీఆర్ ప్రజాఉద్యమాలను అణచివేసేలా.. మొత్తంగా ధర్నాచౌక్నే రద్దు చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగసంఘాలతోపాటు ప్రజాసంఘాలూ సర్కారు తీరుపై మండిపడుతున్నాయి.
ధర్నాచౌక్ పునరుద్ధరిస్తారా?
ధర్నాచౌక్ రద్దు నిర్ణయం అనంతరం ఉద్యమకారులు నిరసనలకు, ధర్నాలకు నేరుగా ప్రగతిభవన్నే లక్ష్యం చేసుకోవడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. నిత్యం ఏదో రకంగా ప్రగతిభవన్ను ముట్టడించడంతో శాంతిభద్రతలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని పోలీసు ఉన్నతాధికారులు సైతం తమ అభిప్రాయాన్ని ప్రభుత్వానికి నివేదించినట్టు తెలిసింది. ధర్నాచౌకే పునరుద్ధరణే బెటరనే చర్చ పోలీస్వర్గాల్లో సాగుతోంది. మరీ దీనిపై సీఎం కేసీఆర్ వైఖరి ఎలా ఉంటుందోనని పోలీసు ఉన్నతాధికారులు చర్చించుకుంటున్నారు.