పీవోహెచ్ కథ కంచికేనా..!: కోచ్, వ్యాగన్ పరిశ్రమల దారిలోనే పయనిస్తుందా!
ఫిబ్రవరి ఒకటిన కేంద్ర బడ్జెట్ (రైల్వే బడ్జెట్ ఇందులోనే కలిపేశారు) ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో కాజిపేట పీవోహెచ్కు నిధులు కేటాయిస్తారా.. లేదా అనేది అనుమానంగా ఉంది.
వరంగల్: కాజీపేటను రైల్వే ప్రాజెక్టులు ఊరిస్తున్నాయి.. ఎన్నో ఆశలు, ఆకాంక్షల నడుమ మంజూరవుతున్నాయి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కొరవడడంతో చివరికి చేజారుతున్నాయి. మొన్న కోచ్, నిన్న వ్యాగన్ పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయి. నేడు అదే బాటలో పీవోహెచ్(ఇంజన్ల మరమ్మతు కేంద్రం) పయనించేలా ఉంది. ఏర్పాటుకు ఇక్కడ ఎలాంటి ప్రయత్నాలు జరగక పోవడంతో దీని కథా కంచికేనా అనే అనుమానం కలుగుతోంది.
ఫిబ్రవరి ఒకటిన కేంద్ర బడ్జెట్ (రైల్వే బడ్జెట్ ఇందులోనే కలిపేశారు) ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో పీవోహెచ్కు నిధులు కేటాయిస్తారా.. లేదా అనేది అనుమానంగా ఉంది. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో కాజీపేటకు కోచ్ పరిశ్రమ మంజూరైంది. తర్వాత పంజాబ్లో ఖలిస్తాన్ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. దాన్ని చల్లార్చడంలో భాగంగా స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించడానికి నాటి కేంద్ర ప్రభుత్వం మనకు వచ్చిన పరిశ్రమను కపుర్తలాకు తరలించింది.
2010లో రైల్వే శాఖ కాజీపేటకు వ్యాగన్ మరమ్మతు ప్రాజెక్టును ప్రకటించింది. ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉచితంగా స్థలం అడిగింది. అయోధ్యపురంలో దేవాదాయ శాఖకు చెందిన 52 ఎకరాలను ఇవ్వడానికి అది సిద్ధమైంది. కానీ, ఈ ప్రక్రియ ఆలస్యం కావడంతో వ్యాగన్ పరిశ్రమ ఏర్పాటు ఆలోచనను రైల్వే శాఖ విరమించుకుంది. బదులుగా పీవోహెచ్ను ఇచ్చింది.
అనంతరం రైల్వే అధికారులు అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్ కరుణను కలిశారు. తమకు అయోధ్యపురంలో ఇస్తున్న భూమికి అదనంగా మరో 100 ఎకరాలను ఇస్తే ప్రాజెక్టును ఏర్పాటు చేసుకుంటామని వినతి పత్రం సమర్పించారు. ఈ విషయంపై కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపై ఎలాంటి స్పందన లేదు.
మూడేళ్లు మాత్రమే...
రైల్వే శాఖ ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే అది మూడేళ్ల పాటు అమల్లో ఉంటుంది. కాజీపేటలో పీవోహెచ్ వర్క్షాపు ఏర్పాటు చేస్తామనే ప్రతిపాదన చేసి ఇప్పటికి సంవత్సరం కావొస్తుంది. మరో రెండేళ్ల సమయం మాత్రమే మిగిలి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోతే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుంది.
ఏం లాభం?
పరిశ్రమ ఏర్పాటైతే స్థానికంగా కాజీపేట, రాంపూర్, పెద్ద పెండ్యాల ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. పీవోహెచ్లోకి ఏడాదికొకసారి ఇంజన్ మరమ్మతుల కోసం వస్తుంది. దాన్ని పూర్తిగా విప్పి కొత్త పరికరాలను అమరుస్తారు. ఇందులో 10,000 వరకు మంది ఉద్యోగులు పని చేసే అవకాశముంది. వీరికి నివాస గృహాలు ఏర్పాటు చేస్తారు. అనుబంధంగా పరిశ్రమలు వస్తాయి. ప్రత్యేక ఆర్పీఎఫ్, అధికారుల కార్యాలయాలు నెలకొల్పుతారు.