కూతురు పెళ్లి: చిరంజీవి-పవన్ కళ్యాణ్లకు గాలి జనార్ధన్ ఆహ్వానం?
హైదరాబాద్: కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి తన కూతురు పెళ్లికి తెలుగు ప్రముఖులను చాలామందిని ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా మెగా సోదరులకు కూడా ఆయన ఆహ్వానం పలికారని తెలుస్తోందని అంటున్నారు.
మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్లకు కూడా గాలి జనార్ధన్ రెడ్డి పత్రికలు అందజేశారని తెలుస్తోందని అంటున్నారు. వారితో పాటు దర్శకరత్న దాసరి నారాయణ రావు, మరికొంతమంది నిర్మాతలను ఆయన ఆహ్వానించారట.
కాగా, గాలి జనార్ధన్ రెడ్డి తన కూతురు పెళ్లి కార్డుతో మరోసారి వార్తల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. వివాహ ఆహ్వాన పత్రిక నుంచి అణువణువునా భారీతనం నిండిన ఆ పెళ్లి గురించి తెలుగువారితో పాటు దేశమంతా చర్చనీయాంశమైంది.
ఇదిలా ఉండగా, గనుల అక్రమ తవ్వకం ఆరోపణలపై 2011 సెప్టెంబరు 5న అరెస్టయిన గాలి అయిదేళ్ల తర్వాత తొలిసారిగా సొంతగడ్డ బళ్లారికి చేరుకుంటున్నారు. నవంబరు 16న కుమార్తె బ్రహ్మణి వివాహం నేపథ్యంలో ఒకటో తేదీ నుంచి 21 వరకు ఆయన బళ్లారిలో ఉండేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది.
2011 సెప్టెంబరు 5న బళ్లారిలోని జనార్దన్రెడ్డి ఇంటి నుంచి సీబీఐ ఆయన్ను అరెస్టు చేసి హైదరాబాద్కు తరలించింది. తర్వాత 2012 ఆగస్టు 16న బందోబస్తు మధ్య ఆయన్ను బళ్లారికి తీసుకొచ్చి అదే రోజు రాత్రి కేంద్ర కారాగారానికి తరలించింది.
అనంతరం హైదరాబాద్, బెంగళూరులలో గాలి జనార్ధన్ రెడ్డి మూడున్నరేళ్లపాటు జైలులో ఉన్నారు. అనంతరం బెయిలు పైన విడుదలయ్యారు. కానీ బళ్లారికి వెళ్లేందుకు న్యాయస్థానం అనుమతించలేదు. ఇప్పుడు ఆయనకు ఆ అవకాశం లభించింది.