రాసిచ్చిన స్క్రిప్టులేనా.. మంత్రుల సేమ్ డైలాగ్స్.. ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ ఖతర్నాక్ ప్లాన్..!
హైదరాబాద్ : అదే స్క్రిప్ట్. సేమ్ డైలాగ్స్. తెలంగాణ మంత్రుల నోట అవే మాటలు. మంత్రులు ఎవరు మాట్లాడినా అదే తీరు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్టీసీ సమ్మెకు సంబంధించి మంత్రులందరికీ సేమ్ స్క్రిప్ట్ అందిందా.. అసలు ఏం జరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకు ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ వ్యూహమేంటి? ప్రభుత్వం వెర్షన్ ఒకేలా కనిపించడానికి మంత్రులందరికీ సేమ్ స్క్రిప్ట్ అందించారేమో అనే వాదనలు లేకపోలేదు.
పక్కా స్క్రిప్ట్.. సేమ్ డైలాగ్స్.. వరుస ప్రెస్మీట్లు
ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె ఉధృతమవుతోంది. ప్రభుత్వం దిగి రాకపోవడంతో కార్మిక సంఘాల జేఏసీ నేతలు ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు చర్చానీయాంశంగా మారాయి. కార్మిక సంఘాల నేతలు ఆర్టీసీ ఉద్యోగులను తప్పు దారి పట్టిస్తున్నారని.. వారికి ప్రతిపక్ష నేతలు మద్దతు ఇస్తున్నారని ఢంకా బజాయిస్తున్నారు. అయితే ఇక్కడో ట్విస్ట్ ఏంటంటే.. ఏ మంత్రి చూసినా ఏమున్నది గర్వకారణం.. సమస్తం అదే స్క్రిప్ట్ మయం అన్నట్లుగా తయారైంది పరిస్థితి. ఆర్టీసీ సమ్మెపై ప్రెస్ మీట్లలో మాట్లాడిన మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్.. ఇలా ఎవరు చూసినా సేమ్ డైలాగ్స్ రిపీట్ చేసినట్లు కనిపించింది.
ఖమ్మం ఆర్టీసీ డ్రైవర్ మృతి.. కార్మికులు గరం గరం.. 14 నాడు జిల్లా బంద్
విలీనం ఎన్నికల మెనిఫెస్టోలో లేదే.. ఎర్రబెల్లి
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని మెనిఫెస్టోలో చెప్పలేదన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఆర్టీసీ యూనియన్ లీడర్లు ప్రతిపక్ష నేతల వలలో పడ్డారని చెప్పుకొచ్చారు. వాళ్ల చెప్పుడు మాటలు విని వీళ్లు రెచ్చిపోతున్నారని వ్యాఖ్యానించారు. రాజకీయంగా తెలంగాణ ప్రభుత్వం మీద కుట్ర చేయడానికే ఇలా చేస్తున్నారని తెలిపారు. 25 శాతం ఫిట్మెంట్ అడిగితే ఆర్టీసీ కార్మికుల మీద ప్రేమతో సీఎం కేసీఆర్ 44 శాతం ఫిట్మెంట్ ఇచ్చిన అంశం మరచిపోయారా అంటూ ప్రశ్నించారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా.. ఇక్కడే ఆర్టీసీ కార్మికుల జీతాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తున్నామని బీజేపీ, కాంగ్రెస్ నేతలు చిత్రీకరిస్తున్నారని.. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తామని కేసీఆర్ ఎన్నడూ చెప్పలేదన్నారు. ఆర్టీసీని బలోపేతం చేయాలన్నదే కేసీఆర్ అభిమతమని.. కార్మికులను ఇబ్బందులకు గురిచేయాలన్నది ఆయన ఉద్దేశం కాదని చెప్పుకొచ్చారు.
యూనియన్ నేతల వెనుక రాజకీయ శక్తులు.. గంగుల
ఆర్టీసీ సమ్మెను కొంతమంది సీఎం కేసీఆర్ పై తమకున్న ఈర్ష్యను తీర్చుకొనేందుకు అనుకూలంగా మలచుకుంటున్నారని మండిపడ్డారు మంత్రి గంగుల కమలాకర్. ఎక్కడ టెంట్ కనబడితే అక్కడ కాంగ్రెస్, బీజేపీ నేతలు వాలిపోతున్నారని వ్యాఖ్యానించారు. యూనియన్ నేతల వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయని.. ఏనాడు స్టీరింగ్ పట్టని యూనియన్ నేతలు భవిష్యత్తులో ఎమ్మెల్యేలు కావాలని ప్రయత్నిస్తున్నారని.. అందుకే కార్మికులను ఇలా రెచ్చగొడుతున్నారని తెలిపారు.
ఆర్టీసీ విలీనంపై సీఎం కేసీఆర్ ఎన్నికల మెనిఫెస్టోలో పెట్టలేదని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తారా అంటూ ప్రశ్నించారు. ఎయిర్ ఇండియా, రైల్వే, బీఎస్ఎన్ఎల్ ప్రైవేటీకరణకు చేస్తున్న కుట్ర సంగతేందని బీజేపీ నేతలను నిలదీశారు. పండుగను అడ్డు పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేయాలని చూసారని.. ఈ సమ్మెకు ప్రజల మద్దతు లేదని స్పష్టం చేశారు.
కాంగ్రెస్, బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఆర్టీసీని విలీనం చేశారా.. తలసాని
ప్రజా రవాణా సంస్థ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామనేది టీఆర్ఎస్ ఎన్నికల మెనిఫెస్టోలో లేదని స్పష్టం చేశారు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఆర్టీసీని కాపాడేందుకు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందన్నారు. ఆర్టీసీ భవిష్యత్తుపై కొందరు లేని పోని అసత్య ప్రకటనలు చేస్తున్నారని.. అలాంటి దుష్ప్రచారాలు నమ్మెద్దని సూచించారు. శనివారం నాడు టీఆర్ఎస్ శాసనసభ పక్షం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో తలసాని పలు అంశాలు ప్రస్తావించారు.
ఆర్టీసీ సమ్మెను కాంగ్రెస్, బీజేపీ నేతలు అస్త్రంగా మలచుకోవాలని చూస్తున్నారని.. వాటిని తిప్పి కొడతామని హెచ్చరించారు తలసాని. మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఆర్టీసీని అక్కడి ప్రభుత్వాలు ఏం చేశాయో అందరికి తెలుసని చెప్పుకొచ్చారు. ఆర్టీసీపై సీఎం కేసీఆర్కు ప్రేమ ఉందని.. అందుకే ఇదివరకు ఉద్యోగులకు 44 శాతం ఫిట్మెంట్ సహా అనేక సానుకూల నిర్ణయాలు తీసుకున్నారని వెల్లడించారు తలసాని. ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసేందుకు.. ఎప్పుడు ఏ అంశం దొరుకుతుందా అని ఎదురు చూసే విపక్ష నేతలు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం తగదని హెచ్చరించారు.
50 శాతం ఓట్లు మాకేనంటూ.. టీఆర్ఎస్ గెలుపు ఖాయమంటూ.. కేటీఆర్ ఫుల్ ఖుషీయా?
టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రుల హవా నడవదా.. ఓన్లీ కేసీఆర్ మాత్రమేనా?
ఈ ముగ్గురు మంత్రులు మాట్లాడిన విధానం ఒకేలా ఉంది. బీజేపీ, కాంగ్రెస్ నేతలను ఎండగట్టడం.. ఈ రెండు పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నారా అని ప్రశ్నించడం.. ఆర్టీసీపై సీఎం కేసీఆర్కు ప్రేమ ఉందని తెలపడం.. ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు ప్రతిపక్ష నేతల వలలో పడ్డారని చెప్పడం.. ఈ వ్యవహారమంతా కూడా పక్కా స్క్రిప్ట్.. సేమ్ డైలాగుల్లా కనిపించింది.
అదలావుంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ హవా తప్ప మంత్రుల నిర్ణయాలకు ఛాన్స్ లేదన్నది అందరూ బహిరంగంగా మాట్లాడుకునే విషయమే. అయితే ఆర్టీసీ సమ్మె సందర్భంగా కేసీఆర్ చెప్పినట్లే మంత్రులు మాట్లాడుతున్నారనే వాదనలు లేకపోలేదు.