రామోజీ నుంచి రాధాకృష్ణ దాకా: కెసిఆర్ చేసేది ఇదేనా?
కెసిఆర్ను తీవ్రంగా వ్యతిరేకించినవారు, కెసిఆర్ చేత మాటలు పడ్డవారు ఇప్పుడు ఆయనకు దగ్గరవుతున్నారు. అందులోని ఆంతర్యమేమిటనేది తెలియని విషయమేనా...
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ సమయంలో తీవ్రంగా వ్యతిరేకించినవారు ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు దగ్గరవుతున్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఆంధ్ర ఆధిపత్యంలోని మీడియా పనిచేస్తున్న వైనాన్ని ఉద్యమ సమయంలో కూడా కెసిఆర్ పలుమార్లు ప్రస్తావించారు.
మీడియా మద్దతు కోసమే నమస్తే తెలంగాణ అనే దినపత్రిక పుట్టింది. తొలుత లక్ష్మీరాజం చేతుల్లో ఉన్న నమస్తే తెలంగాణ పూర్తిగా కెసిఆర్ చేతుల్లోకి వచ్చింది. ఆ పత్రిక తెలంగాణ ప్రభుత్వ అవసరాలను తీర్చలేకపోతోందా, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రయోజనాలను కాపాడలేకపోతోందా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
ఇటీవల తెలంగాణ మంత్రి, కెసిఆర్ తనయుడు నమస్తే తెలంగాణ కార్యాలయ సిబ్బందితో సమావేశమై దుమ్ము దులిపినట్లు వార్తలు వచ్చాయి. అయినా దాని గతి మారలేదా అనే ప్రశ్న ఉదయిస్తోంది. అందుకే, ఆయన మీడియాలో దిగ్గజమైన రామోజీ రావును దరి చేర్చుకున్నారా, వేమూరి రాధాకృష్ణను దూరం చేసుకోవడానికి సిద్ధంగా లేరా అనే ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి.
రామోజీ రావు ఇలా...
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, కెసిఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈనాడు అధిపతి రామోజీ రావు సచివాలయంలో అడుగు పెట్టారు. రామోజీ రావు స్వయంగా వెళ్లి అలా కలవడం అప్పట్లో అందరికీ వింతగానే తోచింది. తొలిసారి ఆయన ఓ ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి కలుసుకోవడం వల్ల కలిగిన ఆశ్చర్యం అది. రామోజీ రావు అడిగిందే తడవుగా ఆధ్యాత్మిక నగరానికి కెసిఆర్ భూమి కేటాయించడానికి సిద్దపడ్డారు. ఇటీవల మరికొంత భూమిని కూడా రామోజీ రావుకు కేటాయించారు. దీనిపై తెలంగాణలోని పలువురు కెసిఆర్పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
రాధాకృష్ణ దగ్గరయ్యారు....
మొదట్లో కెసిఆర్పై యుద్ధం ప్రకటించినట్లు అనిపించిన ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ క్రమంగా కెసిఆర్కు దగ్గరయ్యారు. ఆయన పత్రికా కార్యాలయానికి హైదరాబాదులో కెసిఆర్ స్థలం కూడా కేటాయించారు. దగ్ధమైన ఆంధ్రజ్యోతి కార్యాలయాన్ని కెసిఆర్ మంగళవారంనాడు సందర్శించి తెలంగాణకు చెందిన చాలా మందిని ఆశ్చర్యపరిచారు. తన రాష్ట్రంలో జరిగిన సంఘటనకు ముఖ్యమంత్రిగా కెసిఆర్ ప్రతిస్పందించడం తప్పేమీ కాదు. ఫోన్లో ఆరా తీసిన తర్వాత స్వయంగా వచ్చి సందర్శించాల్సిన అవసరం ఉందా అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఆంధ్రజ్యోతి తనకు వ్యతిరేకంగా ఉండకూడదనే ముందుచూపుతో ఆయన ఆ కార్యక్రమం పెట్టుకున్నారా అనేది కూడా ఓ ప్రశ్న.
చంద్రబాబు అలా వెళ్లారు...
నిజానికి, హైదరాబాదును ఆంధ్రప్రదేశ్ రాజధానిగా పదేళ్ల పాటు వాడుకోవడానికి వీలుంది. చంద్రబాబు ఆఘమేఘాల మీద అమరావతిని నిర్మించుకుని తరలిపోవాల్సిన అవసరం కూడా లేదు. మొదట్లో చంద్రబాబు సాధ్యమైనంత ఎక్కువ కాలం ఇక్కడే ఉండిపోతారనే భావన ఉండేది. కానీ, తన మకాంను ఆయన చాలా త్వరగా విజయవాడకు మార్చేసుకున్నారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కోవడం వల్లనే చంద్రబాబు విజయవాడకు తరలిపోయారని ప్రతిపక్షాలు అనవచ్చు. కానీ, కెసిఆర్తో తగువులు పెట్టుకోవడం సరి కాదనే స్థితికి చంద్రబాబు వచ్చారు. అందుకే ఆయన తరలిపోయినట్లు చెప్పవచ్చు.
ఉమ్మడి రాజధాని పేరుతో....
హైదరాబాదు ఉమ్మడి రాజధాని అంటూ చంద్రబాబు కెసిఆర్పై కారాలు మిరియాలు నూరుతూ వచ్చారు. హైదరాబాదులోని శాంతిభద్రతలను గవర్నర్ చేతికి ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. కెసిఆర్ను మొదట్లో చంద్రబాబు కాస్తా చిన్నచూపు చూసినట్లు కూడా అనిపించింది. తనకు సమాన గౌరవం ఇవ్వడం లేదని కెసిఆర్ చంద్రబాబుపై అప్పట్లో బహిరంగంగానే వ్యాఖ్యానించారు. పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రిగా తనకు చంద్రబాబు గౌరవం ఇవ్వడం లేదనేది ఆయన ఆక్షేపణగా అప్పట్లో కనిపించింది. క్రమంగా ఇరువురి మధ్య విభేదాలు తగ్గిపోయి, సామరస్యపూర్వక వాతావరణం ఏర్పడింది.
పవన్ కల్యాణ్ కూడా..
అప్పట్లో కెసిఆర్పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశారు. తెలుగుదేశం, బిజెపిలకు మద్దతు ప్రకటించిన పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార సభల్లో కెసిఆర్పై దుమ్మెత్తిపోశారు. అయితే, క్రమంగా ఆయన కూడా తగ్గిపోయారు. అంతేకాదు, కెటి రామారావుతో కలిసి ఆయన కాటమరాయుడు సినిమా చూశారు. దాంతో పవన్ కల్యాణ్ కూడా సయోధ్యకు వచ్చినట్లేనని భావిస్తున్నారు.
నాగార్జున కూడా....
సినీ నటుడు నాగార్జున మొదటి నుంచి కూడా కెసిఆర్తో సామరస్యవూర్వంగానే ఉంటున్నారు. స్థల వివాదం వచ్చినప్పుడు ఆయన కాస్తా ఇబ్బంది పడ్డారు. కానీ ఆ తర్వాత ఆయన నెమ్మదించారు. అంతేకాదు, తనకు కాబోయే కోడలును తెలంగాణలో చేనేత బ్రాండ్ అంబాసిడర్గా చేయడంలో కీలక పాత్ర పోషించారని అంటున్నారు. కెటి రామారావు సమక్షంలో సమంత తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్గా నియమతులయ్యారు.
తొలుత వాదన ఇలా...
కెసిఆర్తో మొదట్లో ఆంధ్రకు చెందిన ప్రముఖులు ఘర్షణ పడడానికి సిద్ధపడినట్లు కనిపించారు. దీంతో హైదరాబాదును వదలడానికి చంద్రబాబు గానీ పవన్ కల్యాణ్ గానీ, ఇతర ప్రముఖులు గానీ సిద్ధంగా లేరనే వాదన ముందుకు వచ్చింది. వారి ఆధిపత్యం తిరిగి హైదరాబాదు మీద స్థాపితం కాకూడదంటే కెసిఆర్ను బేషరతుగా బలపరచాలనే వాదన తెలంగాణ మేధావుల నుంచి రచయితల నుంచి వచ్చింది. ఆ వాదనలో హేతుబద్దత కూడా కనిపించింది. దీంతో తెలంగాణలో కెసిఆర్ పట్ల సానుకూల వాతావరణమే ఉంటూ వచ్చింది.
క్రమంగా పోతుందా...
ఆంధ్ర ఆధిపత్యాన్ని లేకుండా చేయాలనే ఉద్దేశంతోనూ అభివృద్ధి దిశగా నడుస్తుందనే కారణంతోనూ తెలంగాణలో ఇప్పటి వరకు కెసిఆర్కు మద్దతు లభిస్తూ వచ్చింది. కానీ క్రమంగా అది జారిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన చాలా మందిని కెసిఆర్ పట్టించుకోవడం లేదనే వాదన వినిపిస్తోంది. కోదండరామ్ పట్ల తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఇందుకు నిదర్శనంగా చూపుతున్నారు. మొత్తం మీద, గత ప్రభుత్వాలకు, తెలంగాణ ప్రభుత్వానికి తేడా లేదనే అభిప్రాయం తెలంగాణలో పేరుకుపోయే ప్రమాదం పొంచి ఉన్నట్లు కనిపిస్తోంది.
కెసిఆర్ ఏమనుకుంటున్నారో...
తాను చేస్తున్న పనులకు తెలంగాణ ప్రజల నుంచి బేషరతు మద్దతు ఉందని కెసిఆర్ భావిస్తూ ఉండవచ్చు. ప్రజలు తన వైపు ఉంటే చాలు, ఎవరున్నా లేకున్నా ఒక్కటే అని కూడా అనుకోవచ్చు. అదే సమయంలో తాను చేస్తున్న పనులను బేషరతుగా అంగీకరించాలే తప్ప వాటిలో లోపాలున్నాయనే మాట అనుకూడదని ఆయన భావిస్తూ ఉండవచ్చు. పదవులను కట్టబెట్టడంలోనూ, ప్రయోజనాలను కాపాడడంలోనూ క్రమంగా తెలంగాణ అస్తిత్వం రూపు మాసిపోయే వాతావరణం ఉందా అనే ప్రశ్న ఉదయిస్తోంది. అయితే, తన పాలన సాఫీగా సాగాలంటే తనకు వ్యతిరేకంగా ఉంటూ వచ్చిన ఆంధ్ర పెత్తందార్లను, ప్రముఖులను తన వైపు తిప్పుకునే వ్యూహాన్ని ఆయన అనుసరిస్తున్నారా అనేది కూడా తెలియదు. కెసిఆర్ అనుకూలంగా పలువురు ఆంధ్ర ప్రముఖులు, మీడియా పెద్దలు మారడం కెసిఆర్ బలం వల్ల జరుగుతోందా, ఆయన వ్యూహాల వల్ల జరుగుతోందా అనేది కూడా జవాబు దొరకని ప్రశ్నే.