సైకో శీనుగాడిని కస్టడీలోకి తీసుకోవడమే కాదు.. వాన్ని కాపాడటం పోలీసులకు సవాలే..!
భువనగిరి : హాజీపూర్ సీరియల్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి వికృత చేష్టలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపాయి. అమ్మాయిలను టార్గెట్ చేస్తూ హత్యాచారాలకు పాల్పడుతున్న సైకో శీనుగాడి దురాగతాలు అన్నీ ఇన్నీ కావు. శ్రావణి హత్యతో ఆ కిరాతకుడి లీలలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. ఆమె కంటే ముందు మరో ఇద్దరు అమ్మాయిలను చంపడం కలకలం రేపింది. అదలావుంటే వరంగల్ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న శ్రీనివాస్ రెడ్డిని తమ కస్టడీకి అప్పగించాలని రాచకొండ పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. మరింత లోతుగా విచారించేందుకు 5 రోజుల కస్టడీ కావాలని పేర్కొన్నారు. అయితే శ్రీనివాస్ రెడ్డిపై ఆగ్రహంతో ఉన్న ప్రజలు.. వాడు బయటకనిపిస్తే చూస్తూ ఊరుకుంటారా అనేది చర్చానీయాంశంగా మారింది.
ఖబడ్దార్ కేసీఆర్.. మావోయిస్టుల పోస్టర్ల కలకలం.. పరిషత్ ఎన్నికల వేళ టెన్షన్ టెన్షన్
కస్టడీతో దర్యాప్తా.. ముప్పా?
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఉమ్మడి నల్గొండ జిల్లా హాజీపూర్ సీరియల్ కిల్లర్ దురాగతాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. శ్రావణి హత్యోదంతంతో సైకో శీనుగాడి బండారం బయటపడింది. హత్యాచారాలు చేస్తూ తమ మధ్యనే తిరుగుతున్న కూడా గ్రామస్తులు కూడా వాన్ని అనుమానించలేకపోయారు. చివరకు శ్రీనివాస్ రెడ్డి నేరాలు అంగీకరించడంతో అతడి ఇంటిని గ్రామస్తులు తగులబెట్టారు. సదరు సైకో శీనుగాడిపై అంతటి ఆగ్రహావేశాలతో ఉన్న స్థానికులు.. వాడు కనిపిస్తే వదిలిపెట్టబోరనే వాదనలు వినిపిస్తున్నాయి. లిఫ్ట్ పేరుతో ట్రాప్ చేసి అమ్మాయిలను పాశవికంగా హత్యాచారం చేసిన శీనుగాడిని వదిలిపెట్టొద్దని ఇప్పటికే పెద్దఎత్తున డిమాండ్ చేశారు. అలాంటిది ఇప్పుడు కస్టడీ పేరుతో బయటకు తీసుకొస్తే.. వాడి ప్రాణాలకు గ్యారంటీ ఉంటుందా అనేది ప్రశ్నార్థకమే.
దర్యాప్తు లోతుగా.. నిజాలు చెప్పేనా?
వరంగల్ జిల్లా జైలులో రిమాండు ఖైదీగా ఉన్న శ్రీనివాస్ రెడ్డిని తమ కస్టడీకి అప్పగించాలని రాచకొండ పోలీసులు.. నల్గొండ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సైకో గాడి వికృత చేష్టలకు ఇంకెంతమంది బలయ్యారోననే అనుమానాలు వ్యక్తమవుతుండటంతో లోతుగా దర్యాప్తు చేయాలనేది పోలీసుల ప్లాన్. ఆ క్రమంలో పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ ఆదేశాలతో భువనగిరి ఏసీపీ భుజంగరావు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నలమాద గోపాలకృష్ణ ద్వారా పిటిషన్ దాఖలు చేశారు. హాజీపూర్ లో జరిగిన వరుస హత్యల నేపథ్యంలో కలకలం రేగడంతో మరిన్ని ఆధారాలు కావాలంటే నిందితుడిని తాము విచారించాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. నిందితుడిపై ఇతర కేసులు కూడా ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేయాల్సి ఉందనే విషయం విన్నవించారు.
అమ్మాయిల పరిచయాలపై ఆరా..!
ఎవరితో కలిసిపోడు.. ఎప్పుడూ ముభావంగా ఉంటాడు, కానీ హత్యల తర్వాత హుషారుగా కనిపిస్తాడు. ఇదంతా సైకో శీనుగాడి గురించి తెలిసినవారు చెప్పే విషయాలు. ఇలాంటి స్వభావమున్న వారి నుంచి వివరాలు సేకరించడం అంతా ఈజీ కాదంటారు కొందరు. వాడు వంద నేరాలు చేసినా సింగిల్ డిజిట్ నేరాలు ఒప్పుకుంటాడే తప్ప.. పూర్తిస్థాయిలో పూసగుచ్చినట్లు చెప్పలేకపోవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి.
మొత్తానికి పోలీసుల కస్టడీకి అప్పగించే విషయంలో మంగళవారం (07.05.2019) నాడు కోర్టు ఆదేశాలు ఇచ్చే ఛాన్సుంది. ఒకవేళ సైకో శీనుగాడిని తమ కస్టడీకి ఇస్తే.. అతడి ఫేస్బుక్ స్నేహితులు, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లోని అమ్మాయిలతో అతడికున్న పరిచయాలు తదితర విషయాలపై ఆరా తీయనున్నారు. శ్రీనివాస్ రెడ్డి ఫేస్బుక్ పేజీలో 631 మంది స్నేహితులుంటే అందులో దాదాపు 570 మంది (90 శాతం) అమ్మాయిలే కావడం గమనార్హం.
కసికసిగా.. బయటకొస్తే బతికేనా?
నాలుగేళ్ల కిందట అదృశ్యమైన కల్పన అనే 11 సంవత్సరాల బాలిక హత్యోదంతం ఇప్పుడు వెలుగుచూసింది. అది కూడా నేరస్థుడు ఇతర కేసులో పట్టుబడి నేరం ఒప్పుకుంటే తప్ప అసలు విషయం బయటపడలేదు. ఇలాంటి నేపథ్యంలో సైకో శీనుగాడిని అదుపులోకి తీసుకుంటే.. వాడు నిజాలు చెబుతాడనే గ్యారంటీ దేవుడెరుగు. కానీ, వాన్ని దర్యాప్తులో భాగంగా ఘటనాస్థలికి తీసుకెళ్లే క్రమంలో ప్రజలు దాడి చేయకుండా ఉంటారా?.. కనిపిస్తే ఖతం చేయాలనే కసితో రగులుతున్న గ్రామస్థులు వాడ్ని వదిలిపెడతారా?.. కస్టడీ పేరుతో శ్రీనివాస్ రెడ్డిని జైలు నుంచి పోలీసులు బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా.. ప్రజల నుంచి ఏవిధంగా కాపాడుతారో అనేది పెద్ద సవాలే.