ప్రశ్నార్థకంగా జూపల్లి రాజకీయ భవిష్యత్.. మాజీ మంత్రిని సొంతపార్టీ నేతలు తొక్కేస్తున్నారా?
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఆయన తిరుగులేని నాయకుడు, గత ఎన్నికలకు ముందు వరకు మంత్రిగా చలామణి అయిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పై తన మార్కు పాలన కొనసాగించిన జూపల్లి కృష్ణారావు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు . గత ఎన్నికల్లో ఓటమి పాలైన ఆయనకు సొంత పార్టీ నేతలే చుక్కలు చూపిస్తున్నారు. జిల్లాలో ఆయనకున్న పట్టు ఎన్నికల ఓటమితో తగ్గిపోగా, ఇప్పుడు సొంత పార్టీ నేతల తీరుతో జూపల్లి కృష్ణారావు ఉనికి ప్రశ్నార్థకంగా మారింది.
మంత్రిగా ఉన్న సమయంలో సొంత పార్టీ నేతలతో వివాదాలే కారణం
ఇక జిల్లాలో సీనియర్ రాజకీయ నాయకుడిగా అన్నీ తానై వ్యవహరించారు జూపల్లి కృష్ణారావు . మంత్రిగా ఉన్న సమయంలోనే ఆయన సొంతపార్టీలో కొంతమంది సహచర నాయకులతో వివాదాలను కొని తెచ్చుకున్నారు. మంత్రిగా తనకు తిరిగి లేదని భావించిన ఆయన పార్టీలోని కీలక నేతలను కలుపుకొని పోలేదు. ఫలితంగా 2018లో జరిగిన ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలు జూపల్లిని ఓడించి అనూహ్యమైన తీర్పునిచ్చారు. ఇక తాను ఓడిపోయినా, టిఆర్ఎస్ అధికారంలోకి రావడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు జూపల్లి.
గులాబీ బాస్ పై గంపెడు ఆశలు పెట్టుకున్న జూపల్లి .. సొంత పార్టీ నేతల సెగ
గులాబి బాస్ కెసిఆర్ తనకు ఏదో ఒక పదవి ఇస్తారని ఆశగా ఎదురుచూశారు. కానీ కెసిఆర్ కూడా జూపల్లి ని పక్కన పెట్టేశారు. ఇక అంతేనా .. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఇబ్బంది పడిన వారందరూ, ఇప్పుడు జూపల్లికి చుక్కలు చూపిస్తున్నారు. ఇందులో ప్రధానంగా జూపల్లి మీద గెలిచి టీఆర్ఎస్ లో చేరిన కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్దన్ రెడ్డి మరియు మంత్రి నిరంజన్ రెడ్డిలు. ఈ ఇద్దరూ కలిసి కొల్లాపూర్ నియోజకవర్గంలో జూపల్లి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్నారు. ఇక దీంతో ప్రస్తుత మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, జూపల్లి మధ్య నెలకొన్న కోల్డ్ వార్ స్థానికంగా చర్చనీయాంశమైంది.
జూపల్లి శంకుస్థాపనలు చేసిన అభివృద్ధి పనులు ముట్టుకోని మంత్రి నిరంజన్ రెడ్డి
గతంలో మంత్రిగా ఉన్న సమయంలో జూపల్లి ప్రవర్తనపై మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అందుకే ఆయన వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో జూపల్లి మంత్రిగా ఉన్నప్పుడు చేపట్టిన అభివృద్ది పథకాలను, శంఖుస్థాపనలకే పరిమితం చేసినట్టు సమాచారం. జూపల్లి కృష్ణారావు గత ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖా మంత్రిగా ఉన్నప్పుడు, కొత్తకోట మండలంలోని కనిమెట్ట , పాత జంగమాయపల్లి ల మధ్య , అప్పరాల , తిప్పడం పల్లి గ్రామాల నడుమ ఉన్న వాగుపై, వంతెనల కొరకు శంఖు స్థాపనలు చేశారు. ఆ రెండు శంఖుస్థాపనలు కూడా ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు . అందుకు కారణం జూపల్లి శంకుస్థాపన చేసిన వాటిని అభివృద్ధి చేయడం మంత్రి నిరంజన్ రెడ్డి కి ఇష్టం లేదనే చర్చ జరుగుతోంది.
కనిమెట్ట - పాత జంగమాయ పల్లి బ్రిడ్జి నిర్మాణం ఇప్పట్లో లేనట్టేనా ?
జూపల్లి మంత్రిగా ఉన్న సమయంలో కనిమెట్ట - పాత జంగమాయ పల్లి బ్రిడ్జి నిర్మాణం కొరకు, 2017 జులై 12న రెండున్నర కోట్ల రూపాయలు నిధులు విడుదల చేస్తూ శంఖుస్థాపన చేశారు. టెండర్లు పిలిచి కాంట్రాక్టర్ సైతం పనులు ప్రారంభించి పునాదుల కోసం గుంతలు తవ్విన తరువాత, అంచనాలకు మించి ఖర్చు అవుతుందని కాంట్రాక్టర్ తన వల్ల కాదంటూ చేతులెత్తేశాడు. అయితే మళ్లీ అధికారులను పిలిచి నూతన అంచనా ప్రకారం ఆరు కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తే నిర్మాణం పూర్తి అవుతుందని మళ్ళీ ఫైల్ను ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపామని తెలిపారు. అయితే దీనిపై ఇప్పటివరకు ప్రొసీడింగ్ రాలేదు. కొత్త కాంట్రాక్టర్ నియామకం కూడా కాలేదు.
రాజకీయంగా జూపల్లిని తొక్కేసే పనిలో జిల్లా మంత్రి, స్థానిక ఎమ్మెల్యే
జూపల్లి శంకుస్థాపన చేయడమే ఇది ఆగిపోవడానికి ప్రధాన కారణమని సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇక అంతే కాదు ఉమ్మడి జిల్లాలో మంత్రిహోదాలో జూపల్లి కృష్ణారావు ప్రారంభించిన చాలా పనులు ఇప్పటికీ పెండింగ్లోనే ఉన్నాయి. జూపల్లిని రాజకీయంగా తొక్కేసే పనిలో సొంత పార్టీ నేతలు చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది. ఇతర పార్టీల కంటే సొంత పార్టీ నేతలే జూపల్లి ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని నాగర్ కర్నూల్ జిల్లా నేతలు మాట్లాడుకుంటున్నారు.
బీజేపీలో చేరతారని ప్రచారం .. రాజకీయంగా స్వీయ రక్షణలో మాజీ మంత్రి
ఓ పక్క ఎమ్మెల్యే వర్గీయులు జూపల్లి బీజేపిలో చేరతారని సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. దీంతో జూపల్లి తాను ఏ పార్టీలోకీ వెళ్లడం లేదని మీడియా ముందు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. పార్టీ మారతానని పోస్టులు పెట్టిన వారిపై కేసులు పెడతానని జూపల్లి హెచ్చరించిన పరిస్థితి వచ్చింది. రాజకీయంగా తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్న జూపల్లి కృష్ణారావు, సొంత పార్టీ నేతలతో ఎదుర్కొంటున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు.
నామినేటెడ్ పదవి కోసం యత్నం .. ఫలిస్తుందో లేదో !
ఇది ఇలాగే కొనసాగితే జూపల్లి కృష్ణారావు స్థానికంగా బలహీనం కావడం ఖాయమని పార్టీ అంతర్గత వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇక ఏదైనా నామినేటెడ్ పదవి వస్తుందని ప్రయత్నాలు సాగిస్తున్న జూపల్లి కృష్ణారావు నామినేటెడ్ పోస్టు కూడా దక్కించుకోలేక పోతే ఆయన పని గోవిందా అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి మాజీ మంత్రి జూపల్లి రాజకీయ భవిష్యత్ ఏ విధంగా ఉండబోతుందో , సొంత పార్టీ నేతల పోరును ఎలా తట్టుకుని నెగ్గుకొస్తారో మరి వేచి చూడాల్సిందే.