కొత్త రెవెన్యూ చట్టంపై కేసీఆర్ సీరియస్ గా ఉన్నారా .. అసెంబ్లీలో ప్రతిపాదిస్తారా ? ఆసక్తికర చర్చ
రెవెన్యూ శాఖలో కీలక మార్పులు చెయ్యాలని సీఎం కేసీఆర్ చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు .రెవెన్యూ శాఖలో వేళ్ళూనుకున్న అవినీతిని ప్రక్షాళన చెయ్యటం కోసం కొత్త రెవెన్యూ చట్టం తీసుకురావాలని చాలా కాలంగా ఆలోచిస్తున్న సీఎం కేసీఆర్ ఈ సారి అసెంబ్లీ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రతిపాదించబోతున్నారని తెలుస్తుంది.
రెవెన్యూ శాఖ ప్రక్షాళనకు సీఎం కేసీఆర్ అడుగులు
సీఎం కేసీఆర్ రెవెన్యూ శాఖను పూర్తిగా ప్రక్షాళన చెయ్యాలన్న నిర్ణయం మేరకు చాలా కాలంగా అడుగులు పడుతున్నాయి. రెవెన్యూ శాఖలో కీలక మార్పులకు నిర్ణయం తీసుకున్న ఆయన గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థ రద్దు చేసి వీరిని పంచాయతీరాజ్ లేదా వ్యవసాయశాఖలో విలీనం చేయాలని ఆలోచించారు.గతంలో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వస్తుందని భావించినా అది వెనక్కు పోయింది. గత ఏడాదిలో సీఎం కేసీఆర్ దూకుడు రెవెన్యూ వ్యవస్థపై ఉక్కు పాదం మోపుతున్నారనే సంకేతాలనే ఇచ్చింది.
రెవెన్యూ శాఖలో పేరుకుపోయిన అవినీతిపై గతంలో అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ తీవ్ర అసంతృప్తి
రెవెన్యూ శాఖలో పనిచేస్తోన్న కిందిస్థాయి ఉద్యో గుల్లో పేరుకుపోయిన అవినీతి రెవెన్యూ వ్యవస్థకే ప్రమాదమని సీఎం కేసీఆర్ బహిరంగంగానే వ్యాఖ్యానించటం, అందుకు తగ్గట్టు రెవెన్యూ శాఖలో అవినీతి బాహాటంగా పలు సందర్భాల్లో బయటపడటం జరిగింది. గతంలో అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ ముఖ్య కార్యదర్శి మరియు ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ కంటే విఆర్ఓలకు ఎక్కువ అధికారాలు ఉన్నాయని వ్యాఖ్యానించటం కేసీఆర్ కు రెవెన్యూ వ్యవస్థపై ఉన్న అసంతృప్తిని స్పష్టంగా చెప్పింది. రెవెన్యూ శాఖను పునరుద్ధరించకపోతే వ్యవస్థ ముప్పు పొంచి ఉంటుందనే భావన ఆయనకు ఉన్న నేపధ్యంలోనే కేసీఆర్ కొత్త రెవెన్యూ చట్టం రూప కల్పన చేశారు .
రెవెన్యూ చట్టం అసెంబ్లీలో పెడతారనే సంకేతాలు
రెవెన్యూ శాఖలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చే వ్యూహంలో భాగంగా ఇప్పుడు రెవెన్యూ చట్టం అసెంబ్లీలో ప్రవేశపెడతారు అన్న సంకేతాలు వస్తున్నాయి. ఇప్పటికే కొత్త పంచాయతీరాజ్ చట్టం.. కొత్త మున్సిపల్ చట్టం అమల్లోకి వచ్చాయి .కొత్త రెవెన్యూ చట్టం కూడా సిద్ధం అయింది. ముసాయిదా సిద్ధం చేసి అసెంబ్లీలో ప్రవేశపెడతారు అన్న సంకేతాలు వస్తున్నాయి . రెవెన్యూశాఖకు సంబంధించిన పలు విధులను పంచాయతీరాజ్, వ్యవసాయశాఖలకు బదిలీ చేయాలని, రెవెన్యూశాఖ పేరు మార్పిడితో పాటు ఆ శాఖకు గల పలు అధికారాలను ఇతర శాఖలకు బదలాయించాలనే ఆలోచనలో సర్కార్ ఉంది . ప్రస్తుతం రెవిన్యూ అధికారుల అవినీతి పెద్ద ఎత్తున బయట పడుతోంది.
Recommended Video
ఈ అసెంబ్లీ సమావేశాల్లో అయినా రెవెన్యూ చట్టం వస్తుందా?
తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం సమయంలో కూడా సీఎం కేసీఆర్ రెవెన్యూ వ్యవస్థపై దృష్టి పెడతారని అంతా భావించారు . తాజాగా కీసర తహసీల్దార్ వ్యవహారం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది . ప్రజల్లో కూడా రెవెన్యూ శాఖపై అసంతృప్తి ఉంది. రెవెన్యూ అక్రమాలు రాష్ట్రంలో నిత్య కృత్యంగా మారాయి . ఈ సమయంలో ఇప్పటికే కొత్త పంచాయితీ రాజ్ చట్టం , కొత్త మున్సిపల్ చట్టాలను అమలు చేస్తున్న ప్రభుత్వం , కొత్త రెవెన్యూ చట్టాన్ని ఈసారి అసెంబ్లీ సమావేశాలలో ప్రవేశపెట్టాలనే ఆలోచనలో ఉంది. దీనిపై మళ్ళీ రెవెన్యూ చట్టంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.