గుండు సుధారాణిపై కెసిఆర్ లెక్కలు: కొండా సురేఖను పక్కన పెట్టినట్లేనా?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొండా సురేఖను పక్కన పెట్టినట్లేనా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు.. ముఖ్యంగా వైయస్ రాజశేఖర రెడ్డి ఉన్న సమయంలో కొండా సురేఖ చక్రం తిప్పారు.
వైయస్ మృతి, ఆ తర్వాత జగన్ స్థాపించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం, అందులో నుంచి బయటకు రావడం... నేపథ్యంలో, సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆమె టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం టిక్కెట్ను కెసిఆర్ కేటాయించారు. ఇక్కడి నుంచి సురేఖ గెలుపొందారు.
అయితే, టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటికీ కొండా సురేఖకు ఎలాంటి ప్రాధాన్యం కనిపించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆమె మంత్రిగా పని చేశారు. వరంగల్ సీనియర్ రాజకీయ నాయకురాలు.
కెసిఆర్ మంత్రివర్గంలో ఆమెకు చోటు లభిస్తుందని చాలామంది భావించారు. కానీ అది దక్కలేదు. సురేఖ భర్త కొండా మురళీకి కూడా ఎమ్మెల్సీ పదవిని కెసిఆర్ హామీ ఇచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. అది కూడా రాలేదు. ఈ నేపథ్యంలో కెసిఆర్ పైన సురేఖ అలకవహించాలనే వాదనలు వినిపిస్తున్నాయి.
తాజాగా, టిడిపి రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి కారు ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాకు చెందిన మరే సీనియర్ నేత పుల్లా పద్మావతి కూడా టిఆర్ఎస్ పార్టీలో చేరవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. వీరిద్దరు కూడా వరంగల్ తూర్పు నియోజవకర్గానికి చెందినవారే.
పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొండా సురేఖకు అంతగా ప్రాధాన్యం లేకపోవడం, తాజాగా ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గానికి చెందిన నేతలనే పార్టీలో చేర్చుకునేందుకు.. కెసిఆర్ సిద్ధమవడం చూస్తుంటే సురేఖను పక్కన పెట్టినట్లేననే వాదనలు వినిపిస్తున్నాయి.
కాగా, కొండా సురేఖను పార్టీలో చేర్చుకొని, టిక్కెట్ ఇచ్చినప్పటి నుంచి కెసిఆర్ పైన ఆమె విషయమై విమర్శలు వస్తున్నాయి. మహబూబాబాద్ సంఘటనలో తెలంగాణవాదుల పైన రాళ్లు విసిరిన సురేఖను ఎలా చేర్చుకుంటారని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, వరంగల్ ఉప ఎన్నికల నేపథ్యంలో బిసి నేత గుండు సుధారాణి, దళిత నేత పుల్లా పద్మావతి చేరిక ద్వారా ఎన్నికల్లో భారీ మెజార్టీ పైన కెసిఆర్ దృష్టి పెట్టారంటున్నారు.