సాయంత్రం సర్వే ఫలితాలు: లగడపాటి సర్వేను లంగ సర్వేతో పోల్చిన కేసీఆర్?
మక్తల్/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. పలు జాతీయ సర్వేలు తెరాసకు అనుకూలంగా వస్తున్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే ఈ రోజు సాయంత్రం ఓ సర్వే వస్తుందని, అది తెరాసకు వ్యతిరేకంగా వస్తుందని కేసీఆర్ జోస్యం చెప్పారు.
ఆయన మక్తల్ సభలో చంద్రబాబుపై దుమ్మెత్తి పోశారు. కాంగ్రెస్, టీడీపీల పాలనలో కరెంట్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో చెప్పాలన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవాలని చూసిన చంద్రబాబు మనిషి ఇప్పుడు మక్తల్లో పోటీలో నిలబడ్డారని విమర్శించారు. అలాంటి వారిని ఓడించాలని పిలుపునిచ్చారు. హైదరాబాదును ప్రపంచపటంలో పెట్టానని చెప్పే చంద్రబాబు కరెంట్ ఎందుకివ్వలేదని ప్రశ్నించారు.
ఇదే సమయంలో ఆయన సర్వేల అంశాన్ని ప్రస్తావించారు. మక్తల్ సభతో ఫలితాలు తేలిపోయాయని, తెరాసనే గెలుస్తుందని, కానీ సాధారణ గెలుపు తనకు సంతృప్తిని ఇవ్వదని, ప్రతిపక్షాలు తిరిగి రాకుండా ఉండేలా ఓడించాలని పిలుపునిచ్చారు. 98 నుంచి 108 సీట్ల మధ్య తెరాస గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ... మన ప్రభుత్వమే వస్తుందని, ఎవరూ ఆపేది లేదని, కానీ చంద్రబాబు చమత్కారాలు మనకందరికీ తెలిసిందేనని, ఈ రోజు ఓ డూప్లికేట్ సర్వే వస్తుందని, ఈ రోజు సాయంత్రం ఆ సర్వే వస్తుందని, తెలంగాణ ప్రజలను గోల్మాల్ చేయాలని, తెరాసకు ఎక్కువ సీట్లు రావని చెబుతారని, అదంతా లంగ సర్వే, బూటకపు సర్వే అన్నారు. దానిని ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు.
అలాంటి గోల్మాల్, గజగకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యలు చేసి డబ్బు సంచులు తెచ్చి పంచుతున్నారని ఆరోపించారు. కాగా, ఈ రోజు సాయంత్రం ఏడు గంటలకు విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సంస్థ చేసిన సర్వే ఫలితాలు వస్తాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ఈ రోజు సాయంత్రం బూటకపు, లంగ సర్వేలు వస్తాయని చెప్పడం గమనార్హం.