కెసిఆర్ డబుల్ ప్లాన్: శాఖల్లో మార్పులు అందుకేనా, నెంబర్ 2 కెటిఆర్?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం నాడు ఐదుగురు మంత్రుల శాఖలను మార్చారు. ఈ మార్పుల ద్వారా కెసిఆర్ హెచ్చరికలు చేయడంతో పాటు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
పనులు చేయని మంత్రులకు ఉద్వాసన పలుకుతాననే హెచ్చరికలతో పాటు తన తనయుడు, మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు... క్రమంగా పార్టీలో, ప్రభుత్వంలో ప్రాధాన్యత పెంచుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. పరోక్షంగా పార్టీలో, ప్రభుత్వంలో నెంబర్ టూ కెటిఆర్ అని చెప్పినట్లుగా భావించవచ్చునని అంటున్నారు.
తలసానిపై అసంతృప్తా?
తాజా మార్పులతో కెసిఆర్ పలు అంశాలను పరోక్షంగా వెల్లడించారని అర్థమవుతోందని అంటున్నారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, జూపల్లి కృష్ణా రావుల పైన కెసిఆర్ అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోందని అంటున్నారు.
వాణిజ్య శాఖ మంత్రిగా ఉన్న తలసాని సమీక్షలు నిర్వహించడం లేదని, రాష్ట్రంలో పర్యటించడం లేదనే అసంతృప్తి కెసిఆర్లో ఉందని, అందుకే వాణిజ్య పన్నుల శాఖను తాను తీసుకొని ఉంటారని చెబుతున్నారు. సర్వేల ఆధారంగా కెసిఆర్ శాఖలు మార్చినట్లుగా తెలుస్తోంది.
మంత్రి తలసాని వాణిజ్య పన్నుల శాఖ విషయంలో ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారని అంటున్నారు. ఇది కూడా తప్పించడానికి కారణమని భావిస్తున్నారు. మంత్రి జూపల్లి కృష్ణా రావు కూడా టీఐ పాస్ విషయంలో వేగంగా పని చేయడం లేదని కెసిఆర్ భావిస్తున్నారని, అందుకే దాని నుంచి తప్పించి మరో శాఖ ఇచ్చారని భావిస్తున్నారు.
కెటిఆర్ నెంబర్ టూ
శాఖల మార్పులో కెటిఆర్కు కీలక శాఖలు అప్పగించారు. ప్రభుత్వానికి భారీగా రాబడి ఉన్న, హైదరాబాద్ లేదా రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన పరిశ్రమల శాఖను కూడా అప్పగించారు. హరీష్ రావు వద్దని చెప్పిన శాఖను కూడా కెటిఆర్కు అప్పగించారు. తద్వారా పార్టీలో, ప్రభుత్వంలో కెటిఆర్ నెంబర్ టూ అని కెసిఆర్ చెప్పకనే చెప్పారని అంటున్నారు.
హరీష్ రావు పక్కకేనా
మంత్రి హరీష్ రావును క్రమంగా పక్కకు తప్పిస్తున్నారా? అనే చర్చ కూడా సాగుతోంది. మైనింగ్ శాఖను ఆయనే వద్దన్నారా లేక తీసుకున్నారా అనే చర్చ కూడా సాగుతోంది. కెసిఆర్ తర్వాత కీలక శాఖలన్నీ కెటిఆర్కు అప్పగించడం గమనార్హం. దీంతో కెటిఆర్ నెంబర్ టూ అని చెప్పారని అంటున్నారు.
మరికొన్ని శాఖల మార్పులకు అవకాశం
వచ్చే జూన్ నాటికి కెసిఆర్ పాలన రెండేళ్లు పూర్తవుతుంది. అప్పటికి మరికొన్ని శాఖల మార్పులు ఉండే అవకాశం ఉందని అంటున్నారు.
హెచ్చరికలు
మంత్రులు సరిగా పని చేయకుంటే దేనికైనా సిద్దమని ముఖ్యమంత్రి కెసిఆర్.. మంత్రుల తలసాని, జూపల్లిల ద్వారా హెచ్చరించారనే వాదనలు వినిపిస్తున్నాయి.
జూన్ నాటికి మంత్రివర్గ విస్తరణ ఉండేనా?
తెలంగాణలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ఉంటుందని చాలామంది భావించారు. కానీ మార్పులతో సరిపెట్టారు. మరికొన్ని మార్పులు జరిగే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు. అదే సమయంలో రెండేళ్ల పాలన నేపథ్యంలో కొద్ది రోజుల తర్వాత కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో కొందరు మంత్రులను తొలగించి మరికొందరిని తీసుకునే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. అప్పుడు మహిళలకు అవకాశాలు రావొచ్చంటున్నారు. మొత్తానికి కెసిఆర్.. మంత్రులకు హెచ్చరికలతో పాటు కెటిఆర్ నెంబర్ టూ అని చెప్పాడని భావిస్తున్నారు.