బాజిరెడ్డికి కరోనా.. అదే కారణమా.. స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ హైదరాబాద్కు..
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్కు కరోనా పాజిటివ్గా తేలిన సంగతి తెలిసిందే. బాజిరెడ్డితో పాటు మరో ఎమ్మెల్యే ఇటీవల జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని కలిసినట్టు టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్లో జరిగిన ఓ సమీక్షా సమావేశంలో వీరు కలిశారని తెలుస్తోంది. దీంతో ముత్తిరెడ్డిని కలవడం వల్లే బాజిరెడ్డికి వైరస్ సోకిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆ మరో ఎమ్మెల్యే ఎవరన్నది తెలియరాలేదు.
తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా.. ఏపీలో వైసీపీ ఎమ్మెల్యే గన్మెన్ మృతి..
శనివారం అస్వస్థతకు గురైన ఎమ్మెల్యే
శనివారం(జూన్ 13) బాజిరెడ్డి తన సతీమణితో కలిసి హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్లారు. అదే రోజు ఆయన డిచ్పల్లి మండలం బీబీపూర్ తండా వద్ద నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. స్థానిక లబ్దిదారులకు ఇళ్లను అందజేశారు. అనంతరం మరికొన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. అయితే కాస్త అస్వస్థతకు లోను కావడంతో కరోనా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యుల శాంపిల్స్ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సేకరించారు.
స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ..
ఆదివారం శాంపిల్స్ రిపోర్ట్స్ రాగా.. బాజిరెడ్డికి కరోనా పాజిటివ్గా తేలింది. ఆయన భార్య వినోద, కుమారుడు, ధర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్లకు నెగెటివ్ వచ్చింది. దీంతో వెంటనే ఎమ్మెల్యే స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ హైదరాబాద్కు బయలుదేరారు. నగరానికి చేరుకున్న తర్వాత యశోద ఆస్పత్రిలో ఆయన చేరినట్టు కుమారుడు జగన్ వెల్లడించారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కూడా యశోద ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.
వారిలో ఆందోళన..
శనివారం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ తర్వాత బాజిరెడ్డి తన నివాసంలోనే జరిగిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా పలువురు ఇతర పార్టీలకు చెందిన స్థానిక నాయకులు టీఆర్ఎస్లో చేరారు. వారికి బాజిరెడ్డి స్వయంగా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రస్తుతం ఆయన కరోనా బారిన పడటంతో.. ఆయనతో కండువాలు కప్పించుకున్నవారు,ఆ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఆందోళనకు గురవతున్నారు. ఆయనతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ వీజీ గౌడ్,ఆర్డీవో వెంకటయ్య హోమ్ క్వారెంటైన్లోకి వెళ్లారు.
Recommended Video
హోమ్ క్వారెంటైన్లోకి వెళ్లాలని ఆదేశాలు..
ఎమ్మెల్యేకు పాజిటివ్గా తేలిన నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు,వ్యక్తిగత సహాయకులు,గన్మెన్లు హోమ్ క్వారెంటైన్లోకి వెళ్లాలని నిజామాబాద్ జిల్లా అధికారులు సూచించారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి కరోనా పాజిటివ్గా తేలిన తర్వాత.. ఆయన సతీమణి,గన్మెన్,డ్రైవర్,వంట మనిషికి కూడా పాజిటివ్గా తేలిన సంగతి తెలిసిందే. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న తరుణంలో ఎమ్మెల్యేలు కూడా వైరస్ బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది.