నందమూరి సుహాసినిపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు: జూ.ఎన్టీఆర్కు చంద్రబాబు చెక్ ఎలా?
హైదరాబాద్: సీమాంధ్రులు ఎక్కువగా ఉన్న కూకట్పల్లి, శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి (ఆపద్ధర్మ) కేటీఆర్ ఆసక్తిర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆక్కడ ఆయన ఏపీతో పాటు నందమూరి సెంటిమెంటును ఉపయోగిస్తున్నట్లుగా కనిపిస్తోంది.
కొద్ది రోజుల క్రితం ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు ఓ విధంగా అనుకూలంగా కామెంట్స్ చేసిన కేటీఆర్ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో అదే టీడీపీ అధినేతపై విమర్శల కోసం కూకట్పల్లి టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసినితో పాటు ఆమె సోదరులు (జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్)లపై షాకింగ్ కామెంట్స్ చేశారు.
కేటీఆర్ నాడు అలా
మహాకూటమి సీట్ల సర్దుబాటు కాకముందు నుంచే తెరాస నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా దాదాపు నెల రోజుల క్రితం కేటీఆర్ నిజాంపేటలో సీమాంధ్రులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై ప్రశంసలు గుప్పించారు. అంతేకాదు, ఏపీకి వ్యతిరేకంగా ఆయన రాశారని చెబుతున్న లేఖలపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక్కడి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా చంద్రబాబు 30 లేఖలు రాశారని, వాటిని అడ్డుకునే ప్రయత్నం చేశారని తెరాస నేతలు ప్రచారంలో ప్రతి నిత్యం విమర్శలు గుప్పిస్తున్నారు.
చంద్రబాబుపై ప్రశంసలు
అయితే కేటీఆర్ మాత్రం ఆనాడు నిజాంపేట మీటింగ్లో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు అలా లేఖలు రాయటం అటువైపు నుంచి ఆలోచిస్తే సరైనదే కావొచ్చునని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లో ఐటీ అభివృద్ధి ఆయన వల్లే సాధ్యమైందని, సైబరాబాద్ను ఆయనే నిర్మించారని కూడా గతంలోను చెప్పారు. తాజాగా, గురువారం ప్రచార సభలో అదే చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
కేటీఆర్ లేవనెత్తిన ప్రశ్నలు
కూకట్పల్లి టీడీపీ ఓడిపోయే సీటు అని కేటీఆర్ అన్నారు. అందుకే నందమూరి కుటుంబ సభ్యురాలు అయిన సుహాసినిని బలిపశువుగా చేశారని, ఆమెకు రాజకీయాలు తెలియవని చెప్పారు. సుహాసిని ద్వారా రేపు ఆమె సోదరులు జూ.ఎన్టీఆర్ వంటి వారు రాజకీయాల్లోకి రాకుండా చేసేందుకు చంద్రబాబులు పావులు కదుపుతున్నారని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో టీడీపీ ఉండాలనుకుంటే సుహాసిని బదులు మంత్రి నారా లోకేష్ను పోటీ చేయించవచ్చు కదా, అదే సమయంలో నందమూరి కుటుంబంపై అభిమానం ఉంటే ఏపీలో తన కొడుకుకు నేరుగా మంత్రి పదవి ఇచ్చినట్లు సుహాసినికి ఇవ్వవచ్చు కదా అని ప్రశ్నించారు.
సైబారాబాద్ అంశం తీయకుండా కేటీఆర్ విమర్శలు
సీమాంధ్ర ఓటర్లు ఉన్నచోట టీఆర్ఎస్ నేతలు ఆచితూచి మాట్లాడుతున్నారని అంటున్నారు. అదే సమయంలో చంద్రబాబు పాలనకు తమ పాలనకు పోలిక చూపించే ప్రయత్నాలు చేస్తూనే, ఈ నాలుగున్నరేళ్లలో ఇక్కడి సీమాంధ్రలపై ఎలాంటి వివక్ష చూపలేదని చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రచారం ప్రారంభంలో చంద్రబాబును ప్రశంసించిన కేటీఆర్.. ఆ తర్వాత తాజాగా ఆయనపై సైబరాబాద్ అంశం తీయకుండా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
కేటీఆర్ ప్రశ్నలకు చంద్రబాబు వద్ద సమాధానం ఉందా?
గురువారం ప్రచారంలో కేటీఆర్ చేసిన ప్రచారంపై జోరుగా చర్చ సాగుతోంది. ఆయన వ్యాఖ్యలు చంద్రబాబు వైఖరికి నిదర్శనం అని కొందరు అంటే, అలాంటి వ్యాఖ్యలు సరికాదని మరికొందరు అంటున్నారు. జూ.ఎన్టీఆర్ను రాజకీయాల్లోకి రాకుండా ఆపేందుకు ఇక్కడ సుహాసినిని రంగంలోకి దింపారని చెప్పడంలో అర్థం లేదని అంటున్నారు. అదే సమయంలో చంద్రబాబు అవసరం వచ్చినప్పుడు నందమూరి కుటుంబాన్ని ఉపయోగించుకుంటారని మరోసారి తేటతెల్లమైందని మరికొందరు అంటున్నారు. తెలంగాణలో టీడీపీని సజీవంగా ఉంచాలనుకుంటే సుహాసినికి బదులు లోకేష్తో పోటీ చేయించవచ్చనని ప్రశ్నించిన కేటీఆర్ వ్యాఖ్యల్లో వాస్తవం ఉందని చెప్పారు. అధికారంలో ఉన్న ఏపీలో నేరుగా మంత్రిని లోకేష్ చేశారని, నందమూరి కుటుంబంపై అంత ప్రేమ ఉంటే సుహాసిని నేరుగా మంత్రి చేయవచ్చు కదా అన్న కేటీఆర్ వ్యాఖ్యలకు చంద్రబాబు వద్ద సమాధానం లేదని అంటున్నారు. ఒక విధంగా కూకట్పల్లి నుంచి మరోసారి నందమూరి ఫ్యామిలీ మెంబర్ను దింపడం ద్వారా అవసరానికి చంద్రబాబు ఆ పేరును వాడుకుంటారని తేటతెల్లమైందని కేటీఆర్ చెప్పకనే చెప్పారని అంటున్నారు.
జూ.ఎన్టీఆర్కు ఎలా చెక్ చెబుతారు?
కూకట్పల్లి నుంచి సుహాసినిని బరిలోకి దింపుతున్నారని తెలిసిన మొదట్లోనే చర్చ సాగింది. సుహాసినికి టిక్కెట్ ఇవ్వడం ద్వారా నందమూరి కుటుంబానికి రాజకీయంగా సపోర్ట్ చేస్తున్నాననే అభిప్రాయం ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు జూ.ఎన్టీఆర్ సహా.. హరికృష్ణ కుటుంబాన్ని తెలంగాణకు పరిమితం చేసి ఏపీలో లోకేష్కు పోటీ లేకుండా చేయడమే టీడీపీ అధినేత ఉద్దేశ్యం కావొచ్చునని ప్రారంభంలో చర్చ సాగింది. అంతగా ప్రేమ ఉంటే తాను అధికారంలో ఉన్న ఏపీ నుంచి పోటీ చేయించడమో అక్కడ పదవులు ఇవ్వడమో చేయకుండా పార్టీ దాదాపు కనుమరుగైన తెలంగాణలో పోటీ చేయించడం ఏమిటనే చర్చ ఆనాడే సాగింది.