నిజామాబాద్ కాంగ్రెస్ లో అయోమయం..? ఉత్కంఠ రేపుతున్న ఆ స్థానాలు..!!
హైదరాబాద్: అదికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్తులను ప్రకటించడమే కాకుండా ప్రచారంలో జెట్టు స్పీడు వేగంతో దూసుకుపోతుంటే కాంగ్రెస్ పార్టీలో సీట్ల పంపకాల ప్రక్రియ మాత్రం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ప్రత్యేకంగా నిజామాబాద్ జిల్లాలో తారా స్థాయిలో ఉత్కంఠ నెలకొంది. జిల్లాలో ఎవరిని అభ్యర్థులుగా ప్రకటించక పోయినప్పటికి ఆశావహులు క్షేత్ర స్థాయిలో తమపని తాము కానిస్తున్నారు. రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసుకుంటున్నారు. ఐతే అదిష్టానం ఎవరికి సీటు కట్టబెడుతుందో అన్న అశంపై మాత్రం సనర్వత్రా నరాలు తెగిపోయే ఆసక్తి నెలకొంది.
నిజామాబాద్ కాంగ్రెస్ లో సిట్టింగ్లకే టిక్కెట్లనే ప్రచారం..! ఆశావహుల్లో ఉత్కంఠ..?
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ప్రధాన రాజకీయ పక్షాలన్నీ అభ్యర్థుల ఎంపికపై దృష్టిని కేంద్రీకరించాయి. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో సిట్టింగ్లకే టిక్కెట్లను ఖరారు చేసింది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో మాత్రం అభ్యర్థిత్వాల విషయంలో ఎడతెగని ఉత్కంఠ నెలకొంది. మొత్తం తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలలో మూడు స్థానాలు మినహా, మరో ఆరు చోట్ల ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఆ మూడు స్థానాల విషయంలోనూ అధికారికంగా ప్రకటనేదీ వెలువడలేదు. అయితే తమకే టిక్కెట్లు ఖరారవుతాయనే ధీమాతో ఆశావహులు ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టడం విశేషం.
మూడూ స్థానాల్లో ప్రచారం ప్రారంభించిన నేతలు..! మిగతాచోట్ల అమోమయం..!
బోధన్లో మాజీ మంత్రి సుదర్శన్రెడ్డి, ఆర్మూర్లో ఎమ్మెల్సీ ఆకుల లలిత, కామారెడ్డిలో మండలి విపక్ష నేత మహ్మద్ షబ్బీర్అలీలు ఇప్పటికే ప్రచార పర్వంలో మునిగిపోయారు. మిగతా సెగ్మెంట్లలో అభ్యర్థిత్వాల కోసం పోటీ నెలకొనడంతో ఎవరికివారు తమవంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని సమాచారం. వీరిలో ఎందరి ప్రయత్నాలు ఫలిస్తాయి? ఎవరి వైపు అధిష్టానం మొగ్గు చూపిస్తుందన్నది ఇంకా తేలడం లేదు. ఈసారి కాంగ్రెస్ కూటమితో జతకట్టడం ఆ పార్టీ ఆశావహులను మరింత ఉత్కంఠతకు గురిచేస్తోంది. కూటమిలో భాగం పంచుకున్న తెలుగుదేశం పార్టీకి బాల్కొండ సెగ్మెంట్ కేటాయించాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది, అలాగే ఇక్కడి నుండి గతంలో ప్రాతినిథ్యం వహించిన ప్రభుత్వ మాజీ విప్ ఈరవత్రి అనిల్ ఎన్నికల బరిలో దిగేందుకు ప్రచార రథాన్ని సైతం సిద్ధం చేసుకున్నారు.
తలనొప్పిగా మారిన సీట్ల పర్దుబాటు..! మరింత ఆలస్యం అయ్యే ఛాన్స్..!!
మరోవైపు తెలుగుదేశం పార్టీ బాల్కొండతో పాటు మరో స్థానాన్ని సైతం ఆశిస్తోందని సమాచారం. నిజామాబాద్ రూరల్, బాన్సువాడ, బోధన్ సెగ్మెంట్లలో ఏదైనా స్థానాన్ని కేటాయించాలని తెలుగు తమ్ముళ్లు కోరుతున్నారట. అంతేకాకుండా కూటమిలోని మరో మిత్రపక్షంగా ఉన్న కోదండరాం నేతృత్వంలో టీజేఎస్ కూడా నిజామాబాద్ అర్బన్, రూరల్ స్థానాలు కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమకు అభ్యర్థిత్వాలు దక్కుతాయో లేదోనని కాంగ్రెస్ ఆశావహులు ఆందోళన చెందుతున్నారట. నిజామాబాద్ అర్బన్ నుండి మహేష్కుమార్గౌడ్, రత్నాకర్, తాహెర్బిన్ హందాన్, కేశవేణులు టిక్కెట్ రేసులో పోటీ పడుతున్నారు. మరోవైపు త్వరలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్న డీఎస్ కూడా తన అనుయాయులను అధిష్టానానికి టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేయనున్నారనే ప్రచారం సాగుతోంది.
తారా స్థాయిలో గ్రూపులు..! సీటు ఎవరికో తెలియని పరిస్థితులు..!!
మరోవైపు తెరాస అసమ్మతి నేతగా ముద్రపడిన ఎమ్మెల్సీ భూపతిరెడ్డి ఇటీవలే కాంగ్రెస్లో చేరారు. దీంతో రూరల్ టిక్కెట్ దాదాపుగా ఆయనకు ఖరారైనట్టు నేతలు చెబుతున్నారు. అదేవిధంగా జుక్కల్ నియోజకవర్గం నుండి మాజీ ఎమ్మెల్యేలు సౌదాగర్ గంగారాం, అరుణతాలు, బాన్సువాడ నుండి కాసుల బాల్రాజ్, మల్యాద్రిరెడ్డి, ఎల్లారెడ్డి నుండి నల్లమడుగు సురేందర్, జమునా రాథోడ్, వడ్డెపల్లి సుభాష్రెడ్డిలు పోటీ పడుతున్నారని తెలుస్తోంది. తాజాగా షబ్బీర్అలీ ప్రోత్సాహంతో ఇక్కడి నుండి పోటీచేసేందుకు మదన్మోహన్రావు ఆసక్తి కనబరుస్తున్నారని సమాచారం. మరి ఇంతమంది ఆశావహులున్నప్పుడు కాంగ్రెస్ ఎవరివైపు మొగ్గుచూపుతుందో చూడాలి.