సీఎం కేసీఆర్ మాటలకు అర్థాలే వేరు: ఆశా వర్కర్లకు వేతనం కాదు పారితోషికమే
సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇచ్చే హామీలు, అమలు చేసే నిర్ణయాలకు పొంతన లేకుండా పోతున్నది.
హైదరాబాద్: సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇచ్చే హామీలు, అమలు చేసే నిర్ణయాలకు పొంతన లేకుండా పోతున్నది. గత జూన్ నెలలో సీఎం క్యాంప్ కార్యాలయ భవన్ 'ప్రగతి భవన్' వేదికగా ఆశా వర్కర్లతో జరిగిన సమావేశంలో ప్రతి ఒక్క ఆశా వర్కర్ నెలసరి వేతనం రూ.6000 ఉండేలా చేస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. అయితే ఈ నెల తొమ్మిదో తేదీన జారీచేసిన ఉత్తర్వుల్లో మాత్రం పారితోషికాలు చెల్లిస్తామని పేర్కొన్నారు.
జీవో వల్ల తలెత్తిన గందరగోళంతో ఆశా వర్కర్లల్లో నిరాశ నిస్పృహలు నెలకొన్నాయి. సాక్ష్యాత్ సీఎం కేసీఆర్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉత్తర్వులు వెలువడటంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేతనమైతే ప్రతి నెలా వస్తుంది. అదే పారితోషికమైతే అలా కాక చేసిన పనిని బట్టి కొంత పెంచి చెల్లిస్తారు.
దీన్ని ఆశా వర్లర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సీఎం చెప్పినట్టే వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. పారితోషికం ఇస్తే పాత కష్టాలు తప్పవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ జీవో వల్ల తమకు రూ.1000, రూ.2000కు మించి రాదని చెబుతున్నారు. పనికి కొంత కాకుండా.. నెలకు రూ.6 వేల చొప్పున జీతం ఇవ్వాలని కోరుతున్నారు.
రూ.1000 నుంచి రూ.4000
రాష్ట్రంలో 27,045 మంది ఆశా వర్కర్లు పని చేస్తున్నారు. సాధారణంగా ప్రతి శాఖలో ప్రభుత్వం కార్మికులకు కనీస వేతనం చెల్లించకున్నాఎంతో కొంత నెలనెల ఇస్తున్నది. కానీ ఆశావర్కర్లకు అలాంటి పరిస్థితి లేదు. చేసే పనులను బట్టి పారితోషికం అందుతుంది. గర్భిణీలను గుర్తిస్తే రూ.40, ప్రభుత్వాస్పపత్రుల్లో ప్రసవాలు చేయిస్తే రూ.200, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకుంటే రూ.150 ఇలా పారితోషికాలు చెల్లిస్తున్నది. ఒక వేళ సదరు రోగి ఏదైనా ప్రయివేట్ ఆస్పత్రిలో ప్రసవిస్తే ఆ వచ్చే నగదు కూడా రాదు.
కెసిఆర్ ఇలా చేశారు..
ఈ లెక్కన వారికి పనిని కొందరికి నెలకు మూడు నాలుగు వేలు అందుతుండగా, మరికొందరికి రూ.1000, రూ.2000 మాత్రమే వస్తున్నాయి. దీంతో జీతాలు పెంచాలని, నెలకు ఇంత అని కచ్చితంగా వచ్చేలా చూడాలని ఏడాదిన్నర క్రితం 106 రోజులపాటు సమ్మె చేశారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ గత జూన్ నెలలో ప్రగతిభవన్లో ఆశా వర్కర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నెలకు రూ.6 వేల వేతనం వచ్చేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అయితే, 9న జారీ చేసిన ఉత్తర్వులు ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉండటం విశేషం.
రూ.8000 వేతనం వస్తుందని అధికారుల దాటవేత
ఆశా వర్కర్ల పారితోషికం పెంచేందుకు తాజా ఉత్తర్వుల ప్రకారం ఆయా సేవలకు కొంత చొప్పున పెంచారు. దీని ప్రకారం నెలకు రూ.8 వేలకుపైగా వేతనం వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈ విధంగా చెల్లిస్తే చాలా మందికి అన్యాయం జరుగుతుందని ఆశా వర్కర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో కాన్పులు ఎక్కువగా జరుగుతాయి. మరికొన్ని ప్రాంతాల్లో తక్కువగా ఉంటాయి. ఆయా ప్రాంతాల్లో నెలకొన్న అక్షరాస్యతను బట్టి ఆశా వర్కర్లకు పని ఎక్కువగా, తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం నెలకు రూ.5 వేలకుపైగా జీతం వస్తుందని అధికారులు చెబుతున్నప్పటికీ, చాలామందికి రూ.3,000 దాటడం లేదు. ఇప్పుడు సేవల వారీగా పెంపు వల్ల నికరంగా ఇంత వస్తుందన్న నమ్మకం కలగడంలేదు. ఒక్కో ప్రాంతంలో పనిచేసే వారికి ఒక్కో విధంగా వేతనం అందనుంది. ప్రతినెలా అంతే వస్తుందన్న నమ్మకమూ ఉండదు.
స్పష్టత ఇవ్వాలని కోరుతున్న ఆశా వర్కర్లు
గ్రామీణ స్థాయిలో అమలు చేసే ఆరోగ్య సేవలకు.. ఆశా కార్యకర్తలకు అవినాభావ సంబంధం ఉంది. ప్రతి ఆరోగ్య కార్యక్రమం వీరి ద్వారానే ఆరంభమవుతుంది. ప్రధానంగా మూడు రకాల సేవలు అందిస్తున్నారు. ఇందులో మొదటిది మాతాశిశు సంరక్షణ సేవలు, అర్హులైన దంపతులను గుర్తించడం, వారి వివరాలు సేకరించడం, కుటుంబ నియంత్రణ (తాత్కాలిక) పద్ధతులను తెలియజేయడం, గర్బిణులను గుర్తించి రిజిస్ట్రేషన్ చేయించడం, వారికి సేవలు అందించడం, వైద్యులతో పరీక్షింపజేయడం, ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాన్పులు జరిగేలా చూడటం, శిశువులకు సామూహిక టీకాలు ఇప్పించడం, తల్లీబిడ్డల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తారు.
ఇక రెండో సేవల్లో భాగంగా టీబీ, కుష్టు, మలేరియా తదితర వ్యాధిగ్రస్తులను గుర్తించి పీహెచ్సీకి తీసుకెళ్లి చికిత్సలు చేయించడం, వారు క్రమం తప్పకుండా మందులు వాడేలా చూస్తారు. దీంతోపాటు వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు తెలియజేస్తారు. ఇక మూడో విధుల్లో భాగంగా వైద్యఆరోగ్యశాఖ చేపట్టే ప్రత్యేక కార్యక్రమాల్లో వీరి పాత్ర తప్పనిసరి. పల్స్పోలియో, ఎయిడ్స్ నివారణ, మలేరియా దినోత్సవాల్లో పాల్గొంటారు. 104, 108 ఆరోగ్య శ్రీ సేవలను అందిస్తారు. వీటితోపాటు ఏ గ్రామంలో ఎక్కడ అనారోగ్య సమస్య తలెత్తిన వెంటనే సంబంధిత ఏఎన్ఎంలు వైద్యాధికారికి తెలియజేస్తారు.
ఆశా వర్కర్ల వేతనంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని తెలంగాణ వాలంటరీ అండ్ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి కోరారు. వేతనమా.. పారితోషికమా? అనేదానిపై అధికారుల్లోనే అయోమయం నెలకొని ఉన్నదని ఆమె తెలిపారు. ఈ విషయమై రాష్ట్రవ్యాప్తంగా ఆశా వర్కర్లు ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినట్టు నెలకు రూ.6 వేల వేతనం చెల్లించాలా చర్యలు తీసుకుని పారితోషికం ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని కోరారు.