ఉస్మానియా ఆస్పత్రి పురవాస్తు భవనమేనా?: తెలంగాణ సర్కారుకు హైకోర్టు కీలక ఆదేశాలు
హైదరాబాద్: నగరంలోని ప్రఖ్యాత ఉస్మానియా ఆస్పత్రి పురావస్తు భవనమా? కాదా? అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. ఉస్మానియా ఆస్పత్రి కొత్త నిర్మాణం, కూల్చివేతపై దాఖలైన పలు వ్యాజ్యాలపై హైకోర్టు గురువారం విచారించింది.
ఆస్పత్రి కూల్చివేతపై భిన్నవాదనలు ఉన్నాయని హైకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. కూల్చివేయాలని ఓ వాదన ఉండగా, పురాతన భవనమంటూ వాదన ఉందని తెలిపింది. ఈ విషయంపై స్పష్టతనివ్వాలని ఆదేశించింది.
కాగా, ఉస్మానియా ఆస్పత్రి మరమ్మతుల కోసం గతంలోనే రూ. 6 కోట్లు కేటాయించినట్లు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అలాగే, మరమ్మతుల పనుల పురోగతిని తెలుసుకుని చెబుతామని ప్రభుత్వ తరపున న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. కాగా, ఈ వ్యాజ్యాలపై తదుపరి విచారణను ఆగస్టు 4కి వాయిదా వేసింది కోర్టు.
ఇది ఇలావుండగా, రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం అమలు కావడం లేదన్న వ్యాజ్యంపైనా హైకోర్టు బుధవారం విచారణ చేసింది. విద్యా హక్కు చట్టానికి సంబంధించి 2015 నుంచి పలు వ్యాజ్యాలు పెండింగ్లో ఉన్నాయని తెలిపింది. విద్యా హక్కు చట్టం అమలుపై కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను ఆగస్టు 11కు వాయిదా వేసింది.
మరోవైపు, సచివాలయ భవనాల కూల్చివేతపై గోప్యత ఎందుకు పాటిస్తున్నారో చెప్పాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే, సచివాలయ భవనాల కూల్చివేత పరిసర ప్రాంతాలకు ఎవరినీ అనుమతించలేమని ప్రభుత్వం న్యాయస్థానానికి చెప్పింది. సెక్షన్ 180ఈ ప్రకారం ఆ సైట్లో పనిచేసేవారు మాత్రమే ఉండాలని తెలిపింది. కాగా, కరోనా బులిటెన్లను ఏ విధంగా విడుదల చేస్తున్నారో.. కూల్చివేతలపై కూడా బులిటెన్ విడుదల చేయొచ్చు కదా అని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది.