స్వీట్ వార్నింగ్: అంతలోనే కేసీఆర్పై పవన్ కళ్యాణ్ అసంతృప్తి, అసలు కారణం ఇదేనా?
Recommended Video
హైదరాబాద్/అమరావతి: తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసంతృప్తితో ఉన్నారా? అంటే ఆయన మాటలు చూస్తుంటే అవుననిపిస్తోందని చెబుతున్నారు. ఏపీలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ పార్టీలు తమ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తే జనసేన పుట్టకపోయి ఉండేదని పవన్ చెబుతున్నారు.
కేసీఆర్! చేతులు జోడించి వేడుకుంటున్నా, మమ్మల్ని వదిలేయండి, ఇక చాలు: పవన్ కళ్యాణ్
టీడీపీ, వైసీపీ ఫ్యాక్టర్.. కేసీఆర్ పాలనపై పవన్ అసంతృప్తి?
గత ఏడాదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు కరీంనగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించిన జనసేనాని సీఎం కేసీఆర్ పైన ప్రశంసలు కురిపించారు. కానీ ఇటీవల పరిణామాలు ఆయనను అసంతృప్తికి గురి చేస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి. తెలంగాణలో జనసేన అవసరం ఉందని, మున్ముందు పోటీ చేస్తుందని, తెలంగాణ యువత మార్పు కోరుకుంటే వస్తామని గురువారం తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సభలో పవన్ చెప్పారు. టీడీపీ, వైసీపీ తమ బాధ్యతలు సరిగ్గా నెరవేరిస్తే ఏపీలో జనసేన అవసరం ఉండకపోయేదని పవన్ పలుమార్లు చెప్పారు. ఈ మాటలను తరిచి చూస్తే ఇప్పుడు తెలంగాణలో జనసేన అవసరం ఉందని చెప్పడం ద్వారా... తెరాస పాలనపై ఆయన అసంతృప్తితో ఉన్నట్లుగా కనిపిస్తోందని చెబుతున్నారు.
కేసీఆర్కు స్వీట్ వార్నింగ్ ఇందుకేనా?
కేసీఆర్.. మీరు అద్భుతమైన నాయకులు అని పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. కానీ ఆ తర్వాత చురకలు అంటించారు. మీ రాజకీయ లబ్ధి కోసం తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ గొడవలు పెట్టవద్దని, మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నానని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఇందుకు ఇటీవల టీడీపీ, వైసీపీ మధ్య జరిగిన డేటా చోరీ అంశమే కారణంగా కనిపిస్తోంది. డేటా చోరీ అంశంలో ఏ పార్టీ పొరపాటు చేసిందనే అంశాన్ని పక్కన పెడితే, మూడు పార్టీలు (టీడీపీ, వైసీపీ, టీఆర్ఎస్) రాజకీయ కోణంతో పాటు ప్రతీకారంతో ఆలోచించాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనిని ఉద్దేశించి పవన్.. కేసీఆర్కు చురకలు వేసి ఉంటారని భావిస్తున్నారు. అందుకే కొద్ది నెలల క్రితం ప్రశంసించి, ఇప్పుడు తెలంగాణలోను మున్ముందు పోటీ చేస్తామని స్వీట్ వార్నింగ్ ఇచ్చారని అంటున్నారు. రాజకీయాల కోసం ప్రజలను, రెండు రాష్ట్రాలను లాగవద్దని ఆయన కేసీఆర్తో పాటు చంద్రబాబు, జగన్లను కూడా హెచ్చరించారు.
పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే
టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్, కేటీఆర్లతో తనకు, తన కుటుంబానికి సాన్నిహిత్యం ఉందని, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మాత్రం వారితో తాను కలిసిలేనని, కేసీఆర్ తెలంగాణ ఉద్యమ స్వరూపమని, అందుకే గౌరవమిచ్చామని, ఎంతసేపు విషపూరితంగా మాట్లాడితే ఎలాగని పవన్ నిన్న మండిపడిన విషయం తెలిసిందే. ఏపీవారిని వదిలేయాలని కోరారు. వ్యక్తిగత కక్షలతో ప్రజల మధ్య విరోధం పెంచుతామంటే ఎలాగని నిలదీశారు. ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతీసిన, ఛీకొట్టిన కేసీఆర్, మోడీలతో జగన్ జతకట్టడం సరికాదని, జగన్, కేసీఆర్, చంద్రబాబు మధ్య గొడవలుంటే రాష్ట్రాన్ని బలిచేయడం తగదని, దొడ్డిదారిన ఇక్కడకు వచ్చి ఇబ్బంది పెట్టవద్దని, రెండు చేతులు జోడించి కేసీఆర్కు విన్నవిస్తున్నానని అన్నారు.