పౌరసత్వం ఇష్యూ: వేములవాడ బై ఎలక్షన్ తప్పదా? టీఆర్ఎస్ అభ్యర్థి సంతోషేనా?
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలకు వెళ్లక ముందే తెలంగాణలో అధికార టీఆర్ఎస్ ఉప ఎన్నికకు వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయా? అన్న సందేహాలు వ్యక్తం అయ్యాయి. దసరా పండుగకు ముందు నల్లగొండ ఉప ఎన్నిక నిర్వహణపై కసరత్తు చేసిన 'గులాబీ' పార్టీ నాయకత్వం తర్వాత దాట వేస్తూ వచ్చిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి రాజీనామా ఆమోదం పొందితే కొడంగల్ అసెంబ్లీ స్థాన ఉప ఎన్నిక వస్తుందనుకున్నా, అదీ జరుగలేదు.
Recommended Video
కానీ మరో రూపంలో మరో చోట ఉప ఎన్నిక వస్తున్నదన్న వాతావరణం నెలకొన్నది. అదీ ఇప్పటివరకు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తొలి నుంచి దన్నుగా నిలిచిన పాత కరీంనగర్ జిల్లాలో ఆ పరిస్థితి ఉన్నదా? అంటే పరిణామాలు అవుననే అంటున్నాయి.
ఎన్నికల సంఘానికి ఆది శ్రీనివాస్ ఫిర్యాదు ఇలా
వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్కు భారత పౌరసత్వం లేదని ఈ నెల 15వ తేదీన కేంద్ర హోంశాఖ తేల్చేసింది. దీంతో ఉప ఎన్నిక తప్పేలా కనిపించడం లేదు. టీడీపీ తరఫున చెన్నమనేని రమేశ్ 2009లో ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. ఆయన ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ రమేష్కు భారత పౌరసత్వం లేదని ఫిర్యాదు చేయడంతో ఈ వివాదం అప్పటినుంచి కొనసాగుతోంది. మధ్యలో 2010 ఉప ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ నుంచి తొలిసారి గెలుపొందిన రమేశ్కు ఎక్కడా అనుకూలంగా తీర్పు రాలేదు. ఇక 2014 ఎన్నికల్లో మూడోసారి ఎన్నికైన చెన్నమనేని రమేశ్పై బీజేపీ తరఫున పోటీ చేసిన ఆది శ్రీనివాస్ మరోసారి ఫిర్యాదు చేయడంతో కథ క్లైమాక్స్కు చేరుకున్నది.
విచారణ ఏకపక్షంగా సాగిందని వాదిస్తున్న చెన్నమనేని
రమేష్కు భారత పౌరసత్వం లేదని కేంద్ర హోంశాఖ గత సెప్టెంబర్లోనే తన నిర్ణయాన్ని వెల్లడించింది. దీనిపై రమేష్ దాఖలు చేసిన సమీక్షా పిటిషన్నూ కేంద్ర హోంశాఖ మరోసారి విచారణ చేపట్టింది. అనేక అంశాలు పరిశీలించాక రమేష్కు భారత పౌరసత్వం లేదని ఈ నెల 15వ తేదీన కేంద్ర హోంశాఖ తేల్చింది. విచారణ ఏకపక్షంగా సాగిందని రమేష్ ఆరోపిస్తున్నారు. కేవలం సాంకేతిక అంశాలనే పరిగణనలోకి తీసుకున్నారంటున్నారు. తనకు 2009 ఫిబ్రవరి 3వ తేదీనే భారత పౌరసత్వం లభించిందని ఆయన వాదించారు.
హైకోర్టులో పిటిషన్ వేసినా.. తీర్పు వ్యతిరేకమైతే బై ఎలక్షన్ తప్పదా?
2009 ఫిబ్రవరి 25వ తేదీ నుంచి అమలు చేస్తున్న నిబంధనలు తనకు వర్తించవంటున్నారు చెన్నమనేని రమేష్. దీంతో కేంద్ర హోంశాఖ నిర్ణయంపై మరోసారి హైకోర్టులో తేల్చుకునేందుకు చెన్నమనేని సిద్ధమవుతున్నారు. ఒకవేళ చెన్నమనేనికి వ్యతిరేకంగా హైకోర్టు తీర్పు వస్తే వేములవాడలో ఉప ఎన్నిక జరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే సార్వత్రిక ఎన్నిక జరుగడానికి ఏడాదికి పైగా సమయం ఉంటే ఉప ఎన్నిక నిర్వహించాల్సిందే. నల్లగొండ ఉప ఎన్నికను దాట వేస్తూ వస్తున్న టీఆర్ఎస్ పార్టీకి, వేములవాడలో తప్పేలా కనిపించడం లేదని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
చెన్నమనేని పౌరసత్వం వివాదంతో ఇలా టీఆర్ఎస్ నాయకత్వానికి ఇక్కట్లు
ఇప్పటికే నేరెళ్లలో దళితులపై దాడి, చెన్నమనేని రమేశ్ పౌరసత్వ వివాదం తదితర అంశాలపై అధికార టీఆర్ఎస్ నాయకత్వాన్ని ఇప్పటికే ఇబ్బందుల పాల్జేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల తెలంగాణలో ఆడబడుచుల పండుగ ‘బతుకమ్మ' సందర్భంగా జరిగిన చీరల పంపిణీ ప్రక్రియ అధికార టీఆర్ఎస్ పార్టీకి ఒకింత చెడ్డ పేరు తెచ్చి పెట్టిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటువంటి తరుణంలో పౌరసత్వం వివాదంపై పదేపదే ప్రజల్లో అంశం చర్చగా మారితే పరిస్థితులు భిన్నంగా మారతాయన్న అభిప్రాయం ఉంది. ఈ తరుణంలో ఎమ్మెల్యేగా మళ్లీ చెన్నమనేని పోటీ చేసే అవకాశాలే లేవు.
టీఆర్ఎస్ నాయకత్వం వైఖరి తేలాలంటే ఇలా స్పష్టత రావాలి
తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుంచి సీఎం కేసీఆర్కు వెన్నంటి ఉంటున్న టీ న్యూస్ ఎండీ సంతోష్ కుమార్.. ఒకవేళ వేములవాడ స్థానానికి ఉప ఎన్నిక జరిగితే అధికార టీఆర్ఎస్ అభ్యర్థిగా ఉంటారన్న అభిప్రాయం ఉన్నది. ఈ పరిస్థితుల్లో టీఆర్ఎస్ నాయకత్వం ఎలా వ్యవహరిస్తుందన్న సంగతి తేలాలంటే హైకోర్టు తీర్పు ఇవ్వాల్సిందే. అప్పటి దాకా వేచి చూడాల్సిందే మరి.