రేవంత్ రెడ్డి రూల్స్ను అతిక్రమించాడా, ఏమన్నారు?
హైదరాబాద్: నోటుకు ఓటు కేసులో నిందితుడైన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి హైకోర్టు పెట్టిన బెయిల్ షరతులను ఉల్లంఘించారని తెలంగాణ న్యాయవాదల జెఎసి (టిఎజెఎసి) ఆరోపించింది. ఈ మేరకు టిఎజెఎసి నాయకులు తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) స్టాండింగ్ కౌన్సెల్కు వినతిపత్రం సమర్పించారు.
ఎసిబి స్టాండింగ్ కౌన్సిల్ వి రవికిరణ్ రావుకు వారు గురువారం ఆ వినతిపత్రాన్ని సమర్పించారు. మీడియాతో మాట్లాడే సమయంలో రేవంత్ రెడ్డి నోటుకు ఓటు ఏ రూపంలోనూ కేసు గురించి గానీ, ఆ కేసు ప్రగతి గురించి గానీ మాట్లాడకూడదని హైకోర్టు షరతు పెట్టిందని వారు గుర్తు చేశారు.
అయితే, రేవంత్ రెడ్డి ఈ నెల 9వ తేదీన మీడియాతో మాట్లాడిన సందర్భంలో నిబంధనలను ఉల్లంఘించారని వారు ఆరోపించారు. తనపై పెట్టిన కేసు తనను ఏమీ చేయలేదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినట్లు వారు తెలిపారు. దానికితోడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావును అవమానించారని వారు ఆరోపించారు.
షరతులను ఉల్లంఘించినందున రేవంత్ రెడ్డి బెయిల్ను రద్దు చేయడానికి చర్యలను ప్రారంభించాలని వారు ఎసిబి స్టాండింగ్ కౌన్సిల్ను కోరారు. హైకోర్టు అనుమతితో ఆయన ఇటీవల హైదరాబాదులో అడుగుపెట్టిన విషయం తెలిసిందే.