న్యాయ పరీక్షకు నిలుస్తుందా?: రియల్టర్లు మొదలు సెలబ్రిటీల వరకు క్యూ
అన్ని పక్షాలకు సమ ప్రాధాన్యం అనే అంటూనే గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రైతు సమన్వయ సమితిల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా జీవో 39 నంబర్ జారీ చేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
హైదరాబాద్: రైతులకు వచ్చే ఏడాది నుంచి ఎకరాకు రూ.4000 ఆర్థికసాయం.. అందుకు రైతు సంఘాల ఏర్పాటు.. కనీస మద్దతు ధర మొదలు పంటకు గిట్టుబాటు ధర కల్పించేది ఈ రైతు సంఘాలే.. అన్ని పక్షాలకు సమ ప్రాధాన్యం అనే అంటూనే గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రైతు సమన్వయ సమితిల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా జీవో 39 నంబర్ జారీ చేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
గ్రామ స్థాయిలో అన్నదాతలపై అధికార టీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా పట్టు సాధించాలన్న వ్యూహం కనిపిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గ్రామ సభలు నిర్వహించి, అక్కడ జాబితా రూపొందించి, దానిని పంచాయతీ రికార్డుల్లో నమోదు చేసి వీటిని ఏర్పాటు చేయాలి. కానీ ఎక్కడా ఆ విధానం పాటించిన దాఖలాలే లేవు. కానీ ఎమ్మెల్యే, మంత్రి ఆశీస్సులు ఉన్న వారికి పదవులు దక్కుతున్నాయి.
గ్రామ టీఆర్ఎస్ నాయకులు జాబితాను ఎమ్మెల్యేకు ఇస్తే కొన్ని మార్పులు చేసి ప్రక్రియ ముగిసినట్లు ప్రకటించారనే విమర్శలు ఉన్నాయి. విపక్ష ఎమ్మెల్యేల అసెంబ్లీ స్థానాల్లోనూ పోలీసుల మద్దతుతో మంత్రులు, ఇతర కీలక నేతలు సమితులు ఏర్పాటు చేస్తున్నారని వార్తలొచ్చాయి. టీఆర్ఎస్ కార్యకర్తలకే చోటు కల్పిస్తున్న నేపథ్యాన్ని గమనించిన విపక్షాలు ఆందోళన బాట పట్టాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నచోట ఇతర పార్టీల నేతలు స్పందిస్తే దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నారు. అధికార టీఆర్ఎస్ నేతల కనుసన్నల్లో వారి ఇష్టానుసారంగా ఏర్పాటయ్యే రైతు సమన్వయ సమితుల్లో అన్నదాతలందరికీ ఎలా న్యాయం జరుగుతుందో ఏలిన వారే సెలవియ్యాలి.
ప్రభుత్వ కార్పొరేషన్ అయితే ఇంతే..
రైతు సమన్వయ సమితి పేరిట కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత ప్రభుత్వం రూ.5000 కోట్లతో నిధి ఏర్పాటు చేస్తుందన్న ప్రచారంతో నేతల్లో ఆశలు మోసులెత్తాయి. భవిష్యత్లో రైతు సమన్వయ సమితులకు కార్పొరేషన్/ సొసైటీ హోదా కల్పిస్తే రాజకీయంగా ప్రతిష్ట పెరుగుతుందని భావిస్తున్న రైతులు, వివిధ స్థాయిల్లోని నేతలు వీటిల్లో సభ్యత్వంపై మోజు పెంచుకున్నారు. నిజమైన రైతులు వెనక్కి వెళ్లిపోయారు. అన్ని జిల్లాల్లోనూ ఈ సమితులు గులాబీ రంగు సంతరించుకున్నాయి. 90 నుంచి 100 శాతం టీఆర్ఎస్ కార్యకర్తలకే పదవులు కట్టబెట్టారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జులు, టికెట్లు ఆశిస్తున్నవారు సమితుల్లో తమవారికే చోటు కల్పించారన్న ప్రచారం సాగుతోంది.
సెలవుల్లోనూ విధులు నిర్వర్తిస్తున్న వ్యవసాయశాఖ
ఇక నియామకం జరిగిన రైతు సమన్వయ సమితుల ఏర్పాటును ఖాయం చేస్తూ జీవోల జారీ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయశాఖ నిమగ్నం కావడం విస్మయం కలిగిస్తున్నది. యుద్ధప్రాతిపదికన సెలవులు కూడా తీసుకోకుండా ఆ శాఖ పని చేయడం మరింత ఆశ్చర్యకర పరిణామంగా భావించొచ్చు. రాష్ట్రంలోని 559 మండలాల పరిధిలో 540 మండలాలకు సమితుల నియామకానికి జీవోలు ఒకటి, రెండు రోజుల్లో విడుదల కానున్నాయి. ఏ చట్టం ప్రకారం రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకున్నదో అంతుబట్టడం లేదు. గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో నీటి సరఫరా విషయమై పట్టు సాధించేందుకు ఏర్పాటుచేసిన నీటి సంఘాల కార్యవర్గాలను ఏర్పాటు చేసేందుకు చట్టం ద్వారా ఎన్నికలు నిర్వహించింది.
ఏ చట్టం ప్రకారం చేస్తున్నారో చెప్పని సీఎం కేసీఆర్
కానీ 2014లో తెలంగాణ ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత సమగ్ర కుటుంబ సర్వే నిర్వహణకు మాదిరిగా... విపక్షాలు ప్రశ్నించే వరకు చేపట్టిన ప్రాజెక్టులకు అవసరమైన భూ సేకరణ కోసం జీవోలు జారీ చేసినట్లే.. రైతుల సమన్వయ సమితులు ఏర్పాటు చేయడానికి జీవోలు జారీ చేయడంలో సర్కార్ నిమగ్నమైంది. ఏ చట్టం ప్రకారం ఈ నియామకాలు చేపడుతున్నారో తెలియని అయోమయ పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు ఉన్నారు. ఇదిలా ఉంటే కొన్ని గ్రామాల సమితుల పేర్లపై ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధుల మధ్య వివాదాల కారణంగా ఇన్ఛార్జి మంత్రులు సంతకాలు చేయలేదు. మంత్రి సంతకమైన జాబితాలే సచివాలయానికి పంపాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది.
ఎమ్మెల్యేలు, ఇన్ చార్జిల నుంచి కలెక్టర్లకు ఇలా ఒత్తిళ్లు
కానీ ఆదివారం సాయంత్రం వరకు ఎలాంటి వివాదం లేని 152 మండలాలకు మాత్రమే సమితులు ఏర్పాటైనట్లు నిర్ధారించారు. కొన్ని గ్రామాల్లో అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం లేదని బహిష్కరించడంతో ఆయా మండలాల్లో సమితుల ఏర్పాటు ప్రక్రియ నిలిచిపోయింది. ఉదాహరణకు కరీంనగర్ జిల్లాలో 205 గ్రామ సమితులకు 51 ఆర్ఎస్ఎస్ల జాబితాలే ఖరారయ్యాయి. అధికార పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు కారణంగా మిగతావి పెండింగులో ఉన్నాయి. సచివాలయానికి వచ్చిన జాబితాలపైనా ఎమ్మెల్యేలు అభ్యంతరం పెట్టకుండా ముందు జాగ్రత్తగా జీఓలు ఎక్కడ తయారుచేస్తున్నదీ వ్యవసాయశాఖ వెల్లడించడం లేదు.
శిక్షణా సదస్సులో గొడవలు
గమ్మత్తేమిటంటే కొన్ని గ్రామ సమితుల్లో రైతు సమన్వయ సమితిలో సభ్యులుగా నియమితులైన వారికి ఆ విషయమే చివరిదాకా తెలియదు. ఈనెల 10 నుంచి గ్రామ సమితుల సభ్యులకు మండల కేంద్రాల్లో శిక్షణ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రమ్మని నేతలు పిలిచేదాకా తనను గ్రామ సమితిలో నియమించిన విషయం తెలియదని పలువురు రైతులు చెబుతున్నారు. మరోవైపు జాబితాల్లో పేర్లు ఉన్నవారిపై శిక్షణ సదస్సుల్లో గొడవలు జరుగుతున్నాయి. ప్రత్యేకించి గ్రామస్థాయిలో సమితుల ఏర్పాటు పూర్తయినా మండల స్థాయికి వచ్చేసరికి ఆటంకాలు ఎదురవుతున్నాయి. మండల సమితి సభ్యుల జాబితా కలెక్టర్ల వద్దే ఆగిపోయింది.
టీఆర్ఎస్ నేతల కుటుంబ సభ్యులకే పెద్దపీట
అనేక మండల సమితుల సభ్యుల జాబితా కలెక్టర్ల వద్దకు వెళ్లినా నిలిచిపోయినట్టు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. మార్పుచేర్పులు చేయాల్సి ఉన్నందున ఉత్తర్వులు జారీ చేయొద్దని మంత్రులు కలెక్టర్లకు చెప్తున్నారు. దీంతో పలు మండల సమితుల నియామకాల్లో తాత్కాలిక ప్రతిష్టంభన ఏర్పడింది. ఇక ఆధిపత్యం.. పెత్తనం లక్ష్యంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేత సన్నిహితులు, అనుయాయులు, రియల్టర్లు, పైరవీకారులు స్థానం దక్కించుకున్నారు. రైతుల స్థానే సమితుల్లోకి బడా కాంట్రాక్టర్లు, రియల్ వ్యాపారులు, విశ్రాంత ఉద్యోగులు చేరారు. నల్లగొండ జిల్లాలో ఎక్కువగా రియల్టర్లకు పెద్దపీట వేశారు. ఇక మహిళల కోటాలోనూ టీఆర్ఎస్ నేతలు తమ కుటుంబ సభ్యులకే పెద్దపీట వేశారు. రంగారెడ్డి జిల్లాలో సమితి సభ్యులుగా టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలే ఉన్నారు.
పాలమూర్లో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్
ఉదాహరణకు ఉమ్మడి ఆంధప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ మాజీ నేతలే ప్రస్తుతం అధికార టీఆర్ఎస్ నాయకులుగా.. ఈ సభ్యత్వం కోసం పోటీ పడుతున్నారంటే పరిస్థితి అతిశయోక్తి కాదు. నేతల మధ్య పోటీ పెరగడంతో రైతు సమన్వయ సమితులు అధికార పార్టీ నేతల మధ్య బల నిరూపణకు వేదికలుగా మారాయి. మహబూబ్నగర్ జిల్లాలో రైతు సమన్వయ సమితి జిల్లా సమన్వయకర్త పదవిని మల్లు నరసింహారెడ్డికి ఇవ్వాలని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేస్తుంటే, బస్వరాజ్ గౌడ్కు ఇవ్వాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. మంత్రి లక్ష్మారెడ్డి తరఫున బోయిన్పల్లి శ్యాం సుందర్ రెడ్డి రంగంలో ఉన్నారు.
నల్లగొండలో భగ్గుమన్న విభేదాలు
నాగర్ కర్నూలు కో ఆర్డినేటర్లుగా తుర్కదిన్నె వాసి శ్రీనివాసరావు, నాగర్ కర్నూలు నుంచి దొడ్ల ఈశ్వర్ రెడ్డి, తిమ్మాజీపేటకు చెందిన జెట్టి వెంకటేశ్ పోటీలో ఉన్నారు. ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ రైతు సంఘం నాయకుడు మందడపు సుధాకర్, నల్లమల వెంకటేశ్వరరావు, బండి గుర్నాథరెడ్డి, గుత్తా వెంకటేశ్వరరావు రంగంలో ఉన్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ రైతు సమన్వయ సమితుల్లో పదవుల కోసం పోటాపోటీ నెలకొంది. కల్వకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఎవరికి వారుగా జాబితాలను ఇన్చార్జి మంత్రికి అందజేశారు.
రాష్ట్ర సమన్వయకర్తగా ప్రచారం జరుగుతున్న ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి చిట్యాల మండలంలో ఓ గ్రామ సమితి సభ్యుడిగా చేరినట్లు తెలుస్తోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో అధికార పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఇక, ఎమ్మెల్యేల ఏకపక్ష వైఖరిపై మెదక్ జిల్లా నేతల్లో అసంతృప్తి నెలకొంది. టీఆర్ఎస్లోని ప్రముఖ నాయకుడు కల్వకుంట్ల గోపాలరావు సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మొయిన్కుంట గ్రామ సమితి సభ్యుడిగా చేరారు. ఆయన ఆ జిల్లా సమన్వయకర్త కావొచ్చని భావిస్తున్నారు. జోగులాంబ - గద్వాల జిల్లాలో సమన్వయకర్త పదవి కృష్ణారెడ్డి, సీతారాంరెడ్డిల్లో ఒకరికి దక్కవచ్చని అంటున్నారు.
చేవెళ్లలో ఎమ్మెల్యే... సీనియర్ల నేతల వేర్వేరు జాబితాలు
రంగారెడ్డి జిల్లా సమన్వయకర్తగా వంగేటి లక్ష్మారెడ్డి ఎంపికయ్యే అవకాశముంది. మాజీ డిప్యూటీ స్పీకర్ హరీశ్వర్ రెడ్డి తనయుడు కొప్పుల మహేశ్ రెడ్డికి వికారాబాద్ జిల్లా సమన్వయకర్త బాధ్యత దక్కవచ్చని భావిస్తున్నారు. యాలాల మండల సమన్వయకర్త సురేందర్ రెడ్డి, పెద్దేముల్ కో ఆర్డినేటర్ ప్రకాశ్ కూడా రంగంలో ఉన్నారు. మేడ్చల్ జిల్లాలో సీనియర్ నేత నందారెడ్డి రేసులో ముందున్నారు. చేవెళ్ల నియోజకవర్గంలోని నవాబుపేట మండలం పులిమామిడిలో ఎమ్మెల్యే యాదయ్య ఒక జాబితా రూపొందిస్తే.. టీఆర్ఎస్ సర్పంచ్ భీమ్రెడ్డి, సీనియర్ నేతలంతా వేరుగా జాబితాను గ్రామసభలో ఆమోదించి, దండోరా కూడా వేయించి కలెక్టర్కు అందజేశారు.
సమితిలో సభ్యుడు కావాలంటే గ్రామం నివాసం ఉండాల్సిందే
ఆదిలాబాద్ జిల్లా సమన్వయకర్తగా తాంసి మండలం వడూర్ గ్రామ సమితి సభ్యుడు అడ్డి భోజారెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. కరీంనగర్, కొత్తపల్లి మండలాల్లో 30 గ్రామాల్లో టీఆర్ఎస్ నాయకులే కొందరు రైతుల పేర్లు ఎమ్మెల్యేకు అందించి వాటినే రైతు సమన్వయ కమిటీగా పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కో - ఆర్డినేటరుగా తాళ్లూరి వెంకటేశ్వర్లు పేరు పరిశీలనలో ఉంది. కాగా, సమితుల్లో సభ్యుడు కావాలంటే గ్రామంలో నివాసం ఉండాలి. కానీ, సమితుల నియామకం రెవెన్యూ గ్రామాల ప్రాతిపదికన జరిగింది. ఒక్కో రెవెన్యూ గ్రామంలో రెండు మూడు గ్రామాలు కూడా ఉంటాయి. దీంతో, నివాసం ఉండాలనే సడలింపు ఇచ్చారు. ఫలితంగా, పట్టణాల్లో ఉన్న వారికీ గ్రామ సమితుల్లో చోటు కల్పిస్తున్నారు.