'క్లూ' దొరక్కుండా నరేశ్ హత్య, స్వాతిదీ హత్యేనా?: శ్రీనివాసరెడ్డి గత చరిత్ర అనుమానాస్పదమే!
నరేశ్ను హత్య చేసింది తానే అని ఒప్పుకోవడంతో స్వాతి విషయంలోను శ్రీనివాసరెడ్డి పాత్రపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.
భువనగరి: నరేశ్-స్వాతిల విషాద ప్రేమ కథలో తండ్రే అసలు విలన్ అన్న అనుమానాలు క్రమంగా బలపడుతున్నాయి. నరేశ్ అదృశ్యం తర్వాత తనకేమి తెలియదని దొంగ ఏడుపులు ఏడ్చిన శ్రీనివాసరెడ్డి.. ఎట్టకేలకు విచారణలో నిజం అంగీకరించాడు. నరేశ్ ను హత్య చేసింది తానేనని ఒప్పుకున్నాడు.
ఊహించిందే జరిగింది: నరేశ్ను హత్య చేసింది స్వాతి తండ్రే! విషాదాంతమైన ప్రేమ కథ(ఫోటోలు)
నరేశ్ను హత్య చేసింది తానే అని ఒప్పుకోవడంతో స్వాతి విషయంలోను శ్రీనివాసరెడ్డి పాత్రపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. స్వాతి నిజంగానే ఆత్మహత్య చేసుకుందా? లేక హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. శ్రీనివాసరెడ్డికి గతంలో ఉన్న నేరచరిత్ర కూడా దీనికి బలం చేకూర్చేదిగా మారింది.
దీంతో ఆత్మహత్యకు ముందు స్వాతి చిత్రీకరించిన సెల్ఫీ వీడియో కూడా.. ఆమె చేత బలవంతంగా చేయించి ఉండవచ్చునన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
స్వాతిది ఆత్మహత్యా? హత్యా?
స్వాతి ఉరేసుకున్న బాత్రూమ్ పైకప్పు చాలా తక్కువ ఎత్తులో ఉంది. సాధారణంగా ఆమె ఎత్తు కూడా ఎక్కువగా ఉండటంతో.. ఆ బాత్రూమ్లో ఆత్మహత్య చేసుకోవడం సాధ్యపడే పనేనా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. పోలీసులు ఈ కోణంలోను విచారణ జరిపే అవకాశం ఉంది.
గ్రామస్తుల్లో శ్రీనివాసరెడ్డి పట్ల భయం:
స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డి అంటే గ్రామస్తుల్లోను ఒకరకమైన భయం ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుచేతనే గ్రామస్తులెవరు దీనిపై నోరు మెదపడానికి ముందుకు రావడం లేదు.ఇదిలా ఉంటే, నరేశ్ కుటుంబ సభ్యులు శ్రీనివాసరెడ్డి ఇంటిపై దాడికి దిగే అవకాశం ఉండటంతో.. అతని ఇంటి వద్ద భద్రత ఏర్పాటు చేశారు. ప్రస్తుతం స్వాతి తండ్రితో పాటు స్వాతి సోదరి కుమారులను పోలీసులు రహస్యంగా విచారిస్తున్నారు.
20ఏళ్ల వయసు నుంచే నేరచరిత్ర:
స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డికి 20ఏళ్ల వయసు నుంచే నేర చరిత్ర ఉందని తెలుస్తోంది. తొలి నుంచి స్థానిక రౌడీ షీటర్లతో సంబంధాలు ఉన్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. 1992లో ఒక పొలం వివాదంలో శ్రీనివాసరెడ్డి సొంత అన్న హత్యకు గురైనట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అతని తల్లిదండ్రులు అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయారు.
ఈ మూడు హత్యల విషయంలోను శ్రీనివాసరెడ్డి పాత్రపై పలు అనుమానాలు తలెత్తాయి. అయితే సరైన సాక్ష్యాధారాలేవి లేకపోవడంతో ఆ కేసులు నిలబడలేదు.
ఎక్కడా ఆధారాలు దొరక్కుండా!:
నరేశ్ హత్య విషయంలోను శ్రీనివాసరెడ్డి తన గత అనభవాన్ని ఉపయోగించినట్లుగా చెబుతున్నారు. హంతకులు ఎవరైనా ఏదో ఒక క్లూ మరిచిపోతారని, కానీ శ్రీనిసవారెడ్డి మాత్రం పక్కా ప్లాన్ తో ఏ ఆధారం లేకుండా చేశాడని పోలీసులు చెబుతున్నారు. చివరకు అస్థికలను కూడా మూసీ నదిలో కలిపేయడంతో.. ఆయన చెబితే తప్ప.. అసలు నిజం తెలియరాలేదని పేర్కొన్నారు.