ఇవే నిదర్శనం!: కేసీఆర్ కీలక వ్యాఖ్యలు, కేటీఆర్కు లైన్ క్లియర్ చేస్తున్నారా?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన తనయుడు, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుకు లైన్ క్లియర్ చేస్తున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే కనిపిస్తోందని అంటున్నారు. కేటీఆర్, హరీష్ రావులకు మంత్రి పదవి ఇవ్వకపోవడం, కేటీఆర్ను తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి.
మల్కాజిగిరిలో నేను గెలవాలంటే మీ అవసరం కావాలి: వారి గడప తొక్కిన రేవంత్ రెడ్డి, ఆ నేత హామీ
కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఇప్పుడు లోకసభ ఎన్నికలకు ముందు కేసీఆర్ నోటి నుంచి సరికొత్త వ్యాఖ్యలు వచ్చాయి. అవసరమైతే జాతీయ పార్టీని స్థాపిస్తానని, ప్రజలు దీవిస్తే కాంగ్రెస్, బీజేపీల నుంచి దేశాన్ని విముక్తం చేస్తానని కరీంనగర్ ఎన్నికల ప్రచార బహిరంగ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పాలన దేశానికి దిక్సూచీగా మారుతోందన్నారు. కాంగ్రెస్, బీజేపీ ముక్త భారత్ అంటూ కొత్త నినాదం ఇచ్చారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారని చాలాకాలంగా ప్రచారం సాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు మెజార్టీ రాకుంటే, థర్డ్ కూటమి కేంద్రంలో అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటే కేసీఆర్ కీలకంగా మారుతారని అంటున్నారు.
ప్రజల్ని అడిగిన కేటీఆర్
ఈ నేపథ్యంలో కరీంనగర్లో జరిగిన లోకసభ ఎన్నికల ప్రచారం సభలో కేసీఆర్ తన మనసులోని మాటను బయటపెట్టారా అనే చర్చ సాగుతోంది. నన్ను దేశ రాజకీయాల్లోకి వెళ్లమంటారా, వెళ్లమంటే పిడికిలి బిగించి దీవించాలని, మీ దీవెలతో ముందుకు వెళ్తానని, దేశ రాజకీయాల్లో తెలంగాణ పెద్ద పాత్ర పోషించాలని, మీ బిడ్డగా కరీంనగర్ దీవెనతో దేశాన్ని దుర్మార్గుల నుంచి విముక్తి చేసి అద్భుతమైన భారత్ను నిర్మిస్తానని మాటిస్తున్నానని కేసీఆర్ చెప్పారు. నన్ను ఢిల్లీకి వెళ్లమంటారా.. సమాధానం చెప్పండని కేసీఆర్ అడగగా.. సభకు హాజరైన వారు చప్పట్లు కొట్టారు. అవునని తలూపారు. కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
కేటీఆర్కు పట్టం కట్టనున్నారా?
తెరాస బాధ్యతలను ఇప్పటికే తనయుడు కేటీఆర్కు అప్పగించారు. కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి తనయుడు కేటీఆర్కు కీలక బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ ఎప్పటి నుంచో ఉంది. వాటిని నిజం చేసేలా కేసీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం పార్టీ బాధ్యతలను పూర్తిగా కేటీఆర్ చూస్తున్నారు. లోకసభ ఎన్నికల అనంతరం థర్డ్ ఫ్రంట్ ఢిల్లీలో కీలకం అయ్యే పరిస్థితులు ఉంటే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి, కేటీఆర్కు 'ముఖ్య' పదవి అప్పగించినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. నిన్నటి వరకు ఢిల్లీలో చక్రం తిప్పుతామని చెప్పడం, తాజాగా ఢిల్లీకి వెళ్లాలా అని ప్రజల్ని అడగడం, జాతీయ పార్టీ పెడతానని చెప్పడం, హరీష్ రావు మౌనం.. ఈ పరిస్థితులు చూస్తుంటే ఏమైనా జరగవచ్చునని అభిప్రాయపడుతున్నారు.