దుబ్బాక బైపోల్ : కాంగ్రెస్కు వర్కౌట్ కాని సెంటిమెంట్ టీఆర్ఎస్కు వర్కౌట్ అవుతుందా?
దుబ్బాక బైపోల్పై తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ చర్చ నడుస్తోంది. ఈసారి ఎన్నికలను ఏ అంశాలు ప్రభావితం చేయబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకూ తెలంగాణలో జరిగిన ఉపఎన్నికలన్నింటినీ పరిశీలిస్తే రెండు అంశాలు ఎక్కువగా చర్చకు వస్తున్నాయి. ఒకటి... ఇప్పటివరకూ జరిగిన అన్ని ఉపఎన్నికల్లోనూ అధికార టీఆర్ఎస్ పార్టీ గెలవడం. రెండు... ఇప్పటివరకూ జరిగిన అన్ని అసెంబ్లీ ఉపఎన్నికల్లో సిట్టింగ్ పార్టీ ఓడిపోవడం. ప్రస్తుతం దుబ్బాకలో టీఆర్ఎస్ సిట్టింగ్ పార్టీ... ఈ లెక్కన టీఆర్ఎస్ అక్కడ బోల్తా కొడుతుందా... లేక ఉపఎన్నిక ఏదైనా తమదే గెలుపు అన్న ఒరవడిని కొనసాగిస్తుందా అన్నది చర్చనీయాంశంగా మారింది.
దుబ్బాక బై పోల్ : కాంగ్రెస్ పార్టీకి షాక్... టీఆర్ఎస్లో చేరిన కీలక నేతలు
అదే ట్రెండ్ కొనసాగుతుందా... లేక..?
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత నారాయణఖేడ్,పాలేరు,హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. అప్పటివరకూ కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలుగా ఉన్న ఈ మూడింటిని టీఆర్ఎస్ తమ ఖాతాలో వేసుకుంది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ ఇలాఖా హుజూర్ నగర్లోనూ టీఆర్ఎస్ ముందు కాంగ్రెస్ తేలిపోయింది. ఈ మూడు ఉపఎన్నికల్లోనూ సిట్టింగ్ పార్టీ ఓడిపోవడంతో దుబ్బాక ఉపఎన్నికలోనూ అదే ట్రెండ్ కొనసాగే అవకాశం ఉందా... లేక ఆ ట్రెండ్ను టీఆర్ఎస్ బ్రేక్ చేస్తుందా అన్న చర్చ జరుగుతోంది.
కాంగ్రెస్కు కలిసిరాని సానుభూతి సెంటిమెంట్..
దుబ్బాకలో లాగే నారాయణఖేడ్,పాలేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అక్కడి ఎమ్మెల్యేల హఠాన్మరణంతో ఉపఎన్నికలు జరిగాయి. నారాయణఖేడ్లో కృష్ణారెడ్డి మరణంతో ఆయన కుటుంబ సభ్యుడికే కాంగ్రెస్ బైపోల్ టికెట్ ఇచ్చింది. పాలేరులో ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్ రెడ్డి మరణంతో... ఆయన సతీమణి సుచరితా రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. ఆ రెండు నియోజకవర్గాల్లో దివంగత నేతల కుటుంబ సభ్యులకే టికెట్లు ఇచ్చినప్పటికీ కాంగ్రెస్కు సానుభూతి సెంటిమెంట్ కలిసిరాలేదు. అధికార పార్టీతోనే అభివృద్ది జరుగుతుందన్న నమ్మకమో లేక సిట్టింగ్ల మీద వ్యతిరేకతతోనే మొత్తానికి రెండు చోట్ల టీఆర్ఎస్ పార్టీకే ప్రజలు పట్టం కట్టారు.
టీఆర్ఎస్కు వర్కౌట్ అవుతుందా...?
పాలేరు,నారాయణఖేడ్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్కు వర్కౌట్ కానీ సానుభూతి ఇప్పుడు టీఆర్ఎస్కు వర్కౌట్ అవుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. నిజానికి ఉపఎన్నిక టికెట్ తనకే దక్కుతుందన్న ధీమాతో మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాస రెడ్డి గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ పోయారు. కానీ టీఆర్ఎస్ మాత్రం చివరకు సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాత రెడ్డికి టికెట్ ఇచ్చింది. సోలిపేట రామలింగారెడ్డిపై ఉన్న సానుభూతి... నియోజకవర్గానికి తొలిసారి ఓ మహిళా ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించే అవకాశం... ఈ రెండు అంశాలు తమకు కలిసొస్తాయని టీఆర్ఎస్ భావిస్తోంది. ఎప్పటిలాగే ఈ ఉపఎన్నికను కూడా తామే స్వీప్ చేస్తామన్న ధీమాలో ఉంది.
త్రిముఖ పోటీ...
ఇప్పటివరకూ ప్రతీ అసెంబ్లీ ఉపఎన్నికలోనూ కాంగ్రెస్ నుంచే ప్రధాన పోటీని ఎదుర్కొన్న టీఆర్ఎస్... దుబ్బాకలో బీజేపీ నుంచి కూడా పోటీని ఎదుర్కొనే అవకాశం ఉందన్న వాదన బలంగా వినిపిస్తోంది. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గతంలో రెండుసార్లు ఓడిపోవడం... అధికార టీఆర్ఎస్ను గట్టిగా ప్రశ్నించే నేత కావడంతో.. సానుభూతి,సమర్థత అంశాలు ఆయనకు కలిసొస్తాయని ఆ పార్టీ భావిస్తోంది. మరోవైపు చెరుకు ముత్యంరెడ్డిపై స్థానికంగా ఉన్న అభిమానం,ఆయన చేసిన అభివృద్ది పనులే తనను గెలిపిస్తాయని కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డి ధీమాగా ఉన్నారు.అటు అధికార టీఆర్ఎస్ పార్టీ మాత్రం తమ అభ్యర్థికి లక్ష మెజారిటీ ఖాయమని చెబుతోంది. ఈ నేపథ్యంలో చివరకు దుబ్బాకలో సత్తా చాటేదెవరో... తేలిపోయేదెవరో తేలాలంటే నవంబర్ 10 ఉపఎన్నిక ఫలితాల వరకూ వేచి చూడాల్సిందే.