గవర్నర్ తమిళ సై తో టీఆర్ఎస్ కు తిప్పలేనా ? కేసీఆర్ కు చుక్కలేనా ? బీజేపీ ప్లాన్ ఇదేనా ?
తెలంగాణలో అధికార పార్టీ టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా ఎదగాలి అనుకుంటున్న బిజెపి గవర్నర్ నియామకంలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరించిందా ? అందుకే తెలంగాణ గవర్నర్ గా బిజెపి క్రియాశీల నాయకురాలు తమిళసై సౌందర రాజన్ ను నియమించిందా ? బీజేపీని తెలంగాణలో పటిష్టం చేయాలనే ఉద్దేశంతోనే తమిళ సై కి గవర్నర్ గా పట్టం కట్టిందా? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది.
అవంతి వర్సెస్ గంటా... విశాఖలో వీరి రాజకీయ మంట .. అసలు రీజన్ ఇదేనా ?
పదేళ్ళ పాటు గవర్నర్ గా నరసింహన్ .. సీఎం కేసీఆర్ తో మంచి సాన్నిహిత్యం
గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దాదాపు పదేళ్లపాటు గవర్నర్గా తెలంగాణారాష్ట్రానికి సేవలందించారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటినుంచి ఇప్పటివరకు ఆయన నలుగురు ముఖ్యమంత్రుల్ని చూశారు. గవర్నర్ గా తన పదేళ్ళ పదవీ కాలంలో నరసింహన్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో అంతగా సఖ్యతగా లేరనే వాదన కూడా ఉంది. దీనికి కారణం చంద్రబాబు ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కోవడం కోా కారణం అయితే ఆ తర్వాత ఏపీకి వెళ్లిపోవడం కూడా ఒక కారణం అని తెలుస్తుంది. అదే విధంగా ఇదే కేసులో తెలంగాణ సీఎం కేసీఆర్ అప్పట్లో దూకుడుగా వెళ్లడం, నరసింహన్కు సీఎం కేసీఆర్ దగ్గరగా మెలగడం కూడా చంద్రబాబు దూరం కావడానికి ఒక కారణం అన్నది రాజకీయ విశ్లేషకుల భావన .
నరసింహన్ స్థానంలో తమిళ సై నియామకానికి రీజన్ ఇదే
తెలంగాణా సీఎం కేసీఆర్ తో ఎలాంటి విబేధాలు లేకుండా నరసింహన్ గవర్నర్ గా పాలనలో తన మార్క్ చూపించారు. ఇక ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రానికి నూతన గవర్నర్ గా తమిళనాడుకు చెందిన తమిళసై ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయాలని, తెలంగాణలో దూకుడుగా వ్యవహరించాలని కొత్త గవర్నర్గా తమిళసై సౌందరరాజన్ను నియమించడం పక్కా ప్రణాళికాబద్దమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటివరకు గవర్నర్ గా ఉన్న నరసింహన్ ముఖ్యమంత్రి కేసీఆర్కు అనుకూలంగా మారిపోయారనే ఆరోపణలతో ఆయనను తప్పించి ఈమెకు గవర్నర్ పదవిని కట్టబెట్టారని సమాచారం.
బీజేపీ వ్యూహాత్మక నిర్ణయం .. తెలంగాణలో తమిళ సై గవర్నర్ గా నియామకం
ఇక కొత్తగా నియమితులైన తమిళసై కూడా బీజేపీ బలోపేతానికి సహకరించే అవకాశాలు బలంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.తెలంగాణ రాష్ట్రంలో 2023లో జరగనున్న ఎన్నికల్లో టిఆర్ఎస్ ను ఓడించే ప్రణాళికలో భాగంగానే తమిళసై ని గవర్నర్ గా నియమించిందనే చర్చ తెలంగాణ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది . ఆమె నియామకంతో ఒకప్పుడు ఎన్టీ రామారావు, కుముద్ బెన్ జోషీల మధ్య తారస్థాయిలో సాగిన విభేదాలు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. గతంలో ఎన్టీ రామారావు సీఎంగా ఉన్న సమయంలో, కుముద్ బెన్ జోషి గవర్నర్ గా ఎన్టీఆర్ కు చుక్కలు చూపించిన సందర్భం ఇప్పుడు తమిళ సై నియామకంతో రాజకీయ వర్గాల్లో జ్ఞప్తికి వచ్చింది .
ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కుముద్ బెన్ జోషీ గవర్నర్ గా ఉన్న రోజులు రిపీట్ అని రాజకీయ వర్గాల్లో చర్చ
రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్న కాలంలో 1985లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా కుముద్ బెన్ జోషీని నియమించిన కేంద్రం ఏపీలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు గవర్నర్ కుముద్ బెన్ జోషి ద్వారా చుక్కలు చూపించింది. కుముద్ బెన్ జోషీ గవర్నరుగా వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు కు ఆమె కొరకరాని కొయ్యగా తయారయ్యారు. రాజభవన్ కాంగ్రెసు కార్యాలయంగా మారిందని రకరకాల విమర్శలు వెల్లువెత్తాయి. అయినా సరే కుముద్ బెన్ జోషి ఏ మాత్రం తగ్గకుండా ఎన్టీ రామారావుకు సహకరించకుండా, రాష్ట్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారారు . బిజెపి కూడా తమిళసై ని గవర్నరుగా నియమించడం ద్వారా అదే పని చేయబోతోందని ప్రస్తుత రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
బీజేపీ బలోపేతం కావటానికి గవర్నర్ తమిళ సై సహకారం అందిస్తారా ? కేసీఆర్ తో కలిసి పని చేస్తారా ?
తమిళసై కూడా బిజెపి నాయకులకు అందుబాటులో ఉంటారని, తద్వారా ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహించే అవకాశం ఉందనే భావన వ్యక్తమవుతోంది. కేంద్రంలోని బిజెపి సర్కార్ పక్కా వ్యూహంతోనే తమిళ సై ని పంపించినట్టు గా తెలుస్తుంది. కేసీఆర్ ప్రభుత్వానికి చిక్కులు తెచ్చే పెట్టేందుకు గవర్నర్ గా తమిళ సై రంగంలోకి దిగబోతున్నారు . ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడానికి బిజెపి చేస్తున్న వ్యూహంలో భాగంగా తమిళ సై కి తెలంగాణ గవర్నర్ గా అవకాశం ఇవ్వడం కెసిఆర్ కు తిప్పలు తెచ్చిపెట్టేలా ఉందనేది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. మరి గవర్నర్ తమిళ సై తెలంగాణ రాష్ట్రంలో ఏం చేయనున్నారో తెలియాలంటే కాస్త వెయిట్ చేయాల్సిందే.