ఎప్పుడో మమ్మీ సినిమాలో చూసాం.!ఇప్పుడేంటి ఈ గోల.!మిడతలది ఉడత బెదిరింపేనా..?నిపుణులేం చెప్తున్నారు.!
హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి కాకముందే రెండు తెలుగు రాష్ట్రాలను మిడతల భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. మిడతల దండు దాడి చేయడానికి సిద్దంగా ఉందని, రెండు తెలుగు రాష్ట్రాలవైపు దూసుకొస్తున్నాయని జోరుగా ప్రచారం సాగుతోంది. ఎప్పుడో మమ్మీ సినిమాలో ప్రేతాత్మ ప్రభావంతో మిడతలు మానవాళిపై దాడి చేసిన సన్నివేశాలను చూసాం. అచ్చం అదే మాదిరి మిడదతల దండు పంట పోలాలపైన, మానవుల పైన దాడి చేసే అవకాశాలు ఉన్నాయని జరుగుతున్న ప్రచారంలో ఎంతవరకు వాస్తవం ఉందో నిర్ధారణ కావాల్సి ఉంది. సహజంగా పంట పొలాల్లో జీవించే మిడతల వల్ల ప్రజానికానికి ఎలాంటి ముపు పొంచి ఉంది అనే అంశంపై చర్చ జరుగుతోంది.
Recommended Video
కరోనా తర్వాత మిడతలతో ముప్పు తప్పదా..? తెలుగు రాష్ట్రాల వైపు దూసుకొస్తున్న మిడతల దండు..
ఇప్పటికే కరోనా వైరస్ తో గజగజావణుకుతున్న భారతదేశాన్ని మిడదల దండు మరింత వణికిస్తున్నట్టు తెలుస్తోంది. దేశంలో ప్రచారం జరుగుతున్నట్టు నిజంగానే మిడతల దండు దాడి చేస్తే వాటిని నిలువరించే శక్తి సామర్థ్యాలు ఉన్నాయా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. కరోనా వైరస్ తో అతాలాకుతలం అవుతున్న రెండు తెలుగు రాష్ట్రాలకు మిడతల దాడి మూలిగే నక్క మీద కొబ్బరికాయ పడినట్టైంది. మిడతలు మనిషిని చంపితినే క్రూరమృగాల కన్నా ప్రమాదమని తెలుస్తోంది. ఇవి మానవులు తినే ఆహారాన్ని పూర్తిగా నాశనం చేస్తాయి.
మిడతల దండు ప్రమాదకరమే.. మానవాళికి తిండిగింజలు లేకుండా చేయగలుగుతాయి..
మిడతలు ఎంత ప్రమాదకరమో చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఒక్కరోజులోనే మిడతలు ముప్పై ఐదు వేల మందికి సరిపోయే భోజన దినుసులను ఆరగిస్తాయని నిపుణులు నిర్థారిస్తున్నారు. అంత పెద్దఎత్తున పంటను ఇవి ఒక్క రోజులో ఆరగిస్తాయంటే వీటి వల్ల ఎంత ముప్పు ఉందో అర్థమవుతుంది. ఆఫ్రికా నుంచి ఇరాన్ పాకిస్తాన్ మీదుగా భారతదేశంలో ప్రవేశించిన ఈ మిడతల దండు ప్రస్తుతం మహారాష్ట్రలోని విదర్భను దాటి తెలంగాణ వైపు దూసుకొస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణకు అత్యంత సమీపంలో ఉన్నట్టు విస్త్రుత ప్రచారం జరుగుతోంది. చేతికొచ్చిన పంటతో రైతులు ధ్యాన్యాన్ని ఇళ్లకు తీసుకెళ్లే కీలక సమయంలో తెలంగాణ పంటలను మిడతలు కేవలం వారంలో తినేయగలవు.
మహరాష్ట్ర సరిహద్దులను దాటిన మిడతలు.. తెలుగు రాష్ట్రాల పరిస్థితేంటి..?
కోట్ల సంఖ్య లో ఇవి దినదిన ప్రవర్ధమానమై దాడికి తెగబడుతున్నాయి. మహరాష్ట్ర సరిహద్దు జిల్లాలతో పాటు గ్రామాలైన కాగజ్ నగర్, ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి జిల్లాల రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ పంటల పరిస్థితి ఏంటని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిడతలు జూన్ నాటికి నాలుగు రెట్లు పెరిగే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. అవి వాటి సంతతిని పెంచుకోకుండా చూడటం, వాటిని తరిమికొట్టడం వంటి చర్యలు ఇపుడు ప్రభుత్వం ముందున్న లక్ష్యంగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా మిడతల వలస వేగంగా ఉంటుందని వ్యవసాయ నిపుణులు చెప్పుకొస్తున్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది.
మిడతలను తరిమికొట్టొచ్చు.. ఆందోళన అవసరం లేదంటున్న వ్యవసాయ నిపుణులు..
రైతులు వ్యవసాయ శాఖ సూచనలు పాటిస్తూ పంటలను కాపాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.ఇందులో భాగంగానే వ్యవసాయ శాఖ మిడతల బారి నుంచి తప్పించుకోవడానికి రైతలకు కొన్ని సూచనలు చేస్తోంది. మిడతలు తమ పంటలలోకి రాకుండా డబ్బాలు, మెటల్ ప్లేట్లు, డ్రమ్ములు, రేడియో లేదా లౌడ్ స్పీకర్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలతో శబ్దం చేస్తే చాలావరకు అవి పోయే అవకాశం ఉందంటున్నారు అధికారులు. సాగు ఉన్న పొలాలలో మిడతల గుడ్ల దశను గమనిస్తే క్వినోల్ ఫాస్ పొడి మందులను పొలాల్లో చల్లాలని, దీనివల్ల వాటి గుడ్లు, పిల్ల పురుగులు నాశనమవుతాయని స్పష్టం చేస్తున్నారు. ఎండిన పొలాల్లో మంటలు రాజేస్తే మిడతల దండు లేదా పిల్ల దశ పురుగులు మంటల్లో పడి నాశనం అవుతాయని నిపుణులు సూచిస్తున్నారు.