సీఎం కేసీఆర్! ఓవైసీకి వేరే న్యాయం ఏమైనా ఉందా?: విజయశాంతి ఆగ్రహం
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రచార కమిటీ ఛైర్ పర్సన్ విజయశాంతి మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్పై విమర్శలు ఎక్కుపెట్టారు. కరోనావైరస్ నేపథ్యంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. కేసీఆర్కు సామాజిక మాధ్యమం ఫేస్బుక్ ద్వారా పలు ప్రశ్నలు సంధించారు.
Recommended Video
కుల, మతాలకతీతంగా..
‘దీప ప్రజ్వలన అంశంలో పార్టీల పరంగా రాజకీయ చర్చ ఈరోజు కూడా కొనసాగుతున్నట్లుగా తాజా పరిణామాలు చూస్తుంటే అర్ధమవుతోంది. కరోనా మహమ్మారి సమస్యకు సంబంధించి కుల,మతాలకు అతీతంగా ప్రజారోగ్య దృష్టిలో మాత్రమే నేను మొదటి నుండి నా స్పందనను తెలియజేస్తున్నాను' అని విజయశాంతి వ్యాఖ్యానించారు.
ప్రధాని పిలుపును ఓవైసీ అవహేళన చేస్తారా?
‘కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా ప్రాణాలొడ్డి పనిచేస్తున్న వైద్య సిబ్బందిపై దాడులను ఖండించడంతో పాటు.. ఇంకా అందుబాటులోకి రాని జమాతే వ్యక్తులను తక్షణమే ప్రభుత్వానికి సహకరించాలని నేను సూచించాను. దీనికి సంబంధించి ఎంఐఎం పార్టీ తరపున పిలుపు ఇస్తారని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఊహించారు. అయితే ఈ విషయంపై ఆలోచించకుండా... దీపాన్ని ఆరాధించే దేశంలోని అత్యధిక ప్రజల మనోభావాలకు సంబంధించిన దీప ప్రజ్వలన కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా సమర్థించిన నేపథ్యంలో... దీనికి సంబంధించి ప్రధాని ఇచ్చిన పిలుపును ఎంఐఎం అధినేత ఓవైసీ గారు అవహేళన చేస్తూ ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు' అని మండిపడ్డారు.
ఓవైసీపై కేసీఆర్ సర్కారు చర్యలుంటాయా?
‘మరి గతంలో తెలంగాణ సీఎంగారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ప్రధాని పిలుపును సోషల్ మీడియాలో అవహేళన చేసిన వారిపై చర్య తీసుకోమని డీజీపీ గారిని ఆదేశించారు కదా... గతంలో చెప్పిన విధంగా ఇప్పుడు ఓవైసీ గారిపై ప్రధానిని అవహేళన చేసినందుకు చర్యలు ఉంటాయా? లేక సామాన్యుడికి ఒక న్యాయం అసదుద్దీన్ గారికి ఒక న్యాయం అన్న చందంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తుందా? అనే విషయంపై తెలంగాణ సీఎం గారు స్పష్టత ఇవ్వాలి అని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారు' సీఎం కేసీఆర్ను విజయశాంతి నిలదీశారు.
స్వచ్ఛందంగా ముందుకు రావాలి..
‘జమాత్ సదస్సుకు వెళ్ళి తిరిగివచ్చినవారి వివరాలు స్వచ్ఛందంగా తెలియచేయకపోవడం వల్ల ఉత్పన్నమవుతున్న పరిణామాలను వారే తక్షణం నిలుపుదల చెయ్యాలి. ఇది ఆ వ్యక్తుల, వారి కుటుంబసభ్యులు, సమాజ శ్రేయస్సు దృష్ట్యా అవసరం. ఇది ఒక సమస్య. దీనిని యావత్ ముస్లిం సమాజానికీ ఆపాదించే ప్రయత్నం కూడా తీవ్రంగా అభ్యంతరకరం.
లక్షలాది బాధితులతో సతమతమవుతున్న అమెరికా, ఐరోపాల సమస్య చైనా వైపు గానీ లేదా అజాగ్రత్త వైపు సూచిస్తుంది కానీ, ఏ మతం వైపూ కాదు. కుల మత ప్రాంత వర్గ భేదాలకు అతీతంగా మనమంతా భారతీయులం. మనమంతా ఐక్యంగా ఉండాలి' అని విజయశాంతి పిలుపునిచ్చారు.