ఇదేం ఫ్రెండ్లీ పోలీసింగ్..? ఒళ్లు కందిపోయేలా కొట్టారు..! జన్మదిన వేడుకలో అపశ్రుతి..!
హైదరాబాద్ : నగరంలో స్నేహపూర్వక పోలీసు వ్యవస్థకు తూట్లు పొడిచారు. విచక్షణారిహితంగా విద్యార్థులు అనికూడా చూడకుండా ఒళ్లు కందిపోయేలా బాదిపడేసారు. ఇదంతా ఎక్కడో జరగలేదు. సిటీ నడిబొడ్డున బోయినపల్లిలో ఈ ఘటన జరిగింది. అర్థ రాత్రి శాంత్రి భద్రతలకు వారు భంగం తలపెట్టలేదు. వారు సంఘ విద్రోహ శక్తులు అసలే కాదు. జన్మదినం సందర్బంగా మొదలైన కోలాహలాన్ని ఆసారా చేసుకుని వేడుకకు హాజరైన స్నేహితులందరిని పోలీసులు నిర్థాక్షిణ్యంగా చితక బాదారు. దిక్కు తోచని బాదితులు పై అదికారులకు ఫిర్యాదు చేయడం మినహా ఏమీ చేయలేక పోయారు. అసలేంజరిగిందో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!!
బర్త్ డేకి వచ్చిన స్నేహితులను చితకబాదిన పోలీసులు..! ఇదేనా ఫ్రెండ్లీ పోలీస్ అంటున్న నగర వాసులు.!
స్నేహితుడి జన్మదిన వేడుకలకు వచ్చిన కాలేజీ విద్యార్థులను పోలీసులు విచక్షణారహితంగా చితకబాదారు. ఈ ఘటన బోయిన్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధితులు సందీప్, అభిషేక్లు రెండు రోజుల క్రితం బోయిన్పల్లి చిన్నతోకట్ట ప్రాంతానికి చెందిన దగడ సాయి జన్మదినం వేడుకకు హాజరయ్యారు. రెండు రోజుల క్రితం అదే ప్రాంతంలో తాడ్బండ్, బాలంరాయిలతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు, యువకులు సాయితో కేక్ కట్ చేయించి అతనికి శుభాకాంక్షలు తెలియజేసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
బర్త్ డే వేడుకలో సందడి..! న్యూసెన్న్ అంటూ కేసులు పెట్టిన పోలీసులు..!!
సాయి ఇంటి వద్ద యువకులు సందడి చేస్తూ అరుపులతో కేరింతలు కొడుతూ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. దీంతో స్థానికులకు ఇబ్బందిగా మారిందని ఓ గుర్తు తెలియని వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు యువకులను చెదరగొట్టే క్రమంలో లాఠీలకు పని చెప్పారని బాధితులు పేర్కొన్నారు.
విద్యార్థుల పై దాడి..! అమానుషంగా కొట్టిన పోలీసులు..!
అంతటితో ఆగకుండా నాయుడు కళాశాల విద్యార్థి అభిషేక్, ప్రైవేట్ ఉద్యోగి పుష్పరాజ్, ఒమేగా కళాశాల విద్యార్థి కళ్యాణ్, కేశవ్ మెమోరియల్ కళాశాల విద్యార్థి సందీ్పకుమార్, కారు మెకానిక్లు భానుప్రకాష్, అభిషేక్ యాదవ్లతోపాటు భరత్, మనీష్, శుభంలను అదుపులోకి తీసుకొని పోలీస్టేషన్కు తరలించారు. దీంతో సీఐ నందకిషోర్, ఎస్ఐ శ్రీనివాస్, గురుస్వామిలతో పాటు సిబ్బంది దుర్భాషలాడుతూ విచక్షణారహితంగా తమను ఎక్కడపడితే అక్కడ చితకబాదారని బాదితులు తెలిపారు. అంతేకాకుండా విద్యార్థులమని చూడకుండా కేసులు పెట్టి విడుదల చేసినట్లు బాధితులు ఆరోపించారు.
విద్యార్థులపై చేయి చేసుకోలేదంటున్న పోలీసులు..! మరి ఒళ్లు ఎందుకు కమిలిపోయినట్టు..!!
ఈ నేపథ్యంలో బాధితులు మానవ హక్కుల సంఘం, డీజీపీ, కమిషనర్ కార్యాలయాల్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ విషయమై సీఐ నందకిషోర్ను వివరణ కోరగా సాయి అనే యువకుడి జన్మదిన కార్యక్రమం సందర్భంగా యువకులు రాత్రిపూట పెద్ద సంఖ్యలో చేరుకుని గొడవ చేస్తున్నట్లు సమాచారం అందగా పెట్రోలింగ్ వాహనంతో అక్కడికి చేరుకున్న సిబ్బంది తొమ్మిది మందిని అదుపులోకి తీసుకొని పోలీసస్టేషన్కు తీసుకువచ్చారన్నారు. దీంతో నిబంధనల ప్రకారం వారిపై కేసు నమోదుచేసి వారి తల్లితండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించి పంపించామని, వారిపై చేయి చేసుకోలేదని సీఐ నందకిషోర్ చెప్పడం గమనార్హం.